Friday, September 20, 2024
HomeతెలంగాణKarimnagar CP: విత్తన ఉత్పత్తి కేంద్రం తనిఖీ

Karimnagar CP: విత్తన ఉత్పత్తి కేంద్రం తనిఖీ

కమిషనరేట్ లోని మానకొండూరు కేంద్రంలోని సింధూర్ విత్తన ఉత్పత్తి కేంద్రాన్ని కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు టాస్క్ ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిల్వ ఉంచిన విత్తనాలతోపాటు ప్యాకింగ్ తీరును పరిశీలించారు. విత్తనాల నిల్వల రికార్డులను తనిఖీ చేశారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పంటల దిగుబడిలో ఎలాంటి నష్టాలకు గురవ్వకుండా ఉండేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా పోలీస్ కమీషనర్ విత్తన ఉత్పత్తి కేంద్రాన్ని తనిఖీ చేశారు. గత సంవత్సరం ఈ కేంద్రం నుండి విత్తనాలను కొనుగోలు చేసిన రైతులు ఎలాంటి దిగుబడులు సాధించారనే విషయాన్ని సెల్ ఫోన్ ద్వారా వారితో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు.

- Advertisement -

నాణ్యత ప్రమాణాలు కలిగిన విత్తనాలు మాత్రమే రైతులు కొనుగోలు చేయాలని, నకిలీ విత్తనాలు విక్రయించే వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తీవ్రతను బట్టి పిడియాక్టలను అమలు చేస్తామన్నారు కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు. రైతులు నాణ్యత ప్రమాణాలు కలిగిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు అన్నారు. తక్కువ ధరకు లభిస్తున్నాయనే ఉద్దేశంతో ప్యాకింగ్, బార్ కోడింగ్ పరిశీలించి అనుమానాస్పదంగా ఉండే విత్తనాలను కొనుగోలు చేయవద్దని చెప్పారు.

మానకొండూరు లోని సింధూర్ విత్తన ఉత్పత్తి కేంద్రాన్ని తనిఖీ చేసిన అనంతరం పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ విత్తన ఉత్పత్తి కేంద్రాల నిర్వాహకులు నాణ్యమైన విత్తనాలు మాత్రమే విక్రయించాలని, కాలం గడువు ముగిసిన విత్తనాలను విక్రయించకూడదన్నారు. రైతులు దిగుబడి సాధనలో సఫలీకృతమయ్యేందుకు ప్రభుత్వం రైతులకు భద్రత కల్పిస్తూ నాణ్యమైన విత్తనాలు మాత్రమే వారికి అందజేయాలనే ఉద్దేశంతో పలు పగడ్బందీ చర్యలను తీసుకున్నదని తెలిపారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సందర్భంలో సదరు కంపెనీలకు చెందిన విత్తనాల నాణ్యత ప్రమాణాలను పరిశీలించాలని, ఏవైనా అనుమానాలు ఉన్నట్లయితే సంబంధిత వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులు పంటల సాగులో ఎలాంటి నష్టాలకు గురవ్వకుండా ఉండేందుకు పోలీసు, వ్యవసాయ, రెవెన్యూశాఖలకు చెందిన అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్పారు. నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి మోసేపోయే బదులు పంటల సాగు ప్రారంభంలో నిపుణులను సంప్రదించి వారి సూచనల ప్రకారం కొనుగోలు చేసి అధిక దిగుబడులను సాధించాలని తెలిపారు. దిగుబడి సాధనలో ఆశించిన స్థాయిలో విఫలమై నష్టపోవద్దని చెప్పారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహార మందులను విక్రయించే వ్యాపారులు, మధ్యదళారీలు, ఏజెన్సీల నిర్వాహకులపై క్రిమినల్ కేసులను నమోదు చేస్తామని స్పష్టం చేశారు. తీవ్రతను బట్టి పిడియాక్ట్ లను అమలు చేస్తామని హెచ్చరించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులను విక్రయించే వారికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా స్థానిక పోలీసులు, టాస్క్ ఫోర్స్ ఏసిపి ఫోన్ నెంబర్ 87126 70760, ఇన్స్పెక్టర్ నెంబర్ 87126 70708 లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించే వారి పేర్లను గోప్యంగా ఉంచి నగదు పారితోషికాన్ని అందజేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ ఏసిపి విజయసారధి, ఇన్స్ పెక్టర్ సృజన్ రెడ్డి, వ్యవసాయశాఖ అడ్మిని(స్ట్రేటివ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ బత్తిన శ్రీనివాస్, మానకొండూరు ఇన్స్ పెక్టర్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News