Thursday, June 26, 2025
Homeతెలంగాణఆ సీటు కోసం కాంగ్రెస్ నేతల్లో ఘర్షణలు.. సీఎంను సైతం లెక్కలేనట్లు..!

ఆ సీటు కోసం కాంగ్రెస్ నేతల్లో ఘర్షణలు.. సీఎంను సైతం లెక్కలేనట్లు..!

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతి చెందడంతో ఆ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమయ్యింది. ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ రానప్పటికీ.. ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీలో ఆశావాహుల జోరు కనిపిస్తుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అజహరుద్దీన్ మళ్ళీ ఈ ఉపఎన్నికలో పోటీ చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అజహరుద్దీన్‌తో పాటు మరో నలుగురు కీలక నేతలు ఈ సీటు కోసం టిక్కెట్ ఆశిస్తూ రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే తానే ఈ ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేస్తున్నానని, నేతలందరూ తనతో సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు.

- Advertisement -

గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి గోపీనాథ్ చేతిలో ఓటమి చెందిన అజహరుద్దీన్, ఈసారి గెలుపు తనదేనంటూ ధీమాగా ప్రచారం చేయడంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. ఉప ఎన్నికలో అభ్యర్థిని ఇంకా నిశ్చయించలేదని, అభ్యర్థిని ఎంపిక చేయడంలో తుది నిర్ణయం పార్టీ అధిష్టానం తీసుకుంటుందని చెప్పారు.

ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ సైతం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మరో కీలక నాయకురాలు విజయారెడ్డి కూడా జూబ్లీహిల్స్ నుంచి పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారు. గతంలో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె.. జూబ్లీహిల్స్ వైపు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. తండ్రి పీజెఆర్ రాజకీయ వారసత్వం, స్థానిక పరిచయాలను ఆమె బలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక మరో కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ కూడా ఈ సీటు పై దృష్టి పెట్టారు. స్థానికంగా తన సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉందని, అలాగే ఎంఐఎంతో ఉన్న అనుబంధాలు తన విజయాన్ని సులభతరం చేస్తాయంటూ పార్టీ అధిష్టానాన్ని ఆకర్షించేందుకు యత్నిస్తున్నారు. మరొక కీలక నాయకుడు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా పరిశీలనలో ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న రాజకీయ అనుభవం, తన సామాజిక వర్గ ప్రాతినిధ్యం వంటి అంశాలు తనకు తోడుగా ఉన్నాయని చెబుతూ, తనకు అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేతలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో, జూబ్లీహిల్స్ టికెట్ విషయంలో కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చివరికి అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందనేది రాజకీయంగా ఆసక్తికర విషయంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News