TG Cabinet Meeting Today: కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బనకచర్ల ప్రాజెక్టు, రాజీవ్ యువ వికాసం పథకం అమలు, కాళేశ్వరం కమిషన్ తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు.
ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని అభ్యంతరం చెబుతోంది. ఈమేరకు అఖిలపక్ష ఎంపీలతో సమావేశం నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి సలహాలు తీసుకున్నారు. అనంతరం నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఢిల్లీకి వెళ్లి కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్ను కలిసి తమ అభ్యంతరాలను తెలిపారు. ఈ నేపథ్యంలో బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వాన్ని చర్చలకు ఆహ్వానించాలా..? కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలా..? లేదా కోర్టును ఆశ్రయించాలా..? అనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు.
ఇక మరో కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించనున్నారు. బీసీ రిజర్వేషన్ల వివాదం హైకోర్టులో ఉన్నందున తీర్పు వచ్చే వరకు వేచి చూడాలా..? పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలను నిర్వహించాలా..? అనే అంశంపై చర్చించే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపితే ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలా..? పరిషత్ ఎన్నికలు నిర్వహించాలా..? అనే దానిపై చర్చించనున్నారు.
ఈ రెండు ప్రధాన అంశాలతో పాటు అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయడంపైనా నిర్ణయం తీసుకోనున్నారు. అంబేడ్కర్ విదేశీ విద్య పథకం, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల అంశాలపైనా కూడా చర్చించే అవకాశాలున్నాయి. ఇవే కాకుండా మరికొన్ని అంశాలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.