Heavy Rush in Tirumala: తిరుమల కొండపై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువులు తాపత్రయపడుతూ ఉంటారు. ప్రతిరోజు స్వామి వారిని వేలాది మంది దర్శించుకుని పులకించిపోతారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారిని దర్శించుకుంటే తమకు మంచి జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఎన్నో వ్యయప్రయాసాలు ఎదుర్కొని మరీ కొండపైకి చేరుకుని స్వామి వారికి అత్యంత భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు. దీంతో భక్తుల రద్దీ ఎప్పుడూ ఉంటుంది.
వేసవి సెలవుల్లో మాత్రం మరింత రద్దీగా ఉంటుంది. వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు ప్రారంభమైనా సరే భక్తుల రద్దీ మాత్రం తగ్గడం లేదు. దీంతో శనివారం తిరుమల కొండపై భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. అంతేకాదు బయట ఉన్న శిలాతోరణం వరకు క్యూలైనల్లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 24గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ దర్శనానికి సుమారు 7 గంటల సమయం పడుతుండగా.. 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.
అధిక రద్దీతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు భక్తులు వాపోతున్నారు. సర్వదర్శనం క్యూ లైన్లో ఫ్యాన్ లు ఉన్నా వేయడం లేదని.. సిబ్బందికి రెండు గంటల నుండి చెబుతున్నా పట్టించుకోవట్లేదని మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం స్వామివారిని 76,181 మంది భక్తులు దర్శించుకోగా.. 33,874 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.88 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
మరోవైపు కొండపై ప్రైవేట్ వాహనాల ఓనర్లు భక్తుల నుంచి అడ్డగోలుగా దోచుకుంటున్నారని అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు. ఇకపై తిరుమల తిరుపతిలో ఉచితంగా బస్సులు నడపాలని నిర్ణయించారు. తిరుపతి -తిరుమల మధ్య తిరిగే బస్సులతో పాటు.. తిరుమలలోని ఇతర ముఖ్య ప్రాంతాలకు వెళ్లాలనుకునే భక్తులకు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. ఇందులో భాగంగా తొలి దశలో దాదాపు 150 బస్సులు అందుబాటులోకి రానున్ానయి. టీటీడీ ఇప్పటికే పరిమిత సంఖ్యలో ఉచిత ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతోంది.
Tirumala: తిరుమలలో భక్తులు కిటకిట.. సర్వదర్శనానికి ఎన్ని గంటలంటే..?
సంబంధిత వార్తలు | RELATED ARTICLES