Monday, June 23, 2025
Homeనేషనల్By-Election Counting Update: నాలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న కౌంటింగ్

By-Election Counting Update: నాలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న కౌంటింగ్

By-Election Counting: నాలుగు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈరోజు ఉదయం 8 గంటలకు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. గుజరాత్‌లోని విసావదర్, కడి స్థానాలతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని కాళీగంజ్, కేరళలోని నీలాంబూరు, పంజాబ్‌లోని లూథియానా వెస్ట్ నియోజకవర్గాలకు ఈనెల 19న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పటి వరకు ట్రెండ్స్‌ను బట్టి 5 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ రెండు, కాంగ్రెస్, ఆప్, టీఎంసీ ఒక చోట ఆధిక్యంలో ఉన్నాయి.


తొలి ఫలితాల సరళి ప్రకారం కేరళలోని నీలాంబూరు స్థానంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) అభ్యర్థి ఆర్యదన్ షౌకత్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి మోహన్ జార్జ్, సీపీఎం అభ్యర్థి ఎం. స్వరాజ్ వెనుకంజలో ఉండగా విసావదర్, లుధియానాలో ఆప్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. టీఎంసీ అభ్యర్థి లీడ్‌లో కొనసాగుతున్నాడు. ఈ ఉప ఎన్నికలను అధికార ఎన్డీయే కూటమితో పాటు విపక్ష ఇండియా కూటమి కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొన్ని రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఉప ఎన్నికలు ఒకరకంగా దిక్సూచిగా మారనున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ALSO READ:https://teluguprabha.net/telangana-news/surveyor-tejeshwar-murder-case-update/
కేరళలోని నీలాంబూరు నియోజకవర్గం కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీకి ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ స్థానం ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. లెఫ్ట్ మద్దతుతో రెండుసార్లు గెలిచిన ఓవీ అన్వర్ కాంగ్రెస్‌ వైపు మారడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.


గుజరాత్‌లో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. విసావదర్ అసెంబ్లీ స్థానాన్ని 2007 నుంచి బీజేపీ గెలుచుకోలేకపోయింది. 2023లో అప్పటి ఆప్ ఎమ్మెల్యే భూపేంద్ర భయానీ రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ ఉప ఎన్నికలో బీజేపీ నుంచి కిరీట్ పటేల్, కాంగ్రెస్ నుంచి నితిన్ రాన్‌పరియా, ఆప్ నుంచి మాజీ గుజరాత్ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా పోటీ పడ్డారు. కడి స్థానం మెహసానా జిల్లా పరిధిలో ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే కర్సన్ సోలంకి ఫిబ్రవరిలో మరణించడంతో ఉప ఎన్నిక అవసరమైంది. బీజేపీ నుంచి రాజేంద్ర చావ్డా, కాంగ్రెస్ నుంచి రమేశ్ చావ్డా, ఆప్ నుంచి జగదీష్ చావ్డా బరిలో నిలిచారు.

ALSO READ: https://teluguprabha.net/telangana-news/krmb-meeting-on-the-27th-of-this-month/
పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లా పరిధిలోని కాళీగంజ్ నియోజకవర్గంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యే నసీరుద్దీన్ అహమద్ ఫిబ్రవరిలో మరణించడంతో ఉప ఎన్నిక జరిగింది. ఆయన కుమార్తె అలిఫా అహమద్ టీఎంసీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. బీజేపీ అభ్యర్థిగా ఆశిష్ ఘోష్, సీపీఎం మద్దతుతో కాంగ్రెస్ అభ్యర్థిగా కబిల్ ఉద్దీన్ షేక్ పోటీ పడుతున్నారు

గుజరాత్‌లోని కడి, బెంగాల్‌లోని కాళీగంజ్, పంజాబ్‌లోని లూథియానా వెస్ట్ – శాసనసభ్యుల మరణాల కారణంగా ఖాళీ కాగా, గుజరాత్‌లోని విసావదర్, కేరళలోని నీలాంబూరులో సిట్టింగ్ ఎమ్మెల్యేల రాజీనామాలతో పోలింగ్ అవసరమైంది. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. తుది ఫలితాలు వెలువడే వరకు ఉత్కంఠ కొనసాగనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News