Saturday, October 5, 2024
Homeఓపన్ పేజ్Monsoon: సాగుబడి సాగేదెలా?

Monsoon: సాగుబడి సాగేదెలా?

రైతాంగానికి సాగునీరు అందించడం ఒక్కటే పరిష్కారం కాదు

తొలకరి పలకరింపుతో సకల రైతాంగం సాగుకు సన్నద్దమవుతోంది. ఇప్పటికి వర్షాకాల సమయం ఆలస్యమైనప్పటికీ రుతుపవనాల సవ్వడి వాడీ వేడీగానే పరుగులెడుతోంది. ప్రతి ఏటా రైతాంగము సాధారణ ధోరణిలోనే తమ వ్యవసాయ కార్యక్రమాలకు సన్నహాలు చేస్తోంది. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకనే యాసంగి పంటల్లో చాల నష్టపోయారు, ఆకలి చావులు, ఆత్మహత్యలు, వలసలతో రాష్ట్రంలో ఆత్మవిశ్వా సం కోల్పోయి వ్యవసాయానికి దూరమయిన రైతాంగానికి సాగునీరు అందించడం ఒక్కటే, సమస్య పరిష్కారానికి మార్గం కాదు. రైతులకు ఆత్మస్థైర్యం కల్పించి ధైర్యంగా వ్యవసాయం చేసేందుకు దేశంలో, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టాలి. లాభసాటి వ్యవసాయానికి అనుకూలమైన అధ్యయనాలు సాగాలి. వాతావరణ పరిస్థితులు అనుకూలించక వ్యవసాయం సక్రమంగా సాగక రైతులు అప్పుల పాలవుతున్నారు. సాగు కూలి ఖర్చులు పెరిగిపోయాయి. వ్యవసాయోత్పత్తులకు లాభసాటి ధర లభించక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. రాష్ట్రంలో దాదాపు 22 లక్షల బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం కొనసాగిస్తున్న పరిస్థితులలో వానలు రాక ఆలస్యమవడంతో సాగు నీరు అందక పైర్లు ఎండిన పరిస్థితి రాకూడదంటే ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటి నుండే మేల్కొనాలి. రైతుల వలసలు ఆపాలి. దేశంలో 58 శాతాము ప్రజలకు జీవనభృతి కల్పించేది వ్యవసాయమే. అధిక శాతము రైతులు అప్పులు అసలు వడ్డీలు కట్టలేక కృంగిపోతున్నారు. రైతు బంధుతో ఎంతో కొంత ఆసరైనప్పటికీ పంట భీమా పంట పెట్టుబడి గిట్టు బాటు ధరకు గ్యారంటీ లేక రైతు కొట్టుమిట్టాడుతున్నాడు. సాగు నీటి కోరత, ఎరువుల పురుగు మందు ధరలు పెరుగుతుండడముతో ఖర్చులు పెరుగుతున్నాయి. దీనికి తగ్గట్టుగా ఉత్పత్తులకు గిట్టుబాట ధర కల్పించటం లేదు. ఈ సమస్య చాలదన్నటు దళారీ వ్యవస్థ దోచుకుంటోంది. సరైన విత్తనాలు దొరక్క విత్తిన పైరు సరైనరీతిలో పెరుగక దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఎప్పుడో ఒకసారి సంతప్తికరమైన దిగుబడులు వచ్చిన చాలా సందర్భాల్లో కన్నీళ్లే మిగులుతున్నాయి. పంటల వైవిధ్యీకరణ, వ్యవసాయ యాంత్రీకరణ, మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటల వైపు రైతులను ప్రోత్సహించి వ్యవసాయ రంగాన్ని లాభదాయకమైన వ్యాపార రంగంగా మార్చాలి. పత్తి సాగులో ఆధునిక పద్ధ తులు, అధిక సాంద్రత పత్తి సాగుపై ఎగుమతులపైనా దృష్టి పెట్టాలి. పంటల వైవిధ్యీకరణలో భాగంగా అంతర పంటల ద్వారా రైతులు సాగుచేస్తూ అధిక దిగుబడులు ఆశించవచ్చు. వ్యవసాయంలో యాంత్రీకరణ, అధిక ఉత్పాదకతనిచ్చే వంగడాలు, పెద్ద కమతాలు లాంటివి ప్రోత్సహించాలి. రైతులు ఒకే రకమైన పంటలతో సరిపెట్టు కోకుండా వివిధ రకాలైన పంటలను పండించు కోవాలి. ఒక పంటలో కాకాపోయిన మరో పంటలోనైనా దిగు బడులు వచ్చే ఆస్కారముంది. వీటితో పాటు పశు పోషణ, కోళ్ల పెంపకం లాంటి ఉత్పత్తులు చేపట్టాలి. ఖర్చులు తగ్గించుకొనే మార్గాలు వెతకాలి. ప్రభుత్వ యంత్రాంగాలు వ్యవస్థ రాబడులు పెరిగే ఆలోచన చేసి రైతులను ఆదుకోకపోతే దేశంలో సగానికి మించి రైతాంగం జీవనం దుర్భరమవుతోంది. ప్రభుత్వాల ప్రథమ ప్రాధాన్యత రైతే అని సగర్వంగా ప్రకటించి అందుకనుగుణంగా ప్రణాళికలు ప్రారంభించాలి. తెలంగాణ సాగుబడి 2020-21 నాటికే 1 కోటీ 6 లక్షల ఎకరాలకు విస్తరించింది. దీనికి తోడూ సీఎం కేసీఆర్‌ తీసుకున్న విప్లవాత్మక వ్యవసాయ విధా నాలు, ఉచిత విద్యుత్‌ ప్రవాహాలు, రైతుబంధు, రైతు చెంతకే వెళ్ళి వేల సంఖ్యలో కొనుగోలు కేంద్రాల ద్వారా పంట సేకరణ వంటి పథకాలతో తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాతి అని ప్రకటించుకుంది. అయితే ప్రసంగాలకు ప్రకటనలకు పరిమితం కాకుండా సమస్య లోతుల్లోకెళ్లి ప్రతి గ్రామాన్ని మరో అంకాపూర్‌ చేసేదాక యంత్రాంగాన్నీ నిద్రపోనివ్వకూడదు.
వ్యవసాయం అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. రుతుపవనాలు, భూగర్భజలాలు నీటి యాజమాన్య నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తాయి. సేద్యానికి ఆరోగ్యకరమైన, పోషకాలున్న నేల అవసరం. అనేక జీవ క్రియలు జరిగేందుకు అవసరమైన వాతావరణం ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఇలాంటి ఆరోగ్యకరమైన నేల ఉపరితలం భూసారాన్ని కాపాడి పోషక విలువలున్న పంటలను అందిస్తుంది. అశాస్త్రీయమైన వ్యయసాయ పద్ధతులు, నేలను పదేపదే ఉపయోగించడం, నీటివథా, అడవుల నరికివేత, రసాయన ఎరువుల అతి వాడకం లాంటివన్నీ భూసారం తగ్గడానికి కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఎరువుల వినియోగం: ఎరువుల వినియోగంలో రైతులకు సరైన అవగాహన లేనందువల్ల అటు ఆర్థికంగా, ఇటు దిగుబడుల పరంగా నష్టపోతున్నారు. నీటి యాజమాన్యంతో పాటు రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగంలోనూ వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు, సలహాలు తప్పనిసరిగా పాటించాలి. వరిసాగులో రసాయన ఎరువులపై రైతులు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. భూసార పరీక్షల ఫలితాలకు అనుగుణంగా ఎరువులను వాడినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. భూసార పరీక్షలు చేయించనప్పుడు ఎకరానికి 25 నుంచి 32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 నుంచి 16 కిలోల పొటాష్‌ లభించే ఎరువులను మాత్రమే వాడాలి. అంతకు మించి వాడితే పొలంపై తెగుళ్లు ఆశించే ప్రమాదం ఉంది.
రైతులకు నాణ్యమైన విత్తన సరఫరా చేయాలి
రైతులకు నాణ్యమైన విత్తన లభ్యతను దష్టిలో పెట్టుకుని ధవీకరించిన నాణ్యమైన విత్తనాలనే సేకరించాలి. తదనుగుణంగా వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించాలి. విత్తన పరిశోధన కేంద్రలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడంతో పాటు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని గ్రామీణ వ్యవసాయ కేంద్రాలతో అనుసంధానించాలి. ప్రపంచ వ్యాప్తంగా విత్తన పరిశ్రమ వృద్ధిరేటు 5 శాతం కాగా భారత దేశంలో అది 12-15 శాతంగా ఉంది. భారతీయ విత్తన పరిశ్రమ ప్రపంచంలో ఐదవ స్థానంలో ఉంది. దేశంలోని విత్తనోత్పత్తిలో దాదాపు మూడింట ఒక వంతు వాటా కలిగిన తెలంగాణ 2014-15, 2020-21 మధ్య కాలంలో దాదాపు 85 శాతం వద్ధి చెందింది. ప్రతి గ్రామానికి విత్తన కేంద్రాన్ని పటిష్టం చేసి నిఘా కేంద్రాల పర్యావేక్షణలో కల్తీ లేని వంగడాల విధానాలను సరఫరా చేయాలి. అధిక వర్షాలు, విద్యుత్‌ కోతలతో నష్టపోతున్న రైతులకు నాసిరకం విత్తనాలను సరఫరా చేస్తే దిగుబడి కష్టమే.
ఆధునిక వ్యవసాయ పనిముట్లు: గ్రామీణ వ్యవ సాయంలో ఇప్పుడు కూలీలా సమస్య తీవ్ర పరిణామనగా మారింది. వ్యవసాయ అనుకూల వనరులు అధికముగా ఉన్న సద్వినియోగం చేసుకొని ఇజ్రాయెల్‌ లాంటి దేశాన్ని ఆదర్శనంగా తీసుకోని పంటలను పండించాలి. ఈ ఆధునిక వ్యవసాయ పరికరాలు అవటం వలన ఖర్చు తగ్గటమే కాకుండా సమయం వృధా కాదు శ్రమ తక్కువగా ఉండి లాభం పెరుగుతుంది. ఉత్పత్తి కూడా ఎక్కువ చేయొచ్చు. ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందం ప్రకారము మన ఉత్పత్తులకు విదేశాల్లో గిట్టుబాటు ధర కల్పించాలంటే ఉత్పతుల నాణ్యత పెంచి ఖర్చు తగ్గించాలి. అందుకే ఆధునిక పనిముట్లు, యంత్రాల వాడకం దీనికి దోహదం చేస్తుంది. వ్యవసాయ పరికరాలు, యంత్రలపై మరిన్ని వివరాలకు సంప్రదించాలిన చిరునామా ప్రిన్సిపాల్‌ సైంటిస్ట్‌ (ఆగ్రి ఇంజనీరింగ్‌) వ్యవసాయ పరికరాలు, యంత్రాల విభాగం ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌.
స్మార్ట్‌ వ్యవసాయం: గడిచిన కొన్ని దశాబ్దాల కాలంలో సాంకేతిక విప్లవం కారణంగా వినూత్నమైన యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. దాంతో, ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయంలో యాంత్రీకరణ భారీగా పెరిగింది. ప్రస్తుత డిజిటల్‌ యుగంలో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. హైటెక్‌ యంత్రాలు అందుబాటు లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పంటల పర్యవేక్షణ కోసం డ్రోన్లను వినియోగిస్తున్నారు. అంతేకాదు, పారిశ్రామిక, సాంకేతిక సేవల రంగాల్లో సంచలనం సష్టిస్తున్న కత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌), డేటా ఎనలిటిక్స్‌… వ్యవసాయంలోనూ కీలకంగా మారుతున్నాయి. అందుకోసం ప్రపంచవ్యాప్తంగా పలు టెక్నాలజీ సంస్థలు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాయి. అమెజాన్‌ వెబ్‌ సర్వీస్‌ ద్వారా ఆవు పిడకలు లభ్యమవుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయానికి టెక్నాలజి ఎంత అవసరమో రైతులు మూస పద్ధతిలో కాకుండా ఆధునిక సైంటిఫిక్‌ విధానాల్ని అవలంభించాలి. వివిధ రాష్ట్రాల్లో వ్యవ సాయంలో డ్రోన్ల వాడకం మీద అనేక రకాల ప్రయోగాలు జరుగుతున్నాయన్నారు. పంట రక్షణ కోసం, పురుగు మందులను చల్లడానికి, మట్టిని పిచికారీ చేయడానికి ఇలాంటి మానవరహిత వైమానిక వాహనాల వినియోగానికి కేంద్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్‌లో ప్రామాణిక ఆపరేటింగ్‌ విధానాలను విడుదల చేసింది.
పురుగు మందులు చల్లడానికి డ్రోన్లు వాడాలనుకుంటే.. అలాంటి డ్రోన్‌ నియంత్రణ కోసం sopల్లో చట్ట బద్ధమైన నిబంధనలు, విమానయాన అనుమతులు, దూర ప్రాంత పరిమితులు, బరువు వర్గీకరణ, రద్దీగా ఉండే ప్రాంతాల పరిమితి, డ్రోన్‌ రిజిస్ట్రేషన్‌, భద్రతా బీమా, పైలటింగ్‌ ధవీకరణ, ఆపరేషన్‌ ప్లాన్‌, ఎయిర్‌-ఫ్లైట్‌ జోన్‌లు, వాతావరణ పరిస్థితులు వంటి ముఖ్యమైన అంశాలను కవర్‌ చేస్తాయి.
రైతు రాజు: చిన్నపటి నుండి వింటున్న ఊత పదమే అయినప్పటికీ రైతు జాగురకత లేకపోతే మోసపోయేదే రైతు కాదు దేశమే. అన్న పెట్టె రైతన్నలు కన్నీరు పెట్ట కుండా ప్రపంచానికి మెతుకు అందించాలంటే అన్ని వర్గాల సహకారం ఎంతో అవసరం. దేశ రాష్ట్రాల సహకారంతో రైతును ప్రోత్సహిస్తే కచ్చితంగా అన్నపూర్ణగ దేశాన్ని మార్చే శక్తి ఒక్క రైతుకే ఉందని చెప్పచ్చు. గ్రామీణ కుటీర పరిశ్రమలని బలోపేతం చేస్తూ గ్రామ సచివాలయాలు ఖనిజ బండాగారాలుగా మారి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవ్వాలంటే రైతాంగం సంఘటితమై ఒకే తాటిపై నడవాలి అప్పుడే జై జవాన్‌ జై కిషన్‌ నిజమయిన జిందాబాద్‌.

- Advertisement -

డాక్టర్‌ కృష్ణ సామల్ల
ప్రొఫెసర్‌ & ఫ్రీ లాన్స్‌ జర్నలిస్ట్‌

  • 9705890045
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News