High court reserves verdict on Local Body Elections: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్టేట్ వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై దాఖలైన పిటిషన్లపై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. త్వరగా ఎన్నికలైనా నిర్వహించండని లేదా పాత సర్పంచ్ లనే కొనసాగించండి అని పిటిషనర్లు వాదనలు వినిపించారు. దీంతో ఎన్ని రోజుల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది.
రిజర్వేషన్లు, వార్డు డివిజన్ ప్రక్రియ పూర్తి అయి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం 30 రోజులు సమయం అడగ్గా.. రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం 60 రోజుల పాటు గడువు కావాలని కోరింది. అయితే గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్న సర్కార్ ఎందుకు నిర్వహించలేదని క్వశ్చన్ చేసింది. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది.
కాగా 2024, ఫిబ్రవరి 1వ తేదీతో సర్పంచ్ ల పదవీ కాలం ముగిసిపోయింది. ఇక ఎంపీటీసీ సభ్యుల పదవీ కాలం 2024 జులై 5తో ముగిసింది. వాస్తవంగా నిబంధనల ప్రకారం ఆరు నెలల లోపు ఎన్నికలు నిర్వహించాలి. అయితే ప్రభుత్వం మాత్రం ఇంతవరకు ఎన్నికలు నిర్వహించకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నిధులు లేక గ్రామాల్లో అభివృద్ధి జరగడం లేదని సర్పంచులు వాపోతున్నారు.
ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే అధికారులు ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ జరిగే మంత్రివర్గం సమావేశంలోనూ ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు బీసీ రిజర్వేషన్ల అంశం కూడా హైకోర్టు పరిధిలో ఉంది. తాజాగా ఎన్నికల నిర్వహణపై కోర్టు తీర్పు రిజర్వ్ చేయడం.. ప్రభుత్వం 30 రోజుల సమయం అడగడం చూస్తుంటే మరో రెండు నెలల్లోనే ఎన్నికలు జరగడం ఖాయంగా ఉంది.