Rohit Sharma Emotional Post: టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ఆట తీరుతో కోట్లాది మంది అభిమానులు దక్కించుకున్నాడు. ముఖ్యంగా తన కెప్టెన్సీలో భారత జట్టుకు టీ20 వరల్డ్, ఛాంపియన్స్ ట్రోఫీలు సాధించి పెట్టాడు. ఇటీవలే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన హిట్ మ్యాన్.. ప్రస్తుతం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. అంతకుముందు టీ20లకు గుడ్ బై చెప్పడంతో కేవలం వన్డేలకు మాత్రమే నాయకత్వం వహిస్తున్నాడు. తాజాగా తన అరంగేట్రం నాటి సంగతిని తలుచుకుని భావోద్వేగానికి గురయ్యాడు.
ఈమేరకు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టి నేటితో 18ఏళ్లు పూర్తి చేసుకున్నాడు రోహిత్. 2007లో జూన్ 23వ తేదీని ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ తో అరంగేట్రం చేశాడు. ఇంటర్నేషన్ క్రికెట్ లో అరంగేట్రం చేసి 18 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టాడు. ఎప్పటికీ కృతజ్ఞతతో అంటూ డెబ్యూ మ్యాచ్ హెల్మెట్ షేర్ చేశాడు. హెల్మెంట్ మీద 23.06.07 అని క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో హిట్ మ్యాన్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
20 ఏళ్ల వయసులో టీమిండియా జెర్సీ ధరించిన రోహిత్ శర్మకు ప్రస్తుతం 38 ఏళ్లు. 2027లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందుకే టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డే వరల్డ్ కప్ గెలవడం రోహిత్ చిరకాల కల. 2023లో భారత్ తో జరిగిన వరల్డ్ కప్ లో అద్భుతం ఆడి టీమిండియా ఫైనల్ చేరుకుంది. అయితే ఫైనల్ మ్యాచులో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి కప్ ను చేజార్చుకుంది. దీంతో రోహిత్ శర్మ తీవ్రంగా బాధపడిన సంగతి తెలిసిందే.
ఇప్పటివరకు 273 వన్డేల్లో 32 సెంచరీలు, 58 అర్ధ సెంచరీలతో 11,168 పరుగులు రాబట్టాడు. టెస్టుల్లో 67 మ్యాచ్లు ఆడిన రోహిత్.. 40.57 సగటుతో 4,301 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 159 టీ20 మ్యాచ్ ఆడి 4,231 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 32 అర్ధ సెంచరీలు ఉన్నాయి.