Sunday, October 6, 2024
HomeతెలంగాణSingareni: గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి దిశగా సింగరేణి

Singareni: గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి దిశగా సింగరేణి

ప్రస్తుత ప్లాంటును గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ గా మార్పు

దేశంలో సోలార్ విద్యుత్తు రంగంలోకి అడుగుపెట్టిన తొలి బొగ్గు కంపెనీగా పేరు తెచ్చుకున్న సింగరేణి కాలరీస్ మరో భారీ పర్యావరణహిత కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. సింగరేణి నిర్వహణలో ఉన్న ప్రస్తుత హైడ్రోజన్ ప్లాంటును గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ గా మార్చడంతో పాటు, స్వీయ నిర్వహణలో రామగుండం రీజన్ లో ఒక గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించి నివేదికలు సమర్పించాలని సంస్థ ఛైర్మన్ ఎండీ ఎన్. శ్రీధర్ విద్యుత్ విభాగ ఉన్నతా అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ సింగరేణి భవన్ లో విద్యుత్ విభాగం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ విషయం పై ప్రత్యేకించి చర్చించారు. నేడు ప్రతీ పరిశ్రమ పర్యావరణ స్పృహతో ఉత్పత్తులు సాధించేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే 224 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను పర్యావరణహితంగా నిర్వహిస్తున్న సింగరేణి పర్యావరణ హిత హైడ్రోజన్ ను కూడా ఉత్పత్తి చేయాలని ఛైర్మన్ సూచించారు. 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్ర వినియోగానికి అవసరమైన హైడ్రోజన్ ను ఇకపై సోలార్ విద్యుత్తును వినియోగిస్తూ ఉత్పత్తి చేయాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రస్తుత ప్లాంటులో తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. అలాగే మరో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించి నివేదిక సమర్పించాలని కోరారు. దేశంలో గ్రీన్ హైడ్రోజన్ వాడే తొలి పవర్ స్టేషన్ కానున్న సింగరేణి సాధారణంగా హైడ్రోజన్ వాయువు ఉత్పత్తిని థర్మల్ విద్యుత్ వినియోగించి ఎలక్ట్రాలసిస్ రసాయనిక పద్ధతిలో ఉత్పత్తి చేస్తుంటారు. ఈ ప్రక్రియలో థర్మల్ విద్యుత్తుకు బదులు సోలార్ విద్యుత్ వినియోగించి ఉత్పత్తి చేసే హైడ్రోజన్ ను ‘గ్రీన్ హైడ్రోజన్’ గా పేర్కొంటున్నారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో గల రెండు 600 మెగావాట్ల జనరేటర్ లలో వేడిమిని తగ్గించడం కోసం శీతలీకరణ ధాతువుగా హైడ్రోజన్ ను వినియోగిస్తున్నారు. దీనికోసం ప్లాంట్ ఆవరణలోనే ఒక హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఏడాదికి దాదాపు 10 వేల క్యూబిక్ మీటర్ల హైడ్రోజన్ వాయువును ఈ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేసి వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్లాంట్ 100 కిలో వాట్ విద్యుత్తును వినియోగిస్తూ హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తుంది. ఈ నేపథ్యంలో పర్యావరణహిత చర్యగా ప్లాంటును ఇకపై సోలార్ విద్యుత్తు వినియోగం ద్వారా నిర్వహించాలని, తద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తూ, దానిని వినియోగిస్తున్న తొలి థర్మల్ విద్యుత్ కేంద్రంగా దేశంలో నిలవాలని సింగరేణి సంస్థ భావించింది. దీనికి మరో సానుకూల అంశం ఏంటంటే సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్ర ప్రాంగణంలోనే ప్రస్తుతం 10 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రం మరియు 5 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు ఉన్నాయి. అక్కడి నుండి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ప్రస్తుత హైడ్రోజన్ ప్లాంటుకు వినియోగించుకునేందుకు పూర్తి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పర్యావరణహిత చర్యగా మరో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ను కూడా రామగుండం రీజన్ లో సింగరేణి సోలార్ ప్లాంట్లు గల ప్రాంతంలో ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటును సింగరేణి ఏర్పాటు చేస్తే ఈ హైడ్రోజన్ వాయువును సింగరేణితో పాటు సమీపంలోని ఎరువుల కర్మాగారాలకు ఇతర కర్మాగారాలు కూడా విక్రయించే అవకాశం ఉంది. లాభాల కన్నా ఒక మంచి పర్యావరణ హిత చర్యగా ఈ ప్రాజెక్ట్ ను చేపట్టాలని కంపెనీ భావిస్తుందని సంస్థ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.
సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా రు.108 కోట్ల ఆదా, ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలల కాలంలో సింగరేణి వ్యాప్తంగా ఉన్న సోలార్ ప్లాంట్ల ద్వారా 170 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయింది. తద్వారా సింగరేణి సంస్థ తెలంగాణ ట్రాన్స్కోకు చెల్లించే విద్యుత్ బిల్లులో 108 కోట్ల రూపాయలను ఆదా చేసుకోగలిగింది. ఈ వివరాలను డైరెక్టర్ ఈ అండ్ ఎం. డి.సత్యనారాయణ రావు ఛైర్మన్ కు వివరించారు. ఇంకా నిర్మాణంలో ఉన్న 76 మెగా వాట్ల సోలార్ ప్లాంట్లను డిసెంబర్ నాటికల్లా పూర్తి చేయాలని ఛైర్మన్ ఆదేశించారు. అలాగే సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్ర పనితీరును కూడా ఆయన సమీక్షించారు. ఇదే కాక సింగరేణి పర్యావరణ హిత చర్యగా ఎఫ్.జి.డి, దేశంలో మొదటిసారిగా ఎస్.టి.పి.పి లో చేపట్టిన మితనాల్ ప్రాజెక్ట్ మరియు మణుగూరులో చేపట్టిన జియో థర్మల్ ప్రాజెక్ట్ లను త్వరగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో డైరెక్టర్ ఈ & ఎం డి.సత్యనారాయణ రావు, సిటిసి సంజయ్ కుమార్ సూర్, చీఫ్ ఓ &ఎం జే.ఎన్.సింగ్, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్ర జనరల్ మేనేజర్ చినబసివిరెడ్డి, జనరల్ మేనేజర్ సోలార్ జానకిరామ్, చీఫ్ ఆఫ్ పవర్ ఎన్.వికేవి రాజు, జిఎం సివిల్ సూర్యనారాయణ, ఏజీఎం సివిల్ కేఎస్ఎన్ ప్రసాద్, ఏజీఎం ఎఫ్ & ఏ సుధాకర్, తదితర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News