Leaders about Emergency Rule: 50 ఏళ్ల నాటి ఎమర్జెన్సీ చీకటిరోజులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. ఒకే కుటుంబాన్ని అధికారంలో ఉంచడానికి మాత్రమే ఎమర్జెన్సీ విధించారని ఆయన ఆరోపించారు. ఇది భారత ప్రజాస్వామ్యంలో అత్యంత చీకటి అధ్యాయమని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి మరి లక్షలాది మందిని జైల్లో పెట్టారని మండిపడ్డారు. పత్రికా స్వేచ్ఛను హరించారని ఫైర్ అయ్యారు. తమ స్వార్థం కోసం ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన వారిని దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరన్నారు. ఆనాటి నియంతులను క్షమించకూడదన్నారు. అలాంటి రోజును మళ్లీ దేశంలో తీసుకురామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
దేశంలో ఎమర్జెన్సీ పాలనకు నేటికి 50 ఏళ్లు అని మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. 1975 జూన్ 25 నుండి 21 నెలలపాటు ఎమర్జెన్సీ పాలన పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, దేశ ప్రజల గొంతును నొక్కేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికార దాహానికి ఎమెర్జెన్సీ పాలన ఓ నిదర్శనమని పేర్కొన్నారు. అధికారాన్ని నిలుపుకోవడానికి రాజ్యాంగ విరుద్దంగా ఎన్ని అడ్దదారులైన తొక్కేందుకు, చివరకు ప్రజల ప్రాణాలను తీసేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ వెనుకాడదనే దానికి ఎమర్జెన్సీ పాలనే ఓ ఉదాహరణ అని గుర్తుచేశారు.
ఎమెర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన ప్రతిపక్ష నాయకులను, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, జనసంఘ్ నాయకులను మీసా కింద జైళ్లలో పెట్టారన్నారు. మానవ హక్కులను, స్వేచ్ఛను హరించి వేశారని ఫైర్ అయ్యారు. ప్రశ్నించిన ఎంపీల సభ్యత్వాన్ని కూడా రద్దు చేసిన నీచమైన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదని ధ్వజమెత్తారు.
ఎమర్జెన్సీ పాలనతో విసిగిన ప్రజలు కాంగ్రెస్ ను ఓడించినా ఆ పార్టీ నేతల్లో మార్పు రాకపోవడం సిగ్గు చేటన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నంత కాలం రాష్ట్రాల్లోని ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కాంగ్రెస్ కూలదోసిందని ఆరోపించారు. 1947 నుంచి 2014 వరకు రాష్ట్రాల్లోని ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కాంగ్రెస్ ఏకంగా 90 సార్లు ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేసిందని వెల్లడించారు.
ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఎమర్జెన్సీ పాలనపై విమర్శలు గుప్పించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అధికార దాహానికి ఎమర్జెన్సీ చిహ్నం అన్నారు. ఎమర్జెన్సీ భారతదేశ చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయాలలో ఒకటి అన్నారు. అధికారం కోసం పత్రికలను అణచివేశారని.. ప్రతిపక్షాల గొంతు నొక్కారని.. ప్రాథమిక హక్కులను నిలిపివేశారని తెలిపారు.
లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్, అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్.కె. అద్వానీ, జార్జ్ ఫెర్నాండెజ్, మొరార్జీ దేశాయ్ వంటి గొప్ప నాయకులు ప్రజాస్వామ్య రక్షణ కోసం నిలబడి జైలు పాలయ్యారని గుర్తుచేసుకున్నారు. ఈ రాజ్యాంగ ద్రోహానికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, నియంతృత్వానికి వ్యతిరేకంగా నిర్భయంగా నిలబడి ప్రజాస్వామ్య గౌరవాన్ని నిలబెట్టిన వారి త్యాగాలను గుర్తు చేసుకోవాలన్నారు. ఇందుకోసం “సంవిధాన్ హత్య దివస్”ను పాటిస్తామన్నారు.