Sunday, September 22, 2024
HomeతెలంగాణMahabubnagar: రాష్ట్ర సాధనలో పోలీసు కిష్టన్న త్యాగం మరువ లేనిది

Mahabubnagar: రాష్ట్ర సాధనలో పోలీసు కిష్టన్న త్యాగం మరువ లేనిది

పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేసి దేశంలోనే నెంబర్ వన్ పోలీస్ గా KCR మన పోలీసులను నిలిపారు

రాత్రనక పగలనక ప్రజల సేవకై కష్టపడి పనిచేసే పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలో వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఎన్నో త్యాగాలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అప్పనపల్లి ఫ్లై ఓవర్ వద్ద పోలీస్ సురక్ష దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన భారీ వాహన ర్యాలీని బెలూన్లు ఎగురవేసి, జెండా ఊపి మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. అశేషంగా హాజరైన పోలీసులు, పట్టణ ప్రజలు బైకులు, కార్లు, ఇతర వాహనాల్లో ర్యాలీలో పాల్గొన్నారు. దారి పొడవునా ప్రజలకు మంత్రి ప్రజలకు అభివాదం చేస్తూ కదిలారు. ర్యాలీ అప్పన్నపల్లి, ఎనుగొండ, షాసాబ్ గుట్ట, న్యూ టౌన్, బస్టాండ్ సర్కిల్ మీదుగా తెలంగాణ చౌరస్తాకు చేరుకుంది. తెలంగాణ చౌరస్తాలో మంత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

- Advertisement -

సమైక్య రాష్ట్రంలో 24 గంటలు 365 రోజులు సేవలో అందించిన పోలీసులకు అప్పుడు కనీసం ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకునే అవకాశమే గత పాలకులు ఇవ్వలేదని,రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసులకు ఉద్యోగ బాధ్యతల విషయంలో ఎంతో వెసులుబాటు లభించిందని తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు హోంగార్డులకు నెలకు కేవలం 5000 రూపాయల వేతనం ఉండేదని,రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారికి రూ.30 వేల జీతం వస్తున్నదని అన్నారు. 2014కు ముందు హైదరాబాద్ నగరంలో ఎప్పుడు కర్ఫ్యూ ఉంటుందో తెలియని భయంకరమైన పరిస్థితులు ఉండేవని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల ముందు రాజకీయాల కోసం, ముఖ్యమంత్రిని మార్చడం కోసం మతకలహాలు సృష్టించి అశాంతిని రాజేసేవారని అన్నారు. మహబూబ్ నగర్ లోనూ అలాంటి వాతావరణం ఉండేదన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ తొమ్మిదేళ్లలో ఏనాడు అలాంటి ఘర్షణ వాతావరణమే లేకుండా చేయడంలో మన పోలీసుల పాత్ర ఎంతో విలువైనదన్నారు. లక్షల కెమెరాలతో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ దేశానికి ఆదర్శంగా నిలిస్తోందన్నారు. సింగపూర్లో ఆదర్శంగా తీసుకొని ఏర్పాటు చేసిన నార్కోటిక్స్ అండ్ డ్రగ్స్ కంట్రోల్ వ్యవస్థ ప్రపంచంలోనే ఎక్కడా లేని స్థాయిలో రూపొదిద్దుకొందన్నారు.

సమైక్య రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లా వైశాల్యంలో ఎంతో పెద్దదని, అలాంటి పరిస్థితుల్లో కనీసం జిల్లా ఎస్పీని, కలెక్టర్ ను కలిసి తమ సమస్యను వివరించేందుకు కూడా అవకాశం కూడా లభించేది కాదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇప్పడు చిన్న జిల్లాల ఏర్పాటుతో శాంతి భద్రతల పరిరక్షణ ఎంతో సులభతరమైందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు అంటే భయం పోయి గౌరవం పెరిగిందని తెలిపారు. నిరంతరం ప్రజాసేవలో ఉండే పోలీసులు ఇంట్లో ఉండే బాధలు ఎవరికీ తెలియదన్నారు. ఫ్రెండ్లీ హోలీసింగ్ తో పాటు తప్పు చేసిన వారిని ఘనంగా శిక్షించాల్సిందేనని మంత్రి పేర్కొన్నారు. చిన్నారులు, మహిళలపై వేధింపుల నివారణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఎక్సైజ్ పోలీసులు కుటుంబాలు అరికట్టడంలో కీలకపాత్ర వహించారని ఆపద సమయంలో అగ్నిమాపక పోలీసులు పాత్ర వేల కట్టలేనిదని తెలిపారు. జైళ్ల శాఖ, అటవీశాఖ పోలీసులు సైతం నిరంతరం ప్రజాసేవలో కష్టపడుతున్నారని అన్నారు.
తెలంగాణ ఏర్పడితే ఈ ప్రాంత ప్రజలు బాగుపడతారని, బడుగు బలహీన వర్గాలకు మంచి రోజులు వస్తాయని పోలీస్ కిష్టన్న ఉద్యమంలో అమరుడయ్యాడని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన తర్వాత ఉప ఎన్నికల్లో కొందరి ఓటములతో స్తబ్దత వచ్చిన తరుణంలోనే 14 ఎఫ్ ద్వారా హైదరాబాద్ ను గుప్పిట పెట్టుకునాలని సమైక్యవాదుల కుట్రకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పోలీసు సోదరుల సహకారం మరువలేనిదని మంత్రి గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాతే సిద్దిపేట సమావేశం కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని అన్నారు. ఉద్యమంలో ప్రతి సందర్భంలోనూ పోలీసులు తమకు సహకారం అందించి రాష్ట్ర సాధనకు చేసిన కృషి మర్చిపోలేనిదన్నారు.

మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు రాష్ట్రం నిర్వీర్యం అయిపోతుందని అన్నారని, అలాంటిది ఇప్పుడు రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, గత ప్రభుత్వాలు సరిగా పనిచేయని కారణంగానే శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమయ్యేవని, అలాంటిది పోలీస్ శాఖను పటిష్టం చేయడమే కాకుండా, వాహనాలు, నిధులు ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని అన్నారు.

జడ్చర్ల శాసనసభ్యులు, మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి తెలంగాణ పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేసి దేశంలోనే నెంబర్ వన్ పోలీస్ గా నిలిపారని,ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పిస్తున్నశాఖ పోలీసు అని, కష్టమైన సమయాల్లో వారి ప్రాణాలను సైతం అడ్డుపెట్టి దేశ రక్షణ కోసం కృషి చేస్తున్నారని ,అలాంటి పోలీసు విభాగానికి అదునాతన వాహనాలతో పాటు ,నిధులను ఇచ్చి ఫ్రెండ్లీ పోలీసు విధానాన్ని అమలు చేయడం జరుగుతున్నదని ,రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయటంలో పోలీసుల పాత్ర మరువలేనిదని అన్నారు.
దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర మరువ లేనిదని అన్నారు. ప్రతిక్షణం ఏం జరుగుతుందో తెలుసుకునే విధంగా అత్యంత అదనాతన కమాండ్ కంట్రోల్ టవర్లను నిర్మించి పెద్ద ఎత్తున భద్రత కల్పిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.
జిల్లా ఎస్పీ కె. నరసింహ అధ్యక్షత వహించగా జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ ,మున్సిపల్ చైర్మన్ నరసింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న,అదనపు కలెక్టర్ కె. సీతారామారావు,అడిషనల్ ఎస్ పి .రాములు, డిసిసిబి అధ్యక్షుడు కోరమోని వెంకటయ్య, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్గౌడ్ ,పోలీస్ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .
వాహన ర్యాలీ ఎస్పీ కార్యాలయం, క్లాక్ టవర్, బండ్లగేరి, రామ్ మందిర్ చౌరస్తా, గ్రంథాలయం, వన్ టౌన్, భగీరథ కాలనీ, బికే రెడ్డి కాలనీ మీదుగా శిల్పారామానికి చేరుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News