Saturday, June 21, 2025
HomeతెలంగాణKaushikReddy Arrest: కౌశిక్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలి: కేటీఆర్

KaushikReddy Arrest: కౌశిక్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలి: కేటీఆర్

KaushikReddy Arrest: బెదిరింపుల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కౌశిక్ రెడ్డి అరెస్టును బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. శంషాబాద్ విమానాశ్రయంలో హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నిరంశకుశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అక్రమాలను, మంత్రుల అవినీతిని అడుగడుగునా ప్రశ్నిస్తున్నారు కాబట్టే ఆయనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఫైర్ అయ్యారు.

గత ఏడాదిన్నర కాలంగా కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు చేస్తున్న అన్యాయాలపై నిలదీస్తున్న కౌశిక్ రెడ్డిని తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టే కుట్ర అనేక నెలల నుంచి కొనసాగుతూనే ఉందన్నారు. ఇలాంటి చిల్లర చేష్టలు, పనికిరాని కేసులు, బీఆర్ఎస్ నేతల సంకల్పాన్ని, మనోధైర్యాన్ని ఎప్పటికీ దెబ్బతీయలేవని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యమని చెప్పుకునే రేవంత్ ఎమర్జెన్సీని తలపించేలా ప్రశ్నించే గొంతులపై అణచివేత చర్యలతో దారుణంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.

అసమర్ధ ముఖ్యమంత్రి ఆదేశాలతో అరెస్టు చేసిన కౌశిక్ రెడ్డిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. తమకు గౌరవ న్యాయస్థానాలపై సంపూర్ణ నమ్మకం ఉందని చెప్పారు. తమపై ఎన్ని వందల తప్పుడు కేసులు పెట్టినా రేవంత్ నియంత పాలనపై.. ప్రజల పక్షాన బీఆర్ఎస్ నేతలు పోరాడుతూనే ఉంటారని కేటీఆర్‌ వెల్లడించారు.

ఇక మరో మాజీ మంత్రి హరీశ్ రావు కూడా కౌశిక్ రెడ్డి అరెస్టును ఖండించారు. పాలన గాలికి వదిలేసి, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటమే కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిగా పెట్టుకున్నదని విమర్శించారు. రైతుల నుంచి ప్రజా ప్రతినిధుల వరకు కేసుల పేరుతో అందరినీ వేధిస్తూ రాక్షసానందం పొందుతున్నదని ఆగ్రహించారు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే రేవంత్, ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నారని దుయ్యబట్టారు. కేసులు, అరెస్టులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవని స్పష్టం చేశారు. అక్రమంగా అరెస్ట్ చేసిన కౌశిక్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

కాగా వరంగల్ జిల్లా కమలాపూర్ మండలంలోని వంగపల్లిలో మనోజ్ రెడ్డి అనే వ్యక్తి గ్రానైట్ క్వారీ నిర్వహిస్తున్నారు. తనకు రూ.50 లక్షలు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి బెదిరిస్తున్నట్లు మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు శనివారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్ పోర్టులో కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News