Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్AP Govt: మంత్రి జయరాంకు ఐటీ ఉచ్చు.. వందల ఎకరాల కొనుగోలు విచారణ

AP Govt: మంత్రి జయరాంకు ఐటీ ఉచ్చు.. వందల ఎకరాల కొనుగోలు విచారణ

- Advertisement -

AP Govt: ఈ మధ్య కాలంలో ఐటీ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలు దూకుడు మీదున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థలు కేంద్రం ఆడించినట్లు ఆడుతున్నాయనే విమర్శలున్నా.. పనితీరులో మాత్రం జెట్ స్పీడ్ లో ఉన్నారు. ఇప్పటికే తెలంగాణలో ఎక్కడ ఛాన్స్ వస్తే అక్కడకి.. ఎవరిపై ఫిర్యాదు వస్తే వాళ్ళకి వణుకు పుట్టిస్తున్న ఐటీ శాఖ తాజాగా ఏపీలో కూడా ఒక మంత్రికి నోటీలు ఇచ్చారు. అది కూడా వందల ఎకరాల భూములు కొనుగోలుకి సంబంధించిన కేసులో ఈ నోటీసులు అందించారు.

ఇంతకీ ఆ మంత్రి ఎవరంటే గుమ్మనూరు జయరాం. ఇక కేసు విషయానికి వస్తే.. మంత్రి గుమ్మనూరు జయరాం కుటుంబ ఆదాయం కేవలం 19వేల రూపాయలు. ఇదే ఆయన ఎన్నికల అఫిడవిట్ లో కూడా ఇచ్చారు. అయితే, తాజాగా రూ.కోటి అరవై లక్షల నగదు ఇచ్చి భూములు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఈ భూములన్నీ మంత్రి జయరాం భార్య.. బంధువుల పేర్లపై రిజిస్ట్రేషన్ అయినట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారంలోనే ఐటీ శాఖ మంత్రికి.. ఆయన భార్యకి నోటీసులు ఇచ్చిందట.

ఒక్కసారిగా అంత డబ్బు పెట్టి భూములు కొన్నారు కదా.. అసలు ఆ డబ్బులెక్కడివో చెప్పాలని నోటీసులు జారీ చేసింది. జయరాం సతీమణి రేణుక పేరు మీద ఈ నోటీసులు అందినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మంత్రి కొన్న ఈ 180 ఎకరాలను సీజ్ చేస్తున్నట్టు తెలిపిన ఐటీశాఖ.. 90 రోజుల్లోగా భూ కొనుగోళ్ల లావాదేవీలకు సంబంధించి ఆదాయ వివరాలను అందించాలని స్పష్టం చేసింది. కర్నూలు జిల్లా అస్పరిలో మొత్తం 180 ఎకరాల భూమి మంత్రి జయరాం భార్య రేణుకతో పాటు కుటుంబసభ్యులు ఒకే రోజు కొనగా.. ఒకేరోజు రిజిస్టర్ కూడా అయ్యాయి.

రిజిస్ట్రేషన్ ప్రకారం ఈ భూముల విలువ కోటి 60 లక్షలు కాగా.. మార్కెట్ విలువలో ఇది ఇంకా ఎక్కువే ఉంటుందట. అయితే.. వైసీపీ ప్రభుత్వం కేంద్రంతో సఖ్యతగానే ఉంటుంది. మరి అలాంటిది ఓ మంత్రికి ఐటీ శాఖ నోటీసులు ఎలా ఇచ్చిందన్నదే రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది. అది కూడా కర్ణాటకలో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. నిజానికి ఈ భూములు ఇట్టినా అనే కంపెనీకి సంబంధినవి కాగా.. అందులో గతంలో డైరెక్టర్ గా ఉండి బయటకి వచ్చేసిన వ్యక్తి నుండి ఈ భూములను తక్కువ ధరలో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లుగా కూడా మరొక ప్రచారం ఉంది.

ఎందుకంటే.. ఇప్పుడు ఆ కంపెనీ ఫిర్యాదుతోనే ఈ వ్యవహారం అంతా బయటకొచ్చింది. అయితే.. మంత్రి ఇప్పుడు ఆ భూములను వదులుకుంటారా? లేక ఆదాయ లెక్కలు చూపిస్తారా అన్నది ఐటీ శాఖ తేల్చనుంది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ అక్రమమా.. సక్రమమా అన్నది కోర్టు తేల్చాల్సి ఉంటుంది. అయితే.. ఈ కేసుతో ప్రతిపక్షాలకి ఆయుధం దొరకగా.. కేసు ఫలితం ఎలా ఉన్నా మంత్రికి విమర్శలు తప్పవనే టాక్ వినిపిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News