Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Mandala Parashuramulu: నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన సేవా తత్పరుడు

Mandala Parashuramulu: నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన సేవా తత్పరుడు

సేవా భావం పెంపొందించుకుంటేనే మానవాళికి అర్థం

ప్రజా సేవకుడు మండల పరశురాములు
‘బిడ్డల పాలకై బిచ్చమెత్తు దేశంలో.
రాళ్లకు పాలిచ్చు కథ నశించునదెన్నడో.
పేడకు బొట్టెట్టి దైవమని పూజించువారు.
పేదను గుర్తించగ మారబోవునదెన్నడో’ కవి ముత్తువేల్‌ కరుణానిధి రాసిన ఈ కవిత ప్రతిఒక్కరిని ఆలో చింపజేస్తుంది. బిడ్డల పాలకొరకు బిచ్చమెత్తుకుంటున్న దేశంలో పసిబిడ్డలకు పాలు అందించరు కానీ..రాళ్లనే దేవుడిగా భావించి క్షీరాభిషేకం చేస్తారు, కుబేరులున్న దేశంలో కూటికి లేనివాడికి కూడు కరువు ఇలాంటి సంఘటనలు ఎప్పుడు నశిస్తాయో అని తన ఆవేదనను కవిత ద్వారా అందించారు. కానీ నేటికీ ఇలాంటి పరిస్థితులు కొనసాగుతుండటం బాధాకరమైన విషయం.
ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కాని ఉన్నన్నాళ్ళు వెతుకుతువుంటాడు జీవుడు.
ఎవరన్నారో గాని ఆనాడు మానవసేవయే మాధవ సేవనే ఓ మహనీయుడు.
సేవే మార్గం అనే సిద్ధాంతాన్ని మనసా వాచా కర్మణా అనే సిద్ధాంతాన్ని సేవా మార్గంగా ఆచరించి చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న అతికొద్ది మంది మహనీయుల్లో మదర్‌ థెరిసా ఒకరు. ఆపదలో ఉన్నవారిని ఆదు కోవడమంటే దేవుడిని సాక్షాతూ పూజించడమేనని ప్రగాఢంగా విశ్వసించిన మదర్‌ థెరిసా లక్షలాది మందికి ప్రేమను పంచి, ప్రార్థించే పెదవుల కంటే సేవ చేసే చేతులే విలు వైనవని ప్రపంచానికి తెలియజేసింది. సాటి మానవుల పట్ల ప్రేమ, దయ కలిగి ఉండడం మరియు సేవా తాత్పరత యొక్క నిజమైన అర్ధమని సూచించారు. ఆమె మరణానంతరం కూడా కొన్ని కోట్ల మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. మానవుడే మహనీయుడు అనే నానుడిని నిజమని నిరూపించిన మహిళా మాతృమూర్తి. మదర్‌ థెరిసా స్ఫూర్తి పొంది ఎంతోమంది సామజిక సేవ కార్యక్రమాలు చేపడుతుండటం గొప్ప విషయం. అంతేకాదు 1988లో మదర్‌ థెరిసా వరంగల్‌ పర్యటన సందర్భంగా అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ కుముద్‌ బెన్‌ జోషి నేతృత్వంలో పరశురాములు సేవలకు గుర్తింపు లభించింది. మదర్‌ థెరిసా చేతులమీదుగా బెస్ట్‌ స్కౌట్‌ అవార్డు అందుకున్నారు. మదర్‌ థెరిసా స్పూర్తితో సామజిక సేవ రంగంలో 35 సంవత్సరాలుగా సేవలందిస్తూ అంతర్జాతీయ, జాతీయ అవార్డులు అందుకున్న తెలంగాణ బిడ్డ ప్రజా సేవకుడు ‘మండల పరశురాములు’.
ప్రజా సేవకుడు పరశురాములు
నిరుపేద కుటుంబంలో పుట్టిన పరశురాములు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ స్వయం కృషితో ఉన్నత స్థాయికి ఎదిగాడు. చిన్నప్పటి నుంచి తనకి ఎదురైన సమస్యలు జీవితంలో ఇతరులకు రాకూడదని భావించి చిన్నతనం నుంచే మూర్తీభవించిన మానవత్వంతో సామాజిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారించారు. 8వ తరగతి చదివే సమయంలో గురువుల స్పూర్తితో సమాజ సేవ పట్ల ఆసక్తితో 1981లో భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌లో చేరాడు. అందులో క్రమశిక్షణ మరియు అంకితభావ నిబద్ధత అలవర్చుకున్నారు. సామజిక సేవ చేయాలంటే విద్యయే సరైన మార్గమని తెలుసుకుని ఒకవైపు చదువు కొనసాగిస్తూనే పలు సేవ కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాకుండా ఆయన చేసిన సేవలను గుర్తించి 1985లో అప్పటి భారత రాష్ట్ర పతి గియాని జైల్‌ సింగ్‌ చేతుల మీదుగా ప్రెసిడెంట్‌ స్కౌట్‌ అవార్డు అందుకున్నారు. ఆతర్వాత అభ్యుదయ సేవా సమితి అనే స్వచ్చంధ సంస్థను ఏర్పాటు చేసి అక్షరాస్యత, బాల కార్మికుల వ్యవస్థ నిర్ములన, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత, బాల్య వివాహాల నివారణ, అక్రమ దత్తత నిలుపుదల, బాలల హక్కుల ఉల్లంఘన నిరోధం వంటి అంశాలలో ఎనలేని కృషి చేశారు. బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని బాల్య వివాహాలు నిలిపివేయాలని అనేక జిల్లాలో విస్తృత ప్రచారం చేయడమేగాక మహబూబాబాద్‌ జిల్లా, ములుగు జిల్లా, జనగామ జిల్లా, వరంగల్‌ జిల్లా పరిసరప్రాంతాలలో అనేక బాల్య వివాహాలను నిలిపి వేయించారు. అంతేకాకుండా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో 1989లో వరంగల్‌ జిల్లాలోని నెహ్రు యువ కేంద్రంలో జాతీయ సేవా వలంటీర్‌గా చేరి యువజన సంఘాలను ఏర్పాటు చేసి క్రీడా కార్యక్రమాలు, చెట్లు నాటించడం కొరకు శ్రమ దానం వంటి కార్యక్రమాలను నిర్వహించారు, రాత్రి బడులు నిర్వహించి నిరక్ష్యరాసులకు చదువు నేర్పించారు. అక్షరాస్యత కోఆర్డినేటర్‌గా సమర్ధవంతమైన సేవలందించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. జువైనల్‌ జస్టిస్‌ బోర్డు సభ్యుడిగా, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. అతని సేవలకు చిహ్నంగా, జాతీయ మరియు రాష్ట్ర స్థాయి యువజన పురస్కారాలు, నిఖిల్‌ కొయితారా ఆంతర్జాతీయ అవార్డు, గాడ్‌ ప్రే ఫిలిప్స్‌ బాల కార్మికుల నిర్ములన అవార్డు, ప్రపంచ శాంతి శిఖరాగ్ర పురస్కారం వంటి అనేక ప్రతిష్టాత్మకమైన అవార్డులు ప్రముఖుల చేతుల మీదుగా అందుకున్నారు. నిరుపేద కుటుంభంలో పుట్టి సామజిక సేవ కార్యక్రమాలు చేయటం అనేది గొప్ప విషయం. ఆయన సేవలు ప్రశంశనీయం, ప్రభంజనం. ఇలాంటి గొప్ప వ్యక్తులు మన రాష్ట్రంలో ఉండడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం.
కుటుంబ నేపథ్యం, విద్యాభ్యాసం
పరశురాములు గారు మార్చి 04, 1968న తెలంగాణ రాష్ట్రం, వరంగల్‌ అర్బన్‌ జిల్లా, రంగసాయిపేట రైల్వే గేట్‌ ప్రాంతంలో ఒక నిరుపేద కుటుంబంలో రాములు మరియు ఎల్లమ్మ దంపతులకు జన్మించారు. తండ్రి ఏజే మిల్లుల్లో దినసరి కూలీ. తల్లి ఎల్లమ్మ బీడీ కార్మికురాలు.
ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు రంగ శాయిపేటలోని ప్రాథమిక పాఠశాలలో విద్యాభ్యాసం కొనసాగింది. కుటుంబ పోషణ కొరకు తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూడలేక తల్లికి తోడుగా బీడీలు తయారు చేసి సహాయం అందించేవారు. గురువులు ఆయనకు చదువు పట్ల ఉన్న ఆసక్తిని గమనించి పైచదువులు చదవాలని ప్రోత్సహించేవారు. కుటుంబ పరిస్థితుల కారణంగా అతను ఉన్నత చదువులను అభ్యసించాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత వరంగల్‌లోని శంభుంపేటలోని ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి నుంచి పదో తర గతి చదివాడు. హనుమకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ పూర్తిచేశారు. ఆయన చదువుకునే సమయంలో ఎన్నో ఆటంకాలు, అవరోధాలు ఎదురైనా చదువే లక్ష్యంగా మొక్కవోని దీక్షతో ముందుకు సాగారు. ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన తర్వాత వరంగల్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో సివిల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేశారు. 1993లో వరంగల్‌ కాకతీయ విశ్వవిద్యాలయంలో యం. ఏ (పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌) పూర్తి చేశారు. ఎల్‌.ఎల్‌.బి. 2002లో వరంగల్‌లోని కాకతీయ యూని వర్సిటీలో పూర్తి చేశారు. యం .ఎస్‌.డబ్ల్యూ (సోషల్‌ వర్క్‌) 2010లో గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు.
అవార్డులు
1985లో అప్పటి భారత రాష్ట్రపతి జైల్‌సింగ్‌ చేతుల మీదుగా రాష్ట్రపతి స్కౌట్‌ అవార్డు అందుకున్నారు.
1988లో మదర్‌ థెరిసా చేతులమీదుగా బెస్ట్‌ స్కౌట్‌ అవార్డు అందుకున్నారు
1991వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో యువజన వ్యవహారాల శాఖ మరియు క్రీడలు రంగంలో యువజన పురస్కారం అందుకున్నారు.
1996లో ఇంటర్నేషనల్‌ యూత్‌ సెంటర్‌, న్యూ ఢిల్లీ వారిచే అక్షరాస్యత కొరకు చేసిన కృషికి చిహ్నంగా నిఖిల్‌ కోయితారా అవార్డును అందజేశారు.
భారత ప్రభుత్వంలోని యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి ద్వారా 1997 సంవత్సరంలో జాతీయ యువజన పురస్కారం అందుకున్నారు.
2006 ద్వారా అప్పటి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై ఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి గారిచే రెడ్‌ అండ్‌ వైట్‌ బ్రేవరీ అవార్డును అందుకున్నారు.
అభ్యుదయ సేవా సమితిలో పనిచేస్తున్నప్పుడు అత్యుత్తమ సామాజిక సేవకు గాను జిల్లా స్థాయి అవార్డులు (6) ఆరు అందుకున్నాను.
సందర్శించిన దేశాలు
1999 సంవత్సరంలో, ఇంటర్నేషనల్‌ యూత్‌ ఎక్స్ఛేంజ్‌ ప్రోగ్రామ్‌ కొరకు కొలంబో, శ్రీలంక (25 రోజులు) సందర్శించారు.
1999 సంవత్సరంలో, ఇంటర్నేషనల్‌ యూత్‌ ఎక్స్ఛేంజ్‌ ప్రోగ్రాం కొరకు కెనడాలోని వాంకోవర్‌ (4 నెలలు) సందర్శించారు.
మానవ సేవే మాధవ సేవ
‘ఆత్మే పరమాత్మ’ అని ఆధ్యాత్మికత మనకు బోధిస్తుంది. భక్తితో కొలిచే స్వామిని దర్శించగలగాలి. ప్రతి వ్యక్తిలో దైవత్వాన్ని చూడాలి. పేదలకు సేవ చేయడమే మాధవ సేవ. ఇతరులకు సహాయం చేసి తమను తాము మానవత్వంతో నిరూపించుకున్నవారే గొప్పవారు అవుతారు. సమాజ శ్రేయస్సు కోరని ఆధ్యాత్మిక సాధన ఫలించదు. ఆహ్లాదకరమైన సత్కార్యాలు చేసేవారిని ఇష్టపడతాడు. అందుకే ‘దయగల హృదయమే భగవంతుని నిలయం’ అన్నారు పెద్దలు.
సేవ అనేది సహజ లక్షణంగా ఉండాలి. భగవంతుని అనుగ్రహం కోసం పుణ్యక్షేత్రాలు, గోపురాలను దర్శించు కోవడం మంచిది. కానీ, నిరుపేదల పట్ల కరుణ చూపకపోతే దేవుడు కూడా సంతోషించడు అనే విషయాన్నీ ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిన అవసరముంది. నలుగురితో కలిసి చేసే మంచి పనిలో భాగస్వాములు కావడం గొప్ప లక్షణం. అంతేకాని ప్రచారం, ప్రశంసల కోసం చేసే కార్య క్రమాలను పుణ్యకార్యాలుగా చూడరు. ఏ చిన్న పనైనా నిస్వార్థంగా చేయడం చాలా ముఖ్యం. సమాజంలో సేవ చేసేవారిని ప్రోత్సహించడం అంటే మనం కూడా సేవ చేస్తున్నట్లే. 35 సంవత్సరాలుగా సేవలందిస్తున్న పరశురాములు ప్రతిఒక్కరికి ఆదర్శం కావాలని కోరుకున్నాను.
కోట దామోదర్‌

  • 9391480475
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News