Saturday, June 21, 2025
HomeతెలంగాణHarish Rao: హరీశ్ రావు సభలో 'రప్పా రప్పా' ప్లకార్డులు

Harish Rao: హరీశ్ రావు సభలో ‘రప్పా రప్పా’ ప్లకార్డులు


Harish Rao: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ‘పుష్ప2’ మూవీలోని ‘రప్పా రప్పా’ డైలాగ్ తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఏపీలో ఇటీవల వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పల్నాడు పర్యటన సందర్భంగా ఆ పార్టీ కార్యకర్త రప్పా రప్పా నరుకుతాం అంటూ ప్లకార్డు ప్రదర్శించిన విషయం విధితమే. ఈ ప్లకార్డుపై రాజకీయ దుమారం రేగింది. ఈ ప్లకార్డుకు మద్దతుగా జగన్ వ్యాఖ్యానించగా.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలోనే రప్పా రప్పా ప్లకార్డు ప్రదర్శించిన రవితేజ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.

ఇప్పుడు ఈ డైలాగ్ తెలంగాణ రాజకీయాలకూ పాకింది. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు ఆధ్వర్యంలో తలపెట్టిన రైతు ధర్నాలో రప్పా రప్పా ప్లకార్డులు దర్శనమిచ్చాయి. పటాన్ చెరు నియోజకవర్గ రైతులకు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిన్నారంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిరవ్హించారు. ఈ ధర్నాలో హరీష్ రావుతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా “2028లో రప్పా.. రప్పా.. 3.0 లోడింగ్” అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ ప్లకార్డుల ధర్నాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ ధర్నాలో హరీష్‌ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ సర్వే చేసిన మళ్ళీ అధికారంలోకి బీఆర్ఎస్ వస్తుంది అని చెబుతున్నాయని జోస్యం చెప్పారు. రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందన్నారు. రైతులందరికీ రైతు భరోసా అందించే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఇది ఆరంభం మాత్రమే అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేసీఆర్, కేటీఆర్ లపై అక్రమ కేసులు పెట్టి సీఎం రేవంత్ రెడ్డి ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారని ఆరోపించారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.


సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News