Rain Alert for Telangana: తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త అందించింది. రాబోయే రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో సాయంత్రానికి వాతావరణం చల్లబడి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. గంటకు 40 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే సూచనలున్నాయని పేర్కొంది.
వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, రంగారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి – కొత్తగూడెం, ఖమ్మం, మేడ్చల్ మల్కాజ్గిరి, వరంగల్, నాగర్కర్నూల్, కామారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే పిడుగులు పడే అవకాశం ఉండటంతో పొలం పనులు చేసే వారు, గొర్రెల కాపరులు జాగ్రత్తగా ఉండాలని.. చెట్లు, గుడిసెలు కిందకు వెళ్లొదని హెచ్చరించారు.
ఇక రుతుపవనాలు మందగించడంతో వరుణుడి జాడ కనపడటం లేదు. దీంతో వాతావరణం వేడిగా ఉంటుంది. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తొలకరి పలకరింపుతో హర్షించిన రైతులు దుక్కి దున్ని సాగుకు సిద్ధమయ్యారు. అయితే జాన్ నెలలో వర్షాలు పడకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరుణుడి రాక కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.