Heavy Flood Inflow: ఎగువున కురుస్తున్న వర్షాలతో జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. కృష్ణా నదిపై నిర్మించిన జూరాల, శ్రీశైలం జలాశయాలకు వరద ప్రవాహం రోజురోజుకు పెరుగుతున్నది. శనివారం ఉదయం వరకు జలాశయాలలో నీటి ప్రవాహం వివరాలు ఇలా ఉన్నాయి. జోగుళాంబ గద్వాల్ జిల్లా కుర్వపూర్ గ్రామానికి సమీపంలో ఉన్న జూరాల ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 85 వేల క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 82వేల 250 క్యూసెక్కులుగా ఉంది. 7 గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516. మీటర్లు. ప్రస్తుత నీటిమట్టం 317.570 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 7.773 టీఎంసీలుగా ఉన్నది.
శ్రీశైలం జలాశయానికి 81,944 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం నీటిమట్టం 885 అడుగులకు గాను 851.40 అడుగులుగా, నీటి సామర్థ్యం 215.8070 టీఎంసీలకు గాను 83.1470 టీఎంసీలుగా ఉన్నది. అవుట్ ఫ్లో నమోదు కాలేదు. కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కాలేదు.
ALSO READ: https://teluguprabha.net/andhra-pradesh-news/devotees-heavy-rush-in-tirumala/
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ర్టంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. శనివారం ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, జయశంకర్ భూపాల పల్లి, మహబూబాబాద్ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
అయితే, రాష్ర్టంలో కొన్ని చోట్ల ముందస్తు వర్షాలు పడడంతో ఇప్పటికే రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నం అయ్యారు. ఎరువులు, విత్తనాల కొనుగోళ్లలో బిజీబిజీగా ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం వానా కాలం పంటలకు పెట్టుబడి సాయం రైతు భరోసా పథకం కింద ఎకరానికి రూ. 6000 జమ చేస్తోంది. ఇప్పటికే ఆయా జిల్లాల రైతుల అకౌంట్లలో నగదు జమ చేసింది. మూడు, నాలుగు రోజుల్లో రైతుల అందరి అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు జమ అవుతాయని, ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రులు చెప్పిన విషయం తెలిసిందే.