Traffic Inspector stealing four bags of clothes: సోషల్ మీడియా వచ్చాక ఎవరు ఏ పనిచేసినా ఇట్టే వైరల్ అయిపోతుంది. తాజాగా ఓ బట్టల దుకాణం నుంచి నాలుగు దుస్తుల బ్యాగులను పోలీసే దొంగలించిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
అసలేం జరిగిందంటే…
మీరట్ కు చెందిన భగత్ సింగ్ మార్కెట్ లో సింఘాల్ గార్మెంట్స్ పేరుతో సీతారాం అనే వ్యక్తికి వస్త్ర దుకాణం ఉంది. ఈ నెల 10న అతడి షాపుకు ఓ ట్రాఫిక్ సబ్ ఇన్ స్పైక్టర్ వచ్చి చాలాసేపు అక్కడ నిలబడి ఉన్నాడు. ఓనర్, పనివాడు కొంచెం అదమరచి ఉన్న సమయంలో టేబుల్ పై ఉన్న నాలుగు బట్టల బ్యాగులను అతడు దొంగలించాడు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులకు అందజేశాడు. అంతేకాకుండా ఆ ట్రాఫిక్ సబ్ ఇన్ స్పైక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఈ కేసులే నిందితుడైన టీఎస్ఐ సుమిత్ వశిష్ట్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు టీఎస్ఐ సుమిత్ ను విచారించగా షాపు బయట ఉన్న ఆక్రమణను తొలగించేందుకు అక్కడకు వెళ్లినట్లు చెప్పాడు. తన మాటలను బట్టల షాపు యజమాని పట్టించుకోకపోవడంతో అందరి దృష్టిని ఆకర్షించేందుకు కౌంటర్ నుంచి బట్టల బ్యాగులు తీసుకున్నట్లు అతను చెప్పాడు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తును నగర ఎస్పీ ఆయుష్ విక్రమ్ సింగ్ కు ఎస్ఎస్పీ అప్పగించినట్లు తెలుస్తుంది. ఈ వీడియోను యూపీకు చెందిన సచిన్ గుప్తా అనే వ్యక్తి తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేశాడు. అది కాస్తా ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.