Saturday, September 21, 2024
HomeతెలంగాణCS: దశాబ్ది వేడుకలను పండుగలా చేయాలి

CS: దశాబ్ది వేడుకలను పండుగలా చేయాలి

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 9 సం॥లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలియజేస్తూ ప్రభుత్వం చేపట్టిన దశాబ్ది వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. హైదరాబాద్ నుండి రాష్ట్ర ఉన్నత అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీసు అధికారులు, జిల్లా శాఖల అధికారులతో దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయం 9 గం॥లకు అన్ని జిల్లా కలెక్టరేట్ల ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించాలని, అనంతరం అమరవీరుల స్థూపాల వద్ద ఘనంగా నివాళులు అర్పించాలని తెలిపారు. జూన్ 2 నుండి 22వ తేదీ వరకు 21 రోజుల పాటు నిర్వహించే దశాబ్ది ఉత్సవాలలో అన్ని రంగాలలో సాధించిన ప్రగతి చాటేలా ఘనంగా నిర్వహించాలని, రైతు దినోత్సవం నాడు జిల్లాలో ఉన్న రైతు వేదికలో వేడుకలు జరగాలని, ప్రతి గ్రామం నుంచి రైతులను డప్పులుతో ఘనంగా పండుగ వాతావరణంలో రైతు వేదికలకు తీసుకొని రావాలని, అక్కడ ప్రభుత్వం ప్రతి రైతుకు కల్పించిన సౌకర్యాలు, అందించిన సహాయంపై వివరించాలని, భోజన ఏర్పాట్లు ఉండాలని అన్నారు. జూన్ 8న ఊరురా చెరువుల పండుగ సందర్భంగా గ్రామాల్లో ఉన్న పెద్ద చెరువు వద్ద బతుకమ్మ, బోనాలతో సాంస్కృతిక కార్యక్రమాలు, కట్ట మైసమ్మ పూజ, భోజన కార్యక్రమం నిర్వహించాలని, ఈ కార్యక్రమాల నిర్వహణ కొరకు అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకోవాలని, క్షేత్ర స్థాయిలో ప్రతి అంశాన్ని పర్యవేక్షించాలని, ఎలాంటి పొరపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యుత్ రంగంలో గత పరిస్థితి, నేడు సాధించిన ప్రగతిని తెలియజేస్తూ నాడు-నేడు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, పోలీస్ ఆధ్వర్యంలో సురక్షా దివస్, తెలంగాణ రన్ నిర్వహించాలని తెలిపారు. పారిశ్రామిక ప్రగతి, సాగునీటి రంగంలో సాధించిన విజయాలు తెలియజేయాలని అన్నారు. జూన్ 9న సంక్షేమ సంబురాలలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 2వ విడత గొర్రెల పంపిణీ, అవకాశం ఉన్న చోట ఇంటి పట్టాల పంపిణీ, బి.సి. కులవృత్తుల ఆర్థిక సహాయంపై క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ప్రకారం మార్గదర్శకాలు అందిస్తామని, ఆ ప్రకారం లబ్దిదారులను ఎంపిక చేసి జూన్ 9న ప్రారంభించాలని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన నూతన జిల్లాలు, మండలాలు, గ్రామాల వివరాలు తెలియజేయాలని, మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో సాధించిన ప్రగతి, క్రొత్త ఆసుపత్రుల ఏర్పాటు, అందిస్తున్న అదనపు సేవలను వివరించాలని, వైద్య, ఆరోగ్య శాఖ దినోత్సవం నాడు కె.సి.ఆర్. న్యుట్రిషన్ కిట్ ప్రారంభించాలని తెలిపారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా సాధించిన విజయాలు ఘనంగా చాటాలని, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేయాలని, సఫాయన్న-సలాం అన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, మిషన్ భగీరథ పథకం క్రింద ఇంటింటికి త్రాగునీటి సరఫరా, గిరిజనోత్సవం, పెరిగిన పచ్చదనం, విద్యాశాఖ, ఆధ్యాత్మిక రంగంలో సాధించిన ప్రగతి, అమరుల సంస్కరణ కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 21 రోజుల పాటు జరుగనున్న దశాబ్ది ఉత్సవాలను అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో విజయవంతం చేయాలని తెలిపారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాల అంశాలను ప్రజలందరికీ తెలిసే విధంగా గొప్పగా ప్రచారం నిర్వహించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ కొరకు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో విజయవంతం చేసే దిశగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రైతు దినోత్సవం సందర్భంగా జిల్లాలోని రైతు వేదికలను అందంగా అలంకరించడం, వ్యవసాయ శాఖలో సాధించిన విజయాలను వివరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సురక్షా దినోత్సవంలో భాగంగా శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ సాధించిన విజయాలను తెలియజేస్తూ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పెట్రోలింగ్ వాహనాలతో ర్యాలీ నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు డి.మధుసూదన్ నాయక్, బి.రాహుల్, ట్రైనీ కలెక్టర్ పి.గౌతమి, మంచిర్యాల, డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు దాసరి వేణు, శ్యామలాదేవి, జిల్లా అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News