సామాజిక భద్రత తమ పార్టీ లక్ష్యమని నవభారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కళ్యాణ రామకృష్ణ అన్నారు. తమ పార్టీ నూతన కార్యవర్గ నిర్వాహక అధ్యక్షుడిగా ఎలమంచిలి జగదీష్ ను నియమించినట్లు తెలిపారు. ఈ మేరకు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు మాట్లాడుతూ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న పాలనా విధానాలలోని లోపాలను ఎత్తి చూపుతామని అన్నారు. దేశ ప్రజలకు సుపరిపాలన అందించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్రం సిద్ధించి 75 ఏళ్లు గడుస్తున్నా ప్రజల మధ్య అంతరాలు చెరిగిపోలేదని అన్నారు. ఈ నేపథ్యంలోనే భద్రతే లక్ష్యం మానవత్వమే మా నినాదం అనే ధ్యేయంతో పార్టీని స్థాపించినట్లు చెప్పారు. అనంతరం కార్యవర్గ నిర్వాహక అధ్యక్షుడు మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా అవకాశం ఇచ్చిన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కళ్యాణ రామకృష్ణకు ధన్యవాదాలు తెలియజేశారు.
దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతానికి తన వంతుగా కృషి చేస్తానని సేవ చేసేందుకు ఎల్లలు లేవని మంచి మనసుంటే ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేయవచ్చునని అన్నారు. అత్యధికంగా పేదలు నివసిస్తున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్ లాంటి రాష్ట్రాల నుంచి తమ సేవా కార్యక్రమాలను ప్రారంభిస్తామని చెప్పారు. పాలకులలో మార్పు తేవడమే తమ ప్రధాన ఆలోచనని అందుకోసం నిరంతరం పోరాటం చేస్తామని తెలిపారు.