పెట్రోల్ ధరలు ఆకాశం నుంచి దిగిరావటం చాలా సులువు, ఇదంతా మీ చేతుల్లోనే ఉందంటున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. రైతులంతా ‘ఊర్జా దాతలు’ అయితే చాలు మనదేశంలో లీటర్ పెట్రోల్ జస్ట్ 15 రూపాయలకే దొరుకుతుందన్నారు. రాజస్థాన్ లోని ప్రతాప్ గఢ్ లో జరిగిన ర్యాలీలో ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి. 40 శాతం ఎలక్ట్రిసిటీ, 60 శాతం ఈథనాల్ ను కలిపితే ఇది సాధ్యమనేది ఆయన ఫార్ములా. రైతులు ‘అన్నదాత’లే కాదు ‘ఊర్జా దాత’లు కూడా కావాలని ఆయన పిలుపునిస్తుండటం అందరినీ ఆలోచింపచేస్తోంది. ఇది సాధ్యమైనప్పుడే మనం పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులు బాగా తగ్గించి, వాతావరణ కాలుష్యాన్ని కూడా తగ్గించటం పూర్తిగా సాధ్యమవుతుందని ఈయన ఇన్నోవేటివ్ గా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. రాజకీయాలు తక్కువ, ఆసక్తికరమైన ఇతరత్రా విషయాలను బహిరంగ సభల్లో ఎక్కువగా ప్రస్తావించే గడ్కరీ మాటలు ఇలా వ్యాపారాల చుట్టూ భలే తిరుగుతుంటాయి.