Kadapa Municipal Corporation: కడప మున్సిపల్ కార్పొరేషన్ లో నెలకొన్న కుర్చీ వివాదం ఇప్పుడలా ముగిసేలా లేదు. రోజుకో ట్విస్టుతో సినిమాను తలపిస్తోంది. మున్సిపల్ కమిషనర్ సహా ఏడుగురు ఉద్యోగులు మేయర్ సురేశ్ బాబు షోకాజ్ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది.
శుక్రవారం ఉదయం కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం నిర్వహణకు మేయర్ నిర్ణయించారు. అయితే కౌన్సిల్ హాలు వేదికపై మధ్యలో మేయర్ సీటు పక్కనే కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి, ఎమ్మెల్సీలు రాజగోపాల్ రెడ్డి, రామచంద్రారెడ్డికి కూడా అధికారులు కుర్చీలు ఏర్పాటు చేశారు. దీంతో తన అనుమతి లేకుండా తన పక్కనే కుర్చీలు ఎలా ఏర్పాటు చేస్తారని మేయర్ మండిపడ్డారు. తన ఛాంబర్ లోనే సమావేశం నిర్వహిస్తానని చెప్పారు.
అయితే నిబంధనల ప్రకారం కౌన్సిల్ హాలులో సమావేశం ఏర్పాటు చేయకుండా మేయర్ ఛాంబర్లో ఎలా నిర్వహిస్తారని టీడీపీ ఎమ్మెల్యే మాధవీ రెడ్డి ప్రశ్నించారు. ఈ గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో సమావేశం వాయిదా పడింది. దీంతో మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి పేరుతో మేయర్ సురేష్ బాబు ఛాంబర్కు అధికారులు నోటీసు అంటించారు. కౌన్సిల్ హాలులో ఉదయం 11 గంటలకు ఏర్పాటుచేసిన సర్వసభ్య సమావేశానికి అధికారులు హాజరైనా మేయర్తో పాటు కొందరు వైసీపీ కార్పొరేటర్లు ఎందుకు హాజరుకాలేదని నోటీసుల్లో పేర్కొన్నారు. సభ్యులు గైర్హాజరుతో కోరం లేని కారణంగా సర్వసభ్య సమావేశం వాయిదా పడిందని తెలిపారు. సమావేశానికి హాజరుకాకపోవడంపై వివరణ ఇవ్వాలని కోరారు.
ఇదిలా ఉండగానే తాజాగా తనకు నోటీసులు జారీ చేసిన మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డితో పాటు మరో ఏడుగురు ఉద్యోగులకు మేయర్ సురేశ్ బాబు నోటీసులు జారీ చేయడం గమనార్హం. సర్వసభ్య సమావేశం నేపథ్యంలో విధులు సరిగా నిర్వహించలేదని పేర్కొన్నారు. తన ఛాంబర్ లో ఏర్పాటుచేసిన సమావేశానికి ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. సమావేశానికి ఎందుకు రాలేదో వారం రోజుల్లో సరైన వివరణ ఇవ్వాలని తెలిపారు.
Kadapa Municipal Corporation: మున్సిపల్ ఉద్యోగులకు నోటీసులు.. మేయర్ సంచలన నిర్ణయం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES