Sunday, June 22, 2025
HomeఆటRishabh Pant: సిక్స‌ర్‌తో రిష‌బ్ పంత్ సూపర్ సెంచ‌రీ

Rishabh Pant: సిక్స‌ర్‌తో రిష‌బ్ పంత్ సూపర్ సెంచ‌రీ

Rishabh Pant Century: ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన తొలి టెస్టులో భారత ఆటగాళ్లు అదరగొడుతున్నారు. ఓవర్ నైట్ స్కోర్ 359/3 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా అదే దూకుడుతో ఆడుతోంది. 65 పరుగులతో రెండో ఆటను కొనసాగించిన వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ ఫాస్ట్ గా ఆడాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ సెంచరీ పూర్తి చేశాడు. 99 పరుగుల వద్ద ఏమాత్రం భయం లేకుండా సిక్సర్ తో సూపర్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు.

సెంచరీ చేసిన సంద్భంగా పంత్ ఫల్టీ కొట్టి తనదైన ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. రిషభ్ సెంచరీలో 10 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఓవరాల్ గా పంత్ కెరీర్ లో ఇది ఏడో సెంచరీ కాగా ఇంగ్లాండ్ గడ్డపై మూడో శతకం కావడం విశేషం. అంతేకాకుండా ఈ సెంచరీతో పంత్ మరో రికార్డును నమోదు చేశాడు. టెస్టుల్లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన భారత వికెట్ కీప‌ర్‌గా నిలిచాడు. ఈ క్ర‌మంలో టీమిండియా దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోని రికార్డును బ్రేక్ చేశాడు. టెస్టుల్లో పంత్ ఏడు సెంచరీలు చేయగా.. ధోనీ 6 సెంచరీలు, వృద్ధిమాన్ సాహా 3 సెంచ‌రీలు చేశారు.

పంత్ సెంచరీ అనంతరం కెప్టెన్ గిల్ 147 పరుగుల వద్ద తన వికెట్ పారేసుకున్నాడు. షోయబ్ బషీర్ వేసిన బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి డీప్ వికెట్ లో క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అనంతరం బరిలోకి వచ్చిన కరుణ్ నాయర్ డకౌట్ గా వెనుదిరిగాడు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత భారత జట్టులో చోటు సంపాందించుకున్న నాయర్.. డకౌట్ కావడం తీవ్రంగా నిరాశపరిచింది. ప్రస్తుతం భారత్ స్కోర్ 450/5 పరుగులుగా ఉంది. క్రీజులో పంత్(131), జడేజా(1) ఉన్నారు.

మొత్తంగా భారత తొలి ఇన్నింగ్స్ లో మూడు సెంచరీలు నమోదుకావడం గమనార్హం. తొలుత ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీ చేయగా.. తర్వాత కెప్టెన్ గిల్, అనంతరం వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ శతకం బాది టీమిండియాకు భారీ స్కోర్ అందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News