India Players New Records: ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఆటగాళ్లు దుమ్మురేపారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ మంచి శుభారంభం అందించారు. ఇంగ్లాండ్ బౌలర్లను నిలకడగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ 42 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన అరంగేట్ర ఆటగాడు సాయి సుదర్శన్ డకౌట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. ఆ తర్వాత కెప్టెన్ గిల్ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు.
జైస్వాల్ తో కలిసి ఇంగ్లీష్ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. ఇద్దరు కలిసి చూడచక్కని షాట్లు కడుతూ అలరించారు. ఈ క్రమంలోనే యశస్వి సెంచరీ నమోదుచేశాడు. ఆ కాసేపటికే పెవిలియన్ చేరాడు. తర్వాత రిషభ్ పంత్ తనదైన శైలిలో ధాటిగా ఆడాడు. ఇక గిల్ కూడా కెప్టెన్ ఇన్నింగ్స్ తో సెంచరీ చేసి శభాష్ అనిపించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 359/3 పరుగులతో టీమిండియా పటిష్ట స్థితిలో ఉంది. అయితే ఈ మ్యాచ్ లో భారత ఆటగాళ్లు పలు రికార్డులు బద్దలు కొడుతున్నారు.
ఇంగ్లాండ్ గడ్డపై ఆడుతున్న తొలి టెస్టులోనే జైస్వాల్ సెంచరీ కొట్టి అదరగొట్టాడు. దీంతో లెజెండ్ క్రికెటర్ సర్ డాన్ బ్రాడ్మన్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇంగ్లాండ్ పై అత్యధిక సగటుతో రికార్డు సృష్టించాడు. ఈ దేశాల్లో ఆడిన 10 ఇన్నింగ్స్లో 90.33 సగటుతో 813 పరుగులు సాధించాడు. బ్రాడ్ మన్ 63 ఇన్నింగ్స్ల్లో 89.78 సగటుతో 5,028 పరుగులు చేశాడు.
ఇక ఇదే మ్యాచ్లో అర్ధశతకంతో చెలరేగిన వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ భారత దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనీ రికార్డును బ్రేక్ చేశాడు. సేనా దేశాల(దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా)పై అత్యధిక సగటుతో మహీ రికార్డు బద్దలు కొట్టాడు. అలాగే టెస్టు క్రికెట్లో 3వేల పరుగులు పూర్తి చేసిన రెండో భారత వికెట్ కీపర్గానూ పంత్ నిలిచాడు. అంతేకాకుండా అత్యంత వేగంగా 3వేల పరుగులు చేసిన ఆసియా వికెట్ కీపర్గానూ చరిత్ర నెలకొల్పాడు.