Tuesday, June 24, 2025
Homeఆంధ్రప్రదేశ్YS Jagan: భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలం.. జగన్ ఆగ్రహం

YS Jagan: భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలం.. జగన్ ఆగ్రహం

YS Jagan questions to CM Chandrababu: పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా జగన్ కాన్వాయ్ కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి మృతి ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి జగన్ కారు డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేయగా.. కారులో జగన్ తో పాటు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు విడదల రజినీ, పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ2గా జగన్ పేరు చేర్చారు.

దీనిపై జగన్ తీవ్రంగా స్పందించారు. సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. తనకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా సుదీర్ఘ ట్వీట్ చేశారు. తన పర్యటనలపై ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారని చంద్రబాబును ప్రశ్నించారు. కార్యకర్తలను కలవకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు.

గతంలో మీరు గానీ, మీ మిత్రుడు పవన్ కల్యాణ్ గానీ పర్యటనలు చేసినప్పుడు తామెప్పుడైనా ఇలాంటి ఆంక్షలు విధించామా? అని నిలదీశారు. ప్రతిపక్ష నాయకుడిగా పార్టీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లడం, రైతులు, ప్రజలకు సంఘీభావం తెలపడం తప్పా అని ప్రశ్నించారు. జడ్ ప్లస్ కేటగిరీ భద్రత అనేది మాజీ ముఖ్యమంత్రులకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొన్నారు. జడ్ ప్లస్ భద్రత కలిగిన మాజీ ముఖ్యమంత్రి పర్యటనకు తగిన భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుందని గుర్తుచేశారు.

జనం ఎక్కువగా ఉన్నప్పుడు, జడ్ ప్లస్ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం చుట్టూ రోప్ పార్టీ ఉండాల్సిన అవసరం లేదా? ప్రశ్నించారు. ఒకవేళ భద్రత కల్పించి ఉంటే, వాహనం కింద మనుషులు ఎలా పడగలుగుతారు? అన్నారు. మీరు భద్రత కల్పించలేదన్నది నిజమా, లేక వాహనం కింద ఎవరూ పడలేదన్నది నిజమా? అని నిలదీశారు. ఈ ఘటనపై ఆరోజు జిల్లా ఎస్పీ ఇచ్చిన స్టేట్‌మెంట్ సంగతి ఏమిటని ప్రస్తావించారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇటువంటి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని జగన్ ఆరోపించారు.

సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాల గ్రామానికి వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు జరిగిన దురదృష్టకర ఘటన తన దృష్టికి వచ్చిందని తెలిపారు. వెంటనే తమ పార్టీ నాయకులకు చెప్పి ఆసుపత్రికి తరలించామన్నారు. అయితే ప్రాణాలు కోల్పోయిన విషయం తెలుసుకుని ఆ కుటుంబాన్ని పరామర్శించి, రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని ఆదేశించానని పేర్కొన్నారు. కానీ తమపై విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News