Sunday, October 6, 2024
HomeఆటAdudam Andhra: 'ఆడుదాం ఆంధ్ర'కార్యాచరణ సిద్ధం చేయండి

Adudam Andhra: ‘ఆడుదాం ఆంధ్ర’కార్యాచరణ సిద్ధం చేయండి

మ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలు

వచ్చే అక్టోబరు 2వ తేదీ జాతిపిత మహాత్మా గాంధీ జయంతి నాడు ప్రారంభించ ప్రతిపాదించిన ”ఆడుదాం ఆంధ్ర” పేరిట నిర్వహించనున్న క్రీడా సంబరాలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలు, 2023-2028 క్రీడా పాలసీపై విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఆయన వీడియో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా సిఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలను విజయవంతంగా నిర్వహించేందుకు వీలుగా ఇప్పటి నుండే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా రాష్ట్ర క్రీడల శాఖతో పాటు సంబంధిత శాఖల అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

- Advertisement -

గ్రామ,వార్డు సచివాలయాల స్థాయి నుండి మండల, అసెంబ్లీ నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకూ ఈ ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహిస్తామన్నారు. ఇందుకు గాను గ్రామ, మండల స్థాయిల్లో అనువైన క్రీడా ప్రాంగణాలు, మైదానాలను గుర్తించి వాటిని వివిధ క్రీడల నిర్వహణకు వీలుగా అన్ని విధాలా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఈ క్రీడా పోటీలను విజయవంతం చేసేందుకు వీలుగా గ్రామ స్థాయి నుండి ప్రజలు ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున భాగస్వాములు అయ్యే విధంగా ప్రోత్సాహించాలని సూచించారు.

ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో భాగంగా క్రికెట్,బాడ్మింటన్, వాలీబాల్, కోకో, కబడ్డి వంటి క్రీడలతో పాటు ఇతర సాంప్రదాయ క్రీడలను కూడా నిర్వహించేలా కార్యాచరణను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

2023-2028 రాష్ట్ర క్రీడా విధానం గురించి కూడా సిఎస్ అధికారులతో సమీక్షించారు.వివిధ క్రీడా కారులను ప్రోత్సహించేందుకు అదే విధంగా స్పోర్ట్స్ అధారిటీ ద్వారా వివిధ క్రీడా పరమైన మౌలిక సదుపాయాలను మెరుగు పర్చేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అంతేగాక గ్రామ స్థాయి నుండి యువత పెద్ద ఎత్తున భాగస్వాములు అయ్యేలా మరీ ముఖ్యంగా ప్రతిభ గల క్రీడా కారులను ప్రోత్సాహించే విధంగా నూతన క్రీడా పాలసీ ఉండేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఈసమావేశంలో రాష్ట్ర క్రీడలు,యువజన సర్వీసులు శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ మోహన్,రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్,సియం కార్యదర్శి ఆర్.ముత్యాల రాజు,రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ విసి అండ్ ఎండి కె.హర్షవర్థన్ తదితరులు పాల్గొనగా, వీడియో లింక్ ద్వారా ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు,కెఎస్.భరత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News