ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు కీలకమైన తీర్పును వెల్లడించింది. గత కొద్దీ రోజులుగా దీనిపై విచారణ జరుపుతున్న హైకోర్టు.. నిన్న తీర్పును రిజర్వ్ చేయగా.. నేడు తీర్పును వెల్లడించింది. ఈ స్థానిక ఎన్నికలను ఎలాంటి పరిస్థితుల్లోనైనా సెప్టెంబర్ 30వ తేదీలోపు నిర్వహించాలని గడువును విధించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో గత కొన్ని నెలలుగా ఆగుతూ వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30వ తేదీలోపు జరగనున్నాయి.
వార్డు డివిజన్ ప్రక్రియ, రిజర్వేషన్ తదితర కార్యక్రమాలను పూర్తి చేసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు 60 రోజుల గడువును కోరగా.. దానిపై స్పందించిన న్యాయస్థానం.. 60 రోజుల్లోనే వార్డు డివిజన్, రిజర్వేషన్ తదితర పనులను ముగించుకొని, ఎన్నికలను కూడా పూర్తి చేయాలని ఆదేశించింది. గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేదని, ఇప్పటికే చాలా ఆలస్యమైందని పేర్కొంటూ.. తీర్పును వెల్లడించింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తధ్యమనే వార్తలు వినిపిస్తున్నాయి.
హైకోర్టు తీర్పుతో ఆశావహుల్లో ఉత్సాహం నెలకొంది. ఇక తాము ఎన్నికలకు సిద్ధం కావచ్చోనే అభిప్రాయం వస్తోంది. కొందరు ఆశావాహులు ఇప్పటికే తమ కార్యాచరణను సిద్ధం చేసుకోగా.. ఇకపై పూర్తిగా ప్రజల్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అలాగే రాజకీయ పార్టీలు సైతం స్థానిక సంస్థల్లో తమ విజయాన్ని నమోదు చేసుకొని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేది తామేనని ప్రజల్లోకి బలంగా అభిప్రాయాన్ని తీసుకెళ్లాలని భావిస్తున్నాయి. ఇకపై ప్రతి గ్రామంలో స్థానిక ఎన్నికల హడావిడి నెలకొంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
