MP Raghunandan rao reaction on Threatening call: చంపేస్తామంటూ మావోయిస్టుల పేరుతో తనకు వచ్చిన బెదిరింపు కాల్ పై మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇలాంటి బెదిరింపు కాల్స్ కు బీజేపీ నాయకులు, కార్యకర్తలు భయపడేది లేదని తేల్చిచెప్పారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
ఈ వీడియోలో ఆయన ఏమన్నారంటే.. “మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడెంలోని ఓ పాఠశాల కార్యక్రమంలో ఉండగా ఓ నెంబర్ నుంచి తనకు ఫోన్ వచ్చింది. మధ్యప్రదేశ్ నుంచి పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీ నుంచి మాట్లాడుతున్నాని తెలిపారు. మధ్యప్రదేశ్ నుంచి మావోయిస్టులు ఇప్పుడే బయలుదేరారని.. ఇవాళ అర్థరాత్రి 12 గంటల లోపు రఘునందన్ రావును చంపేస్తామని హెచ్చరించారు. ఆ ఫోన్ నా పీఏ లిఫ్ట్ చేశారు. మళ్లీ రెండో సారి ఫోన్ చేసి ఈరోజు అర్థరాత్రి వరకే డెడ్ లైన్ జాగ్రత్తగా ఉండమని వార్నింగ్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ ఆపేందుకు మావోయిస్టు పార్టీ ఏదైనా సెన్సేషన్ కోసం ప్రయత్నిస్తోందా? తెలియడం లేదన్నారు. ఈ క్రమంలో ఎవరిని బలితీసుకోబోతున్నారో. అయినా కానీ తాము ఎలాంటి ఆందోళన చెందడం లేదు” అని వెల్లడించారు.
కాగా ఇవాళ మధ్యాహ్నం మేడ్చల్ జిల్లా దమ్మాయి గూడలో ఓ కార్యక్రమంలో ఉండగా ఎంపీ రఘునందర్ రావును చంపేస్తామంటూ మావోయిస్టుల నుంచి బెదిరింపు కాల్ రావడం రాష్ట్రంలో కలకలం రేపింది. సాయంత్రంలోగా చంపేస్తామంటూ ఓ ఆగంతకుడు పీపుల్స్ వార్ మావోయిస్టు పేరుతో ఫోన్ చేశాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మావోయిస్టునంటూ బెదిరించాడు. వెంటనే డీజీపీ, మెదక్ ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు ఎంపీ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టినఆపరేషన్ కగార్ లో భాగంగా ఇప్పటికే అనేక మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మవోయిస్టుల పేరుతో చంపేస్తామంటూ బెదిరింపు కాల్ రావడం సంచలనంగా మారింది.