Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్3rd world war?: 3వ ప్రపంచ యుద్ధ మేఘాలు కమ్ముకొంటున్నాయా ?

3rd world war?: 3వ ప్రపంచ యుద్ధ మేఘాలు కమ్ముకొంటున్నాయా ?

ప్రపంచ శాంతి మూడవ ప్రపంచ యుద్దాన్ని ఆపగలదు

ప్రపంచ దేశాలు ‘అల్లీస్‌ (ఫ్రాన్స్‌, యుకె, యుయస్‌, యుఎస్‌ఎస్‌ఆర్‌, చైనా, పోలాండ్‌)’ మరియు ‘ఆక్సిస్‌ (జర్మనీ, జపాన్‌, ఇటలీ)’ అనబడే రెండు జట్లుగా ప్రపంచ ముఖ్యదేశాలు విడిపోయి 1939 నుంచి 1945 వరకు జరిగిన భీకర 2వ ప్రపంచ యుద్ధంలో పాల్గొనడం మనకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా 30 దేశాలకు చెందిన 100 మిలియన్ల జనాభా పాల్గొనడం, 85 మిలియన్ల సైనిక/సామాన్య ప్రజల అపార ప్రాణ నష్టం, తొలి అణుబాంబుల విధ్వంసకర (హిరోషిమ, నాగసాకి) భయానక అనుభవాలు, యుద్ధ అనంతర కరువులు, వ్యాధుల వ్యాప్తి పీడలు, ఆస్తి విధ్వంసాలు, మారణహోమం, నరమేధం, అపార ఆర్థిక కుదుపులతో ప్రపంచ చరిత్రలోనే అత్యంత చేదు అనుభవాలను చవిచూశాయి. ‘ఆక్సిస్‌’ వర్గపు జర్మనీ, జపాన్‌ తదితర దేశాలు అపార ఆస్తి, ప్రాణ నష్టాలను నమోదు చేసుకోవడం, కనీసం 12 మిలియన్ల ప్రాణనష్టం జరగడం అత్యంత బాధాకరం. విజేతలైన ‘అల్లీస్‌’ వర్గంలో కూడా దాదాపు 61 మిలియన్ల ప్రాణ నష్టం జరిగిందని తెలుస్తున్నది. ఒక్క సోవియట్‌ యూనియన్లోనే 27 మిలియన్లు, జర్మనీ 5.3 మిలియన్లు, చైనా 7.5 మిలియన్ల ప్రాణాలను కోల్పోవలసి వచ్చింది. వరల్డ్ వార్‌-2లో సహితం దాదాపు 87,000 మంది సైనికులు, లక్షకు పైగా సామాన్య జనం ప్రాణత్యాగం చేశారు.
2వ ప్రపంచ యుద్ధం: 1 సెప్టెంబర్‌ 1939న హిట్లర్‌ నాజీ జర్మనీ సేనలు పోలాండ్‌పై దండయాత్ర చేయడంతో 2వ ప్రపంచ యుద్ధానికి బీజాలు పడ్డాయి. ఈ దాడిని ఖండించిన యుకె, ఫ్రాన్స్‌ దేశాలు 3 సెప్టెంబర్‌న జర్మనీపై యుద్ధం ప్రకటించడంతో భీకర ప్రపంచ యుద్ధం విధ్వంసక జడలను విప్పడం, ప్రపంచ దేశాలు రెండు గ్రూపులుగా విడిపోవడంతో యుద్ధ తీవ్రత మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేసింది. హిట్లర్‌ ఆత్మహత్య చేసుకోవడంతో జర్మనీ దురాక్రమణ చేసిన భూమిని వదిలేయడం, 8 మే 1945న బేషరతుగా జర్మనీ ఓటమిని అంగీకరించడం జరిగింది. ఓటమిని అంగీకరించని జపాన్‌లోని హిరోషిమ 6 ఆగష్టు 1945), నాగసాకి (09 ఆగష్టు 1945) నగరాలపై రెండు అణుబాంబులు వేయడంతో జపాన్‌ ఓటమిని అంగీకరించడం (15 ఆగష్టు)తో 2వ ప్రపంచ యుద్ధం 2 సెప్టెం బర్‌ 1945న ముగిసినట్లు ప్రకటన వెలువడింది.
ఐరాస భద్రతామండలికి అంకురార్పణ: ప్రపంచ యుద్ధం-2 నేర్పిన గుణపాఠాన్ని గమనించిన ఐరాస సత్వరమే చొరవ తీసుకొని, ఇలాంటి యుద్ధాలు మానవాళికి శాపాలుగా మారుతాయని అంగీకరించి, ప్రపంచ యుద్ధాలను నిరోధించడంలో భాగంగా నాటి అగ్రరాజ్యాలైన యుఎస్‌, రష్యా, యుకె, ఫ్రాన్స్‌, చైనా సభ్యుల శాశ్వత సభ్యత్వంతో కూడిన ‘ఐరాస భద్రతా మండలి’ని ఏర్పాటు చేయడం మనకు విదితమే. అనంతరం అర్థ శతాబ్ద కాలంపాటు అమెరికా, సోవియట్‌ యూనియన్‌ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధ మేఘాలు కమ్ముకోవడం కూడా చూశాం.
ప్రపంచ మానవాళి పరిణామ చరిత్ర మనకు అద్వితీయ గుణపాఠాలను నేర్పుతున్నది. యుద్ధాలు ఎవరు గెలిచినా మారణహోమం, మానవ వనరుల విధ్వంసం తప్పనిసరి అవుతున్నది. రెండు ప్రపంచ యుద్ధాలు పరిచయం చేసిన అపార మారణహోమం నుంచి మనందరిలో ఆత్మవిమర్శలకు దారులు తెరవాలి. శతాబ్దం దాటిన ప్రపంచ యుద్ధం-1, 75 ఏండ్ల దాటిన 2వ ప్రపంచ యుద్ధ క్షేత్రాల్లో కోట్ల ప్రాణాలు గాల్లో కలవడం, అపార ఆస్థి నష్టం నమోదుకావడం మనకు హెచ్చరిక కావాలి. 3వ ప్రపంచ యుద్ధమే జరిగితే అత్యాధునిక ఆయుధాలు, అణు బాంబు విధ్వంసాలతో భూమి క్షణాల్లో బద్దలు కావడం ఖాయమని తెలుసుకోవాలి. ఓడినవారు సర్వస్వాన్ని, గెలిచిన వారు భవిష్యత్తు తరాలను కోల్పోతారు. అమెరికాతో ఉత్తర కొరియా, ఇండియాతో చైనా/పాక్‌, తైవాన్‌తో చైనా దేశాల మధ్య అనాదిగా ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఒకవేళ 3వ ప్రపంచ యుద్ధమే జరిగితే శక్తివంతమైన క్షిపణులు (మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌), అణ్వాయుధాల అమ్ముల పొదలు భూగోళం దద్దరిల్లేలా గర్జనలు చేయనున్నాయి. సిరియా, అఫ్ఘానిస్థాన్‌, ఉత్తర కొరియాలు ప్రపంచ శాంతికి విఘాతాలుగా మారుతున్నాయి. వీటికి తోడుగా నేడు మరో 67 దేశాల మధ్య ప్రచ్చన్న యుద్ధ వాతావరణం నెలకొని ఉంది.
రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం: నేడు ఏ రెండు అతి చిన్న దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైనా, మరో ప్రపంచ యుద్ధానికి కారణం కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్‌ దేశాల మధ్య యుద్ధం 24 ఫిబ్రవరి 2022న ప్రారంభమై నేటికీ కొనసాగుతున్నది. ఇప్పటికే ప్రపంచ దేశాలు రష్యా, ఉక్రెయిన్‌ల పక్షాన చేరడం, యుద్ధ సామాగ్రిని అందించడం, సంఘీభావాన్ని వ్యక్తం చేయడంతో గత 19 నెలలుగా యుద్ధం జరుగుతూ, అపార నష్టాలకు కారణం అవుతున్నది. ఈ యుద్ధంలో ఇరుపక్షాలకు చెందిన 5 లక్షల మంది మరణించడం లేదా గాయపడడం జరిగినట్లు అంచనాలు వెలువడుతున్నాయి. డిజిటల్‌ కాలంలో యుద్ధం ప్రమాదకరమని, యుద్ధాలతో సమాధానాలు దొరకవని, శాంతియుత వాతావరణంలో చర్చల ద్వారానే శాశ్వత పరిష్కారాలు లభిస్తాయని నమ్మవలసిందే. ఒకవేళ యుద్ధానికే కాలుదువ్వితే ఇరుపక్షాల వైపు ప్రపంచ దేశాలు చేరి, మరో ప్రపంచ యుద్ధ వాతావరణం నెలకొనడం, మానవాళి/సకల ప్రాణికోటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. బాధ్యతగల పౌరులందరూ ప్రపంచ దేశాలు శాంతి పావురాలను ఎగురవేస్తూ, వసుదైక కుటుంబ భావనలకు పట్టాభిషేకం చేస్తూ, సర్వమానవాళి సంక్షేమ దిశగా అడుగులు వేయాలని ఆశిద్దాం.
డా॥ బుర్ర మధుసూదన్‌ రెడ్డి
9949700037

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News