Sunday, October 6, 2024
Homeపాలిటిక్స్Vemula: చర్చనే కాదు నేను దేనికైనా సిద్ధమే

Vemula: చర్చనే కాదు నేను దేనికైనా సిద్ధమే

రోజూ కోటి రూపాయలకు తగ్గకుండా ఏదో ఒక అభివృద్ది పని ప్రారంభిస్తున్నాం

బాల్కొండ మండలంలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. అంతకుముందు అభివృద్ది పనుల శంకుస్థాపనల కోసం వచ్చిన మంత్రికి బాల్కొండ, కిసాన్ నగర్ గ్రామాల ప్రజలు బాణాసంచా, డప్పు చప్పుళ్లతో అపూర్వ స్వాగతం పలికారు. మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. బాల్కొండ మండల కేంద్రంలో అంబెడ్కర్ చౌరస్తా నుండి భూమరెడ్డి ఇంటి వరకు సెంట్రల్ లైటింగ్,రోడ్డు వెడల్పు మరియు డివైడర్ పొడిగింపు 2 కోట్ల వ్యయం గల పనులకు శంకుస్థాపన,తెలంగాణ ఫంక్షన్ హాల్ నుండి డబుల్ బెడ్ రూమ్ వరకు వయా సంతమల్లన్న గుడి 2.65 కోట్ల వ్యయంతో నూతన ఆర్అండ్ బి బిటి రోడ్ ఏర్పాటు, బాల్కొండ మండల కేంద్రంలో రింగ్ రోడ్డు నిర్మాణ పనులకు 44.62లక్షల వ్యయంతో శంకుస్థాపన చేశారు.

- Advertisement -

కిసాన్ నగర్ గ్రామంలో 20 లక్షల వ్యయంతో చేపట్టే నూతన గ్రామ పంచాయతీ బిల్డింగ్ నిర్మాణ పనుల శంకుస్థాపన, కిసాన్ నగర్ నుండి జలాల్ పూర్,నాగపూర్ X రోడ్ వరకు డబుల్ రోడ్ గా మార్చుట 2.42 కోట్ల వ్యయం పనులకు శంకుస్థాపన,బిఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ…

సీఎం కేసిఆర్ గారి ఆశీర్వాదంతో బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ది పనుల పరంపర కొనసాగుతుందని అన్నారు. ప్రతీ రోజు కోటి రూపాయలకు తగ్గకుండా ఏదో ఒక అభివృద్ది పని ప్రారంభిస్తున్నామని తెలిపారు. కానీ ఇది గిట్టని కొంత మంది సోషల్ మీడియాలో కోడి గుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారనీ మండిపడ్డారు. వారు అధికారంలో ఉన్నప్పుడు నిధులు తేవడం చేతకాలేదు, తాను నిధులు తెచ్చి అభివృద్ది చేస్తుంటే మాత్రం అడ్డం పడే మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా కంటే ముందు 10ఏళ్లు కాంగ్రెస్ పార్టీ ఉండే కదా అప్పుడు జరిగిన అభివృద్దికి కనీసం రెండు రెట్ల అభివృద్ది ప్రతీ గ్రామంలో ఇప్పుడు జరిగిందనీ,దీనిపై చర్చనే కాదు నేను దేనికైనా సిద్ధమే అని మంత్రి సవాల్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయనీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు…చందమామ తీసుకొచ్చి మీ వొళ్ళో పెడ్తాం అని ఇప్పుడు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేసారు. అబద్ధపు హామీల మాయలో పడిమోసపోవద్దని..ప్రజలు ఆలోచన చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

మోసపు హామీతో ఓట్లు దండుకున్న అర్వింద్…అభివృద్ది పనుల కోసం ఒక్క కొబ్బరికాయ అయినా కొట్టిండా..?

బాండ్ పేపర్ రాసిచ్చి రైతులను మోసం చేసి ఎంపీగా గెలిచిన అర్వింద్ అడ్రస్ లేకుండా పోయాడని విమర్శించారు. మోసపు హామీతో రైతుల ఓట్లు దండుకున్న అరవింద్ ఎంపీగా ఈ ప్రాంత అభివృద్ధి, కిసాన్ నగర్ లో అభివృద్ది కోసం ఒక్క కొబ్బరికాయ అయినా కొట్టిండా అని నిలదీశారు. నన్ను గెలిపిస్తే 5 రోజుల్లో తెస్తా అన్న పసుపు బోర్డు 5 ఏళ్ళైనా దాని ఊసేలేదని,కేసిఆర్,కెటిఆర్,కవిత,ప్రశాంత్ రెడ్డిని తిట్టడానికే ఆయనకు 4ఏళ్లు అయిపోయినయ్ అని ఎద్దేవా చేసారు. మోసపు మాటలు చెప్తున్న వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ,అభివృద్ది పనులు చేస్తూ..ప్రజల మేలు కోరే కేసిఆర్ కు అందరూ అండగా నిలవాలని మంత్రి ఈ సందర్బంగా కోరారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారులు,బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News