Saturday, September 28, 2024
HomeతెలంగాణMallapur: చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలి

Mallapur: చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలి

నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిచి, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ డిమాండ్

చెరుకు రైతుల ప్రయోజనార్ధం మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించాలని కోరుట్ల కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు డాక్టర్ కుందారపు సాయికుమార్ అన్నారు. మల్లాపూర్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో ఇంచార్జి తహశీల్దార్ శ్రావణికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఎన్నికల హామీని మరిచి చెరుకు రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఉద్యమ సమయంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీలను ప్రభుత్వపరం చేయాలని డిమాండ్ చేసిన సీఎం కేసీఆర్ అధికారంలోకి రాగానే నడుస్తున్న ఫ్యాక్టరీలను మూసివేయించి చెరుకు రైతులను వంచించాడన్నారు. 100 రోజుల్లో ప్రభుత్వపరం చేస్తామన్న హామీని విస్మరించినందుకే కేసీఆర్ బిడ్డ కవితను రైతులు కలిసికట్టుగా ఓడించిన విషయాన్ని మర్చిపోవద్దన్నారు. రైతులు సహకార సంఘంగా ఏర్పడి నడుపుకుంటానంటేనే నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించి ఇస్తామనడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీగా గెలిపిస్తే సొంత డబ్బులతోనైనా నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించి నడిపిస్తా అంటూ ప్రగల్భాలు పలికి రైతులతో ఓట్లు వేయించుకుని గెలిచిన బీజేపీ ఎంపీ బాండ్ పేపర్ అరవింద్ నాలుగేళ్లు గడుస్తున్నా.. షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకోలేదని, పసుపు బోర్డ్ రాలేదని హెద్దేవా చేశారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకుల కుట్రలను రైతులు గమనిస్తున్నారని, సరైన సమయంలో బీఆర్ఎస్, బీజేపీలకు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఇప్పటికైనా బీఆర్ఎస్, బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు రైతులకు ఇచ్చిన హామీ మేరకు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News