Sunday, October 6, 2024
HomeతెలంగాణErrabelli: చారిత్రాత్మకంగా ప్రగతి పథంలో పల్లెలు

Errabelli: చారిత్రాత్మకంగా ప్రగతి పథంలో పల్లెలు

సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకి అందాలని సంస్కరణలు చేపట్టారు

స్వపరిపాలనలో సుపరిపాలన కొనసాగుతున్నదని,స్వరాష్ట్రంలో గ్రామ స్వరాజ్యం ఆవిర్భవించిందని, ప్రజా భాగస్వామ్యంతో ప్రజల వద్దకే ప్రభుత్వ పాలన చేరుకున్నదని సీఎం కెసిఆర్ అధ్వర్యంలో గ్రామ పంచాయతీలకు మహర్దశ వచ్చిందని, పలు సంస్కరణలతో సమృద్ధిగా నిధులు, విధులు వచ్చి అభివృద్ధి అద్భుతంగా కొనసాగుతున్నదని, గతంలో ఎన్నడూ లేని విధంగా చారిత్రాత్మకంగా ప్రగతి పథంలో పల్లెలు ప్రగతి సాధిస్తున్నాయని, మౌలిక సదుపాయాలతో గ్రామాల్లో సకల సౌకర్యాలు ఏర్పాటు చేయబడుతున్నాయని. ఉమ్మడి పాలనలో అధోగతిలో గ్రామాలు ఉండేవని, గ్రామ పంచాయతీలకు భవనాలకు కూడా దిక్కు లేకుండెదని అంత దుర్భర పరిస్థితుల నుండి సీఎం కెసిఆర్ వచ్చాకే, దేశానికి పట్టుగొమ్మలు గా మన పల్లెలు మారాయని, అప్పుడు, ఇప్పుడు గ్రామాలు ఎట్లా అభివృద్ధి చెందాయో అన్న విషయాన్ని ప్రజలు విశ్లేషించుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తొర్రూరు మండలం కంఠాయపాలెం, పెద్ద మంగ్యా తండా గ్రామాల్లో నూతన గ్రామపంచాయితీ భవనాలను ప్రారంభించి, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సుపరిపాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు సుపరిపాలన దినోత్సవం జరుపుకుంటున్నామని, దాదాపు 60 ఏళ్ల ఉమ్మడి పాలనలో మన ప్రాంతం అభివృద్ధి జరగక వెనుకబడిపోయిందని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ప్రతి సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకి అందాలని సంస్కరణలు చేపట్టారన్నారు. ప్రభుత్వ పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సాహసోపేతంగా పరిపాలనా సంస్కరణలు అమలు చేసిందన్నారు. నిధులు, విధులు ఇస్తూ, అభివృద్ధికి పాటు పడుతున్నదన్నారు.

- Advertisement -


ఏకకాలంలోనే పరిపాలనా విభాగాల పునర్విభజన చేపట్టిందని 2016 అక్టోబర్ కు ముందు తెలంగాణలో 10 జిల్లాలున్నాయని ఇప్పుడు 33 జిల్లాలు అయ్యాయని అప్పుడు ఒక్కో జిల్లాలో సగటున 35 లక్షలకు పైగా జనాభా వుండటం వల్ల పరిపాలన కష్టతరమయ్యేదని. కొన్నిచోట్ల జిల్లా కేంద్రాలకు, కార్యాలయాలకు వెళ్ళాలంటే 200 నుంచి 250 కి.మీ.ల దూరం ప్రయాణం చేయాల్సి వచ్చేదని జిల్లా కేంద్రాల అధికారులు గ్రామాలకు పోవాలన్నా, ప్రజలు జిల్లా కేంద్రాలకు రావాలన్న ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారని దాని వల్ల ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ కష్టం అయ్యేదని అధికారులకు ప్రజల సమస్యలపై దృష్టి పెట్టడం కష్టంగా వుండేదని అన్నారు. సీఎం కెసిఆర్ జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చట్టం-1974 ప్రకారం తెలంగాణలో మరో 23 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి, జిల్లాల సంఖ్యను 33 వరకు పెంచారని మంత్రి తెలిపారు.


దీంతో చిన్న పరిపాలనా విభాగాలతో సమర్దవంతమైన పాలన జరుగుతున్నదని కొత్త జిల్లాలను 2016 అక్టోబర్ 11న ప్రారంభించుకుని రెవెన్యూ డివిజన్ల సంఖ్యను 43 నుంచి 74 వరకు, మండలాల సంఖ్యను 459 నుంచి 612 వరకు, గ్రామ పంచాయతీల సంఖ్యను 8 వేల 690 నుంచి 12 వేల 769 వరకు పెంచి పోలీస్ కమిషనరేట్లు రాష్ట్రంలో 2 నుండి 9 కి, సబ్ డివిజన్లు – 139 నుండి 163 కి, సర్కిల్స్ 688 నుండి 717 కు, పోలీస్ స్టేషన్లు 712 నుండి 814 కి పెంచుకున్నామన్నారు. ప్రజలకు పాలన మరింత చేరువవ్వడానికి రాష్ట్రంలో మున్సిపాలిటీలు 68 వుండగా 142కి, మున్సిపల్ కార్పొరేషన్లు 6 నుండి 13 కి పెంచారని, అలాగే తండాలో, గూడాల్లో లంబాడీ, ఆదివాసి ల కోసం 3,146 తండాలు, గూడాలను గ్రామ పంచాయతీలు గా మార్చిన ఘనత సీఎం కెసిఆర్ గారిదని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.
నూతన జిల్లాల ఏర్పాటుతో పరిపాలనా సౌలభ్యం, ప్రయోజనాలు కలిగి ప్రభుత్వ శాఖలన్నింటి నూతన విభాగాలను ఆయా జిల్లాల్లో ఏర్పడి ప్రజలు గంటల వ్యవదిలోనే పనిపూర్తి చేసుకుని జిల్లాలోని తమ ప్రదేశానికి వెళ్లే అవకాశం కలిగిందని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు, పర్యవేక్షణ అధికారులకు సులువవుతున్నదని. స్థానిక పరిస్థితులు, వనరులు, ప్రత్యేకతలు, ప్రజల అవసరాలు, సామాజిక స్థితిగతులపై అధికారులకు పూర్తి అవగాహన కలుగుతున్నదని స్థానిక వనరులను గుర్తించి, అభివృద్ధి నమూనాల రూపకల్పన చేయడం సులువవుతుందని. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే కొన్ని కార్యక్రమాలను కూడా జిల్లా యూనిట్ గానే నిర్వహిస్తారని,దీని వల్ల ఎక్కువ జిల్లాలున్న మన రాష్ట్రానికి మేలు కలుగుతుందని కొన్ని కేంద్ర ప్రభుత్వ అధికారిక కార్యాలయాలను జిల్లా కేంద్రాల్లో పెడతారని ఒక్కో కలెక్టర్ పరిధిలో రెండు, మూడు లక్షల కుటుంబాలు మాత్రమే వుండడం వల్ల పేదరికం లేకుండా చేయడానికి వీలవుతున్నదని, అటవీ రక్షణ, గిరిజనుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేయడం అధికారులకు సులువవుతుంది. కొన్ని జిల్లాల్లో ఎస్సీ జనాభా ఎక్కువ వుందని అక్కడ ఎస్సీల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నామని. పట్టణ ప్రాంత అవసరాలకు తగ్గ కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.
ముస్లిం, మైనారిటీలపై ఎక్కువ దృష్టి పెట్టడానికి వీలవుతున్నదని అటవీ శాతం తక్కువ వున్న జిల్లాల్లో పర్యావరణ సమతుల్యానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఉత్సాహవంతులైన యువ కలెక్టర్లను కొత్త జిల్లాలకు కేటాయించడంతో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయని పోలీసు కమిషనరేట్ల పరిధి, పోలీస్టేషన్ల పరిధి తగ్గడం వల్ల నేర నియంత్రణ, నేర పరిశోధన సులువైందని. నేరం జరిగిన ప్రాంతానికి పోలీసులు త్వరగా చేరుకోగలుగుతున్నారని అన్ని రకాల పరిపాలన భవనాలను నిర్మించి, రాష్ట్రంలో పరిపాలన ను ప్రజల దగ్గరకు తీసుకోవడంలో సీఎం కెసిఆర్ సక్సెస్ అయ్యారని,ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
పాలకుర్తి నియోజకవర్గంలో కొత్త గా తొర్రూరు మున్సిపాలిటీ, పెద్ద వంగర మండలం, కొత్త గ్రామ పంచాయతీలను, ఆర్డీఓ, డి.ఎస్.పి కార్యాలయం, అన్ని శాఖల కార్యాలయాల పునర్విభజన కూడా చేసుకున్నామని మంత్రి తెలిపారు.
కంటాయపాలెం రూ. 41.66 కోట్లు, పెద్ద మంగ్యా తండా రూ.6.56 కోట్ల విలువైన గ్రామ పంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు, మురుగు నీటి కాలువలు, మెటల్ రోడ్లు, మిషన్ భగీరథ నల్లాల కు సంబంధించిన పలు అభివృద్ధి పనులకు మంత్రి ఎర్రబెల్లి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ తూర్పాటి అంజయ్య, జడ్పిటిసి శ్రీనివాస్, డిపిఓ నర్మదా, ఆర్డిఓ రమేష్, సర్పంచ్ శారదా రమేష్, ఉప సర్పంచ్ తుకారం, గ్రామ పార్టీ అధ్యక్షుడు లచ్చి రామ్ నాయక్, పిఎసిఎస్ డైరెక్టర్ టి.కు నాయక్, జిపి భవన స్థల దాతలు కిషన్ నాయక్,ఎస్టీ సెల్ నాయకులు రాకేష్, శ్రీను, ధర్మ, లింగ వెంకన్న, వార్డు సభ్యులు, తాసిల్దార్ నాగేంద్ర ప్రసాద్, ఎ పీ ఓ గౌస్, పంచాయతీ కార్యదర్శి నీరజ, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News