Friday, September 20, 2024
Homeహెల్త్Heal cracks: పగిలిన పాదాలు స్మూత్ గా, అందంగా..

Heal cracks: పగిలిన పాదాలు స్మూత్ గా, అందంగా..

ఇంటి చిట్కాలతో చక్కని హీల్ మీ సొంతం

పగిలిన పాదాలు చూడడానికి బాగుండవు. అంతేకాదు ఆ పగుళ్ల వల్ల పాదాలు ఇన్ఫెక్షన్ల బారిన పడి దెబ్బతింటాయి కూడా. ఈ సమస్య పరిష్కారానికి కొన్ని సహజ చిట్కాలు ఉన్నాయి.   

- Advertisement -

పాదాలకు ఉప్పు, గ్లిజరిన్, రోజ్ వాటర్ మూడింటితో చేసిన ఫుట్ మాస్కు రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. రోజ్ వాటర్ లో యాంటాక్సిడెంట్లు బాగా ఉంటాయి. ఇవి కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. ఇందులో యాంటిఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఇరిటేటెడ్ స్కిన్ బాధలను అరికడుతుంది. గ్లిజరిన్ మీ చర్మం యొక్క సహజ మాయిశ్చరైజర్ గుణాన్ని తిరిగి తెస్తుంది. సహజ మాయిశ్చరైజర్ ప్రమాణాలను తిరిగి పొందేలా కూడా చేస్తుంది. ఇవన్నీ పగిలిన పాదాలపై బాగా పనిచేసి పాదాలను మృదువుగా, అందంగా కనిపించేలా చేస్తాయి. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ గ్లిజరిన్, రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్, గోరువెచ్చటి నీళ్లు కొన్ని, అలాగే ఫుట్ స్క్రబ్బర్ లేదా ప్యుమైస్ స్టోన్ రెడీగా పెట్టుకోవాలి. బేసిన్ నిండా గోరువెచ్చటి నీళ్లు తీసుకుని అందులో రాళ్లుప్పు, ఒక టేబుల్ స్పూన్ గ్లిజరిన్, ఒ టీస్పూన్ రోజ్ వాటర్ వేసి బాగా కలిపి ఆ నీళ్లల్లో పాదాలను 20 నిమిషాల సేపు ఉంచాలి. ఫుట్ స్క్రబ్బర్ లేదా ప్యూమైస్ స్టోన్ తో పాదాలను, దాని పక్కలను బాగా రుద్దాలి. లేదా ఒక టీస్పూన్ గ్లిజరిన్, ఒక టీస్పూన్ రోజ్ వాటర్ తీసుకుని రెండింటినీ బాగా కలిపి ఆ మిశ్రమాన్ని పగిలిన పాదాలపై పూయాలి. ఈ మిశ్రమం అతుక్కుపోతుంటుంది.  కాబట్టి పాదాలకు సాక్స్ తప్పనిసరిగా వేసుకొని రాత్రిపూట పడుకోవాలి. ఉదయం లేచిన తర్వాత పాదాలను గోరువెచ్చటి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే మంచి ఫలితం చూస్తారు.

      ఇంకొక చిట్కా ఏమిటంటే, వెజిటబుల్ ఆయిల్స్ కూడా పాదాల పగుళ్ల మీద బాగా పనిచేస్తాయి. ఉదాహరణకు బాదం ఆయిల్, జొజొబా ఆయిల్ వంటి వాటిల్లో ఎమోల్లియంట్ గుణాలతో పాటు యాంటిమైక్రోబియల్, యాంటాక్సిడెంట్, యాంటి ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు గాయాన్ని మాన్పే, సాంత్వన నిచ్చే గుణాలు కూడా బాగా ఉన్నాయి. పగిలిన పాదాలకు రాయడానికి వెజిటబుల్ ఆయిల్ రెండు  టీస్పూన్లు కావాలి. దీన్ని అప్లై చేసుకోబోయే ముందు పాదాలను శుభ్రంగా నీళ్లతో కడుక్కుని తువ్వాలతో పొడిగా తుడుచుకోవాలి. పగుళ్లు ఉన్న ప్రదేశంలో ఒక పొర వెజిటబుల్ ఆయిల్ రాయాలి. మందంగా ఉండే సాక్స్ వేసుకుని రాత్రి పడుకోవాలి. పొద్దున్న లేచిన తర్వాత పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి.ఇలా రోజూ రాత్రి పడుకోబోయే చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.  

  ఇంకో చిట్కా ఉంది. ఇది అరటిపండు, అవకెడో ఫుట్ మాస్కు.  పాదాల పగుళ్లను ఇది కూడా బాగా తగ్గిస్తుంది.  అవకెడో పండులో విటమిన్ ఎ, ఇ, ఓమేగా ఫ్యాటీ యాసిడ్లు ఉన్నాయి. అంతేకాదు గాయాన్ని తగ్గించే గుణాలు కలిగిన పోషకాలు కూడా ఇందులో ఉన్నాయి. అరటిపండు మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ఇవి రెండూ పగిలిన పాదాలకు గొప్ప సాంత్వననిస్తాయి. దీనికి బాగా పండిన ఒక అరటి పండు, అరచెక్క అవకెడో అవసరమవుతాయి. పండిన అరటిపండు, అవకెడో ముక్క రెండింటినీ కలిపి మెత్తగా పేస్ట్ లా చేయాలి. ఈ చిక్కటి పేస్టును పగిలిన పాదాలకు పూసి ఇరవైనిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్లతో పాదాలను శుభ్రంగా కుడక్కోవాలి. ఈ మాస్కును నిత్యం పాదాలకు అప్లై చేసుకోవచ్చు.     పెట్రోలియం జెల్లీ కూడా పాదాల పగుళ్లను బాగా తగ్గిస్తుంది.  ఇది చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉండేలా చేస్తుంది. ఒక టీస్పూన్ వాజిలైన్, మాయిశ్చరైజర్, ప్యుమైస్ స్టోన్, గోరువెచ్చటి నీళ్లు రెడీ పెట్టుకోవాలి. గోరువెచ్చటి నీళ్లల్లో పాదాలను 20 నిమిషాలు నాననివ్వాలి. పాదాలను ప్యూమైస్ స్టోన్ తో స్క్రబ్ చేయాలి. పాదాలను పొడిగా తుడుచుకొని పగుళ్లు ఉన్న ప్రదేశంలో మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. దానిపై వాజిలైన్ రాయాలి. రాత్రి పాదాలకు సాక్స్ వేసుకుని పడుకోవాలి. ఉదయం లేచిన తర్వాత పాదాలను నీటితో శుభ్రంగా కడుక్కోవాలి.  పగిలిన పాదాలపై తేనె కూడా మంచి ప్రభావం చూపి పగుళ్లను నివారిస్తుంది. తేనెలో యాంటిసెప్టిక్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి పగిలిన పాదాలకు సాంత్వన నివ్వడమే కాకుండా ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. చర్మాన్ని పునరుజ్జీవింపచేస్తుంది. ఒక కప్పు తేనె, కొద్దిగా గోరువెచ్చటి నీళ్లను రెడీ పెట్టుకోవాలి. బకెట్లో సగం వరకూ గోరువెచ్చటి నీళ్లు తీసుకుని అందులో ఒక కప్పు తేనె వేసి బాగా కలపాలి. ఆ నీళ్లల్లో పాదాలను 20నిమిషాల పాటు నాననివ్వాలి. తర్వాత పాదాలను సున్నితంగా స్క్రబ్ చేయాలి. ఇలా నిత్యం చేయడం వల్ల మీ పాదాలు పట్టులా ఎంతో మెత్తగా, మృదువుగా ఉంటాయి.    

బియ్యప్పిండి కూడా పాదాల పగుళ్లను తగ్గించడంలో మంచి స్కిన్ ఎక్స్ ఫొయిలేటర్ గా పనిచేస్తుంది. చర్మంపై ఏర్పడ్డ మురికి, మృతకణాలను పోగొట్టి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.  మీరు చేయాల్సిందల్లా రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండి, ఒక టీస్పూను తేనె, మూడు లేదా నాలుగు చుక్కలు యాపిల్ సిడార్ వెనిగర్లను రెడీ పెట్టుకోవాలి. రెండు లేదా మూడు చెంచాల బియ్యప్పిండిలో కొన్ని చుక్కల తేనె, యాపిల్ సిడార్ వేసి మెత్తటి పేస్టులా చేయాలి. మీ పాదాలు మరీ పొడిబారినట్టు ఉంటే అందులో ఆలివ్ ఆయిల్ లేదా స్వీట్ ఆల్మండ్ ఆయిల్ ని కొద్దిగా వేయాలి. గోరువెచ్చటి నీళ్లల్లో పాదాలను పది నిమిషాలు ఉంచి బియ్యప్పిండి స్క్రబ్ తో పాదాలను సున్నితంగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే మృతకణాలు పోతాయి. ఈ స్క్రబ్ ను వారానికి రెండుసార్లు పాదాలకు రాసుకుంటే మంచి ఫలితం చూస్తారు.  ఓట్మీల్ కూడా పాదాల పగుళ్లను శక్తివంతంగా నివారిస్తుంది.  ఇందులో యాంటిఇన్ఫ్లమేటరీ గుణాలు బాగా ఉన్నాయి. అలాగే మాయిశ్చరైజర్ సుగుణాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇవి చర్మంపై ఉండే మృతకణాలను పోగొట్టి చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ ఓట్మీల్ పొడి, నాలుగు లేదా ఐదు చుక్కల ఆలివ్ ఆయిల్ అందులో వేసి మెత్తటి పేస్టులా చేయాలి. ఆ పేస్టును పగిలిన పాదాలపై రాసుకొని అరగంటసేపు అలాగే వదిలేయాలి. ఆతర్వాత చల్లటి నీళ్లతో పాదాలను కడుక్కుని తువ్వాలుతో పొడిగా తుడుచుకోవాలి. రోజు విడిచి రోజు ఇలా చేస్తే పాదాలు పగుళ్లు పోయి ఎంతో అందంగా తయారవుతాయి.    

నువ్వుల నూనెను పాదాల పగుళ్లపై రాసినా కూడా మంచి ఫలితం కనిపిస్తుంది. నూనెతో పాదాలను మసాజ్ చేయాలి.  నిత్యం రాత్రి నిద్రపోయేముందు దీన్ని పాదాలకు రాసుకుని పడుకుంటే పాదాలు అందంగా, ఆరోగ్యంగా తయారవుతాయి. కొబ్బరినూనె కూడా పాదాల పగుళ్లను తగ్గిస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె, ఒక సాక్స్ జత రెడీ పెట్టుకోవాలి.  పాదాలు పగిలిన చోట కొబ్బరినూనె రాసి సాక్స్ వేసుకుని రాత్రి పడుకోవాలి. ఉదయం లేచిన తర్వాత పాదాలను నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు ఆపకుండా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.  బేకింగ్ సోడా స్కిన్ ఎక్స్ ఫొయిలేటర్ బాగా పనిచేస్తుంది.  చర్మంపై ఉండే మృతకణాలను పోగొడుతుంది. చర్మాన్ని మృదువుగా చేస్తుంది. పాదాలపై పుండ్లు లాంటివి ఉంటే మాత్రం ఈ చిట్కాను అనుసరించొద్దు. గాయాలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. మూడు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా, గోరువెచ్చటి నీళ్లు, ఒక బకెట్, ప్యూమైస్ స్టోన్ రెడీ పెట్టుకోవాలి. బకెట్లో రెండువంతులు గోరువెచ్చని నీళ్లు తీసుకుని అందులో బేకింగ్ సోడా వేసి కరగనివ్వాలి. ఆ నీళ్లల్లో పది నిమిషాల పాటు పాదాలను ఉంచాలి. తర్వాత పాదాలను బయటకు తీసి ప్యూమైస్ స్టోన్ తో సున్నితంగా స్క్రబ్ చేసుకొని నీళ్లతో పాదాలను కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

    ఈ సమస్యకు యాపిల్ సిడార్ వెనిగర్ మంచి కెమికల్ ఎక్స్ ఫొయిలేటర్ గా పనిచేస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఒక కప్పు యాపిల్ సిడార్ వెనిగర్, గోరువెచ్చని నీళ్లు, ఒక బేసిన్ ని రెడీ పెట్టుకోవాలి. బేసిన్ లో తగినన్ని గోరువెచ్చని నీళ్లు పోసి అందులో యాపిల్ సిడార్ వెనిగర్ ని వేసి బాగా కలపాలి. తర్వాత అందులో పాదాలను పదిహేను నిమిషాల పాటు నాననివ్వాలి. ఆతర్వాత పాదాలను సున్నితంగా స్క్రైబ్ చేయాలి. ఇలా రోజు విడిచి రోజు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.    

అలొవిరా జెల్ కూడా పాదాల పగుళ్లపై బాగా పనిచేస్తుంది.  చర్మాన్ని మృదువుగా చేస్తుంది. చర్మంపై మృతకణాలను పోగొడుతుంది. ఇందులోని ఎమినో యాసిడ్స్ చర్మాన్ని పట్టులా మెత్తగా ఉండేలా చేస్తాయి. అలొవిరా జెల్, గోరువెచ్చటి నీళ్లు, ఒక పెద్ద బేసిన్, సాక్స్ జత లను రెడీ పెట్టుకోవాలి. గోరువెచ్చటి నీళ్లల్లో కొద్దిసేపు పాదాలను నాననివ్వాలి. తర్వాత పాదాలను పొడిగా తుడుచుకుని అలొవిరా జెల్ ను పాదాలకు రాయాలి.  తర్వాత సాక్స్ వేసుకుని పడుకోవాలి. పొద్దున్న లేచాక పాదాలను నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారంలో నాలుగైదురోజుల పాటు నిత్యం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. 

టీట్రీ ఆయిల్ కూడా పాదాల పగుళ్లను పరిష్కరిస్తుంది. ఇందులో గాయాన్ని మాన్పే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కొబ్బరినూనె పొడి చర్మాన్ని మృదువుగా చేయడమే కాకుండా చర్మంపై ఉండే మృతకణాలను పోగొడుతుంది. ఐదారు చుక్కల టీట్రీ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనె లేదా ఆలివ్ నూనె , ఒక సాక్స్ జత రెడీ పెట్టుకోవాలి. టీట్రీ ఆయిల్, కొబ్బరినూనె లేదా ఆలివ్ నూనె రెండింటినీ బాగా కలిపి పేస్టులా చేయాలి. దాన్ని పగిలిన పాదాలపై రాసి రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. రాత్రి పాదాలకు సాక్స్ వేసుకుని పడుకొని ఉదయం గోరువెచ్చటి నీళ్లతో పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి. ప్రతిరోజూ నిద్రపోవడానికి ముందు ఈ ఫుట్ మాస్కును పాదలకు రాసుకుని పడుకుంటే పాదాలు ఎంతో అందంగా, మృదువుగా తయారవుతాయి.

    షియా బటర్ వల్ల కూడా పాదాల పగుళ్లు తగ్గుతాయి. ఇది చర్మానికి కావలసినంత హైడ్రేషన్ అందివ్వడమే కాదు చర్మాన్ని పునరుజ్జీవింపచేస్తంది. చర్మానికి కావలసిన మాయిశ్చరైజర్ ని అందిస్తుంది. ఇందులో సాంత్వననిచ్చే గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. చర్మం పొడిబారడం వంటి పలు స్కిన్ సమస్యలనుంచి ఇది బయటపడేస్తుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ ఎ, విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి. ఈ ఫుట్ మాస్కుకు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల ఆర్గానిక్ షియా బటర్ కావాలి. మీ పాదాలకు షియా బటర్ రాసి రెండు నిమిషాలపాటు పాదాలను మసాజ్ చేయాలి. రాత్రి పడుకోబోయేముందు సాక్స్ వేసుకోవడం మరవొద్దు. ఇలా కొన్ని రోజులు రాత్రి పడుకోబోయేముందు చేస్తే పాదాలకు ఉన్న పగుళ్లు పోతాయి. 

    ఈ ఇంటిచిట్కాలు అనుసరించి మీ పగిలిన పాదాలను అందంగా, ఆరోగ్యంగా మలుచుకోండి…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News