Sunday, October 6, 2024
HomeతెలంగాణRTC commercials: ఆర్టీసీకి ప్రత్యామ్నాయ ఆదాయాలు

RTC commercials: ఆర్టీసీకి ప్రత్యామ్నాయ ఆదాయాలు

రాష్ట్రంలో ఉన్న అన్ని బస్టాండ్లను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు

ప్ర‌యాణికుల‌కు మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించ‌డంతో పాటు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై ఆర్టీసీ దృష్టి సారించిందని, ఇందులో భాగంగా నిర్మ‌ల్ బస్టాండ్ ఖాళీ స్థలంలో వాణిజ్య స‌ముదాయాన్ని నిర్మిస్తున్న‌ట్లు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, టిఎస్ ఆర్టిసి చైర్మన్, శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ తెలియజేశారు. నిర్మ‌ల్ జిల్లా కేంద్రంలో రూ.34.43 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న‌ నూతన ఆర్టీసీ కమర్షియల్ కాంప్లెక్స్‌ ను బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ తో క‌లిసి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సంద‌ర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ మీడియాను ఉద్దేశించి మాట్లాడారు.

- Advertisement -

సీఎం సహకారంతో రాష్ట్రంలో ఉన్న అన్ని బస్టాండ్లను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా 1.3 ఎకరాలలో 43 వేల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో అత్యాధునిక హంగులతో మెరుగైన సౌకర్యాలతో కమర్షియల్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తున్నామ‌న్నారు. ఈ కమర్షియల్ కాంప్లెక్స్ లో పార్కింగ్ సదుపాయం కోసం సెల్లార్, జి ప్లస్ త్రీ నిర్మాణంలో 53 స్టాళ్లను, శుభకార్యాలు నిర్వహించేందుకు కూడా ప్ర‌త్యేక హాలును నిర్మిస్తున్నామ‌ని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం వెయిటింగ్ హాల్స్, ఇత‌ర సౌక‌ర్యాల‌తో పాటు ఎల్సిడి తెరలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్ల‌డించారు.

ఏడాదిలోగా నిర్మాణం పూర్తి అయ్యేలా ప్ర‌ణాళిక‌లు రూపొందించుకుని ప‌నులు పూర్తి చేయాల‌ని ఆదేశించారు. అనంత‌రం వారు బస్టాండ్ లో క‌లియ‌తిరిగారు. ప్ర‌యాణికుల‌తో మాట్లాడి సౌక‌ర్యాల‌పై ఆరా తీశారు. త‌ర్వాత నిర్మ‌ల్ బస్టాండ్ ప్ర‌క్క నుంచి ప్రియ‌ద‌ర్శిని న‌గ‌ర్ వేళ్లే రోడ్ ను పరిశీలించారు. ఇరుకైన ర‌హ‌దారితో కాల‌నీ వాసులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని, దీన్ని దృష్టిలో ఉంచుకుని 40 ఫీట్ల సీసీ రోడ్ విస్త‌ర‌ణ‌కు ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందించాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు.

టిఎస్ఆర్టిసి సంస్థకు వీలైనంత ఆదాయాన్ని తీసుకువచ్చేందుకు బస్టాండులను ఆధునికరించి ప్రయాణికులను ఆకట్టుకునే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. టిఎస్ ఆర్టిసి ప్రయాణ ప్రాంగణాలలో ప్రయాణికులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు బస్టాండ్లను అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. అదనపు ఆదయ వనరులే మార్గంగా టిఎస్ఆర్టిసి దృష్టి సారించిందని, దీనికి రాష్ట్ర ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News