Friday, September 20, 2024
HomeNewsKomaram Bheem: నిజాం సర్కార్‌ని ఎదిరించిన సింహస్వప్నం

Komaram Bheem: నిజాం సర్కార్‌ని ఎదిరించిన సింహస్వప్నం

నేడు కొమురం భీమ్‌ వర్ధంతి

అతను ఒక అగ్గి బారాటా. పోరాట యోధుడు. మీసం మెలితిప్పే వీరుడు. గెరిళ్ళ పోరాటంలో మడమ తిప్పని త్యాగధనుడు వీరి పేరు చెబితే నిజాం సర్కారుకు దడ పుట్టేదట. స్వయం పాలన కోసం శ్రమించిన తెలంగాన బిడ్డ కొమురం భీమ్‌. వీరు అక్టోబర్‌ 22, 1901న జన్మించాడు. హైదరాబాదు విముక్తి కోసం అసఫ్‌ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు. ఇతను ఆదిలాబాద్‌ అడవులలో, గోండు ఆదివాసుల కుటుంబంలో జన్మించారు. గిరిజన గోండు తెగకు చెందిన కొమరం చిన్నూ – సోంబారు దంపతులకు ఆదిలాబాద్‌ జిల్లా, ఆసిఫాబాద్‌ తాలూకాలోని సంకేపల్లి గ్రామంలో కొమరం భీమ్‌ 1901 సంవత్సరంలో జన్మించాడు. పదిహేనేళ్ల వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా, కొమరం కుటుంబం కరిమెర ప్రాంతంలోని సర్ధాపూర్‌కు వలస వెళ్లింది. కొమరం బీమ్‌ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా శైలిలో పోరాడాడు. ఇతను అడవిని జీవనోపాధిగా చేసుకొని, అన్ని రకాల నిజాం అధికారాలను తోసిపుచ్చాడు. అతను నిజాం నవాబ్‌ సైనికులకు వ్యతిరేకంగా ఆయుధాలు తీసుకున్నాడు. పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా ఉద్యమించి వీరమరణం పొందాడు. భారతదేశంలో ఆదివాసీల హక్కుల కోసం జరిగిన పోరాటాలు చరిత్రాత్మక మైనవి. ఆదివాసీలపై నిజాం నవాబు సాగించిన దోపిడీ, దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన కొమురం భీమ్‌ ‘జల్‌-జంగిల్‌-జమీన్‌’ నినాదానికి ప్రతీకగా నిలిచిపోయూడు. కొండ కోనల్లో, ప్రకృతితో సహజీవనం సాగించే ఆదివాసీ ప్రజలకు అడవిపై హక్కు సామాజిక న్యాయంలో భాగమని నినదిస్తూ, 1928 నుంచి 1940 వరకూ రణభేరి మోగించిన కొమరం భీమ్‌ నైజాం సర్కార్‌ గుండెల్లో సింహ స్వప్నంగా మారిన పోరాటయోధుడు. భీం కుటుంబం పది హేడేళ్ళ వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా కరిమెర ప్రాంతంలోని సర్దాపూర్‌ కు వలస వెళ్లింది. అక్కడ వాళ్ళు సాగుచేసుకుంటున్న భూమిని సిద్దిఖీ అన్న జమీందారు ఆక్రమించుకోవడంతో ఆవేశం పట్టలేని భీమ్‌ అతన్ని హతమార్చి అస్సాం వెళ్ళిపోయాడు. అక్కడ ఐదేళ్ళపాటు కాఫీ, తేయాకు తోటల్లో పనిచేస్తూ గడిపిన భీమ్‌ తిరిగి కరిమెర చేరుకున్నాడు. నిజాం నవాబు పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా గిరిజనులను ఒక్కతాటిపై నడిపించి ఉద్యమించాడు. ఆసిఫాబాద్‌ పరిసర ప్రాంతాలు, జోడేఘాట్‌ గుట్టలు కేంద్రంగా నిజాం నవాబుపై గెరిల్లా పోరాటాన్ని కొనసాగించాడు. భీమ్‌కు కుడిభజంగా కొమురం సూరు కూడా ఉద్యమంలో పాల్గొన్నాడు. వెడ్మ రాము కూడా భీమ్‌కు సహచరుడిగా ఉన్నాడు. కుర్దు పటేల్‌ అనే నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారంతో నిజాం సైన్యం 1940 అక్టోబర్‌ 27 న జోడేఘాట్‌ అడవుల్లోని కొమురం భీమ్‌ స్థావరాన్ని ముట్ట డించి భీమ్‌ ని హతమార్చాయి. నిజాం సైన్యం మీద, అటవీ సిబ్బంది పైనా కొమరం కొదమసింహంలా గర్జించాడు. కుర్దు పటేల్‌ అనే నమ్మక ద్రోహి ఇచ్చిన సమాచారంతో, అర్ధరాత్రి కొమరం స్థావరాలను సైన్యం చుట్టుముట్టగా జోడేఘాట్‌ అడవుల్లో 1940, అక్టోబర్‌ 27న, అంటే ఆది వాసీలు పవిత్రంగా భావించే ఆశ్వీయుజ శుద్ధ పౌర్ణమి రోజున కొమరం భీమ్‌ వీరమరణం పొందాడు. అప్పటి నుంచీ ఆ తిథి రోజునే కొమరం భీమ్‌ వర్ధంతి జరుపుకోవడం ఆదివాసీల ఆనవాయితీ.
ఆదివాసీ ఆత్మగౌరవ ప్రతీక కొమురం భీమ్‌. స్వయంపాలన, అస్తిత్వ ఉద్యమాల వేగుచుక్క భీం పోరాట పంథానే చివరకు సరైన మార్గమని, తన జాతి ప్రజలను విముక్తి చేస్తుందని అక్షరాల నమ్మిన ఆదివాసీ పోరాట యోధుడు.ఆదిలాబాద్‌ అడవుల్లో భీం పోరాటం జరిగి నేటికి డబ్భై రెండు ఏళ్లు పూర్తి కావస్తున్నది. ఇప్పుడు ఒక ప్రత్యేక సందర్భంలో భీం వర్ధంతిని ఆదివాసీ సమాజాలు జరుపుకుంటున్నాయి. స్వయంపాలన కోసం తెలంగాణ ప్రజలు అలుపు ఎరగకుండా ఉద్యమిస్తున్న సందర్భం నేడున్నది. స్వయంపాలన కోసం ఉద్యమిస్తున్న ఆదివాసీ సమాజాలను క్రూరంగా అణచివేస్తున్న ప్రభుత్వాలు కండ్ల ముందు కనబడుతున్నాయి. దేశంలో తమ హక్కుల సాధన కోసం ఆదివాసీ సమాజాలు ఉద్యమించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. బ్రిటిష్‌ చట్టాలకు వ్యతిరేకంగా బిర్సా ముండా, సంతాల్‌లు, తిరుగుబాటు చేశారు. జల్‌, జంగల్‌, జమీన్‌ కోసం సాయుధ పోరాటాలు చేశారు. తమపై సాగుతున్న అన్నిరకాల దోపిడీ, పీడనలను ఎదిరించారు. చరివూతలో అనేకసార్లు ఓటమి చెందినా తమ జీవితమే యుద్ధమైన చోట తమ అస్తిత్వం కోసం అలుపెరుగని పోరాటాలు నేటికీ చేస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని గోండులు ఎప్పటికీ ఒక రాజ్య భావనలో ఇమిడిలేరు. వారు స్వేచ్ఛా ప్రియులు. వారి జీవనాధారమైన అడివి నుంచి వారిని తరిమేసే విధానాలు, చట్టాలతో వారు తలపడ్డారు. ఆదివాసీ ఆవాసాల్లోకి గిరిజనేతర భూస్వాముల వలస నిరాటంకంగా సాగింది. పోడు వ్యవసాయం గోండుల జీవనాధారం. అడవిని నరికి పంటవేస్తే అది జంగ్లాత్‌ భూమి అని ఒకరు, కాదు రెవెన్యూ భూమి అని మరొకరు వచ్చి గోండులను వారి భూముల నుంచి తరిమేశారు. పంటలను ధ్వంసం చేశారు. జరిమానాలతో వేధించారు. ఈ వేధింపులు, అణచివేతల నేపథ్యంలోంచే..ఆదిలాబాద్‌ గోండన్నలు పోరుబాట పట్టారు. తమ విముక్తి కోసం పోరాట జెండాపట్టారు. ‘మాఊర్లో మా రాజ్యం’అంటూ పన్నెండు గూడాలు బాబేఝరి లోద్దుల్లో తుడుం మోగించాయి. కొమురం భీం నాయకత్వంలో ఆదివాసులు సంఘటితమై తమపై జులుం చేస్తున్న దోపిడీవర్గాలపై తుడుం మోగించారు. కొమురంభీం పోరాటం పలు ప్రాంతాలకు విస్తరించే లోపే నిజాం సేనలతో యుద్ధం జరిగింది. భీంతో సహా పన్నెండు మంది ఆదివాసీ వీరులు అమరులయ్యారు. నిజాం సర్కారు పాశవికంగా కొమరంభీం పోరాటాన్ని అణచివేసింది. భీం అమరత్వం జోడేఘాట్‌ లోద్దుల్లో నేటికీ ప్రతిధ్వనిస్తున్నది. ఏ హక్కుల కోసమైతే.. నాడు భీం ఉద్యమించాడో ఆ హక్కుల కోసం ఆదివాసులు నేటికీ నిరంతరం పోరాటం చేయవలసే వస్తున్నది. ప్రజాస్వామిక రాజ్యమని చెప్పుకుంటున్న నేడు కూడా.. ఆదివాసుల అవస్థలు ఏమీ తీరలేదు. నిజాం రాజు నియమించిన హైమన్‌ డార్ఫ్‌ సూచనలను కూడా నేటి పాలకులు పాటించడం లేదు. కానీ నాటి నిజాం ప్రభువయినా.. గిరిజనుల అభ్యున్నతి కోసం హైమన్‌డార్ఫ్‌ సూచనలను పాటించాడు. వారి అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాడు. కానీ..నేటి పాలకులు ఇవేవీ పట్టకుండా ఆదివాసులపై సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తున్నారు. హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఆదివాసులపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. కొమురం భీం స్ఫూర్తితో విప్లవ సంఘాల నాయకత్వంలో మరొకసారి ఆదివాసులు సంఘటిత పోరాటాలు చేశారు. దీంతో.. ఆదివాసుల ఐక్యతను చూసి తట్టుకోలేని ప్రభుత్వం ఇంద్ర మారణకాండను సృష్టించింది. ఇది ఆధునిక కాలంలోని మరో జలియన్‌వాలాబాగ్‌గా ప్రజాస్వామికవాదులు పిలుస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఆదివాసుల పోరాటానికి సంఘీ భావం వచ్చింది. ప్రభుత్వ దమననీతిని ఖండిం చారు. రాజ్యం తన హేయమైన చర్యలు చేస్తూనే.. మరో వైపు సంస్కరణలు చేపట్టింది. ఆదివాసుల మౌలిక సమస్యలు పరిష్కరించకుండా..పైపూత మాటలతో జోకొట్టే ప్రయత్నం చేసింది. ఆదివాసీ ప్రాంతాలకు ప్రత్యేక రక్షణ ఇచ్చే రాజ్యాంగంలోని అయిదవ షెడ్యూలును తుంగలో తొక్కి ఆదివాసులపై అన్నివైపుల నుంచి దాడులు జరుగుతున్నాయి. ప్రాజెక్టులు, గనుల తవ్వకాల పేరుతో నిర్వాసితులను చేస్తున్నది. ఆదివాసీ భూరక్షణ చట్టం 1/70 చట్టాన్ని అమలు పర్చడంలేదు. అన్యాక్షికాంతమవుతున్న అడవులను, భూములను పట్టించుకోదు. గోండు తెగకు సంబంధించిన ప్రధాన్‌, తోటి, మన్నె, కోయ తెగలే కాకుండా నాయక్ డ ఆంధ్‌ ఇతర ఆదివాసీ తెగలు ఆదిలాబాద్‌, ములుగు, భద్రాద్రి, నాగర్‌ కర్నూల్‌ జిల్లాలలో నివసిస్తున్నాయి. ఇప్పుడు వీరి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. 1975కు పూర్వం వలస బంజారాల జనాభా కేవలం పది వేలనని హైమన్‌డార్ఫ్‌ స్పష్టం చేశారు. ఇప్పుడు వీరి జనాభా పదింతలపైన ఉంది. వలస వచ్చిన వాళ్ళు ప్రజాపతి నిధులవడంతో వీరికష్టాలు రెట్టింపయ్యాయి. ఆదిమ సమాజం వీరి వల్ల రక్షణలను కోల్పోతున్నది. ఇలాంటి పరిస్థితిలో ఆదివాసీల మనుగడ కష్టమేనని ఆదివాసీ నాయకులు కలవరపడుతున్నారు. ఆదివాసీల రక్షణ ప్రభుత్వానిదే అయిన ప్పుడు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న ప్రభుత్వాల వైఖరిలో మార్పు రావడంలేదు. ఏటా విషజ్వరాలతో ప్రాణాలు కోల్పోతున్నా, ఆదివాసులకు కనీస వైద్య సౌకర్యాలు అందడం లేదు. ప్రతిఏటా అయిదు వందల నుంచి వేయి వరకు మలేరియా, విష జ్వరములు, డెంగు, మర ణాలు సంభవిస్తున్నాయి. పోషకాహారలేమితో మరణిస్తున్న పిల్లల సంగతి లెక్కేలేదు. భీం పోరాటం చేసిన ప్రాంతంలో (జోడే ఘాట్‌) నేటికి తాగడానికి నీళ్ళులేవు. సరైన సదుపాయాలు లేకపోవడంతో ఆదివాసీ సమాజాల జీవన ప్రమాణాలు క్షీణిస్తున్నాయి. భీం పోరాటం జరిగి 80 ఏళ్లు అవుతున్నా, ఆ పోరాట స్ఫూర్తినేటికీ ఉంది. అస్తిత్వ ఉద్యమాలు కొన సాగుతున్న నేటి తరుణంలో, 1940 లోనే ఆత్మగౌరవం, స్వపరిపాలన పునాదులుగా కొమురం భీం సాయుధ తిరుగుబాటు చేశాడు. అతని ముందు చూపు వివిధ ఉద్యమాలకు ప్రేరణగా నిలుస్తున్నది. బాబేఝురి లోద్దుల్లో పన్నెండు గూడేలపై రాజ్యాధికారం కోసం తుడుం మోగించిన కొమురం భీం వారసత్వం నేటికీ దండకారణ్యంలో కొనసాగుతున్నది. నిజాం పాలకుల నిరంకుశత్వానికి.. అధికారుల దమన నీతికి ఎదురు నిలిచి పోరాడిన కొమురం భీం ఆశించిన లక్ష్యాలను నేటి పాలకులు నెరవేర్చలేక పోతున్నారు. భీం మరణించి 80 ఏళ్లు గడుస్తున్నా జల్‌, జంగిల్‌, జమీన్‌పై ఆదివాసీలు నేటికీ హక్కులు పొందలేకపోతున్నారు. నాటి నుంచి నేటి వరకు గిరిజనులు హక్కుల కోసం పోరాటాలు సాగిస్తూనే ఉన్నారు. భీం పుట్టింది ఆదిలాబాద్‌ జిల్లా కెరమెరి మండలం సంకెపల్లి.. పెరిగింది సుర్తాపూర్‌. కష్టపడి అడవి నరికి పోడు వ్యవ సాయం చేసేవాళ్లు. రాత్రింబవళ్లు కావలి కాశీ పంటలు పండించేవాళ్లు. గిరిజనులపై నిజాం సర్కారు పెత్తనం చాలా ఎక్కువగా ఉండేది. అప్పుడు పంటను కొట్టిన కల్లంలోనే.. కైలు కింద గింజలు ప్రభుత్వానికి అప్పజెప్పేవారు. గిరిజనులు పోడు చేసుకునే భూములకు పట్టాదారులుగా ఇతరులు ఉండేవారు. గిరిజనులు ఎంతటి దట్టమైన అడవిలో భూములను సాగుచేకున్నప్పటికీ వాటిపై తమకే పట్టాలు ఉన్నాయని సర్కారోళ్లు.. జంగ్లాత్‌ వాళ్లు గొడవలు చేసేవాళ్లు. తిరిగబడ్డ గిరిజనులపై కేసులు పెట్టేవాళ్లు. ఇలాంటి సంఘటనలే కొమురం భీంను కదిలించాయి. ఇలా పంట వసూలు కోసం తమ చేనులోకి వచ్చి కూర్చున్న సిద్ధికి అనే వ్యక్తిని కర్రతో తల పగలకొట్టాడు భీం. ఈ దెబ్బతో సిద్ధికి అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో భయపడ్డ భీం మహారాష్ట్రలోని బల్లార్షా కి పోయాడు. అక్కడ తేయాకు తోటల్లో కూలీపని చేసుకుంటూ చదవడం, రాయడం నేర్చుకున్నాడు. మరాఠీ, ఉర్దూ భాషలు నేర్చుకున్నాడు. కొత్త కొత్త పంటలు పండించటం, వాటిని మార్కె ట్‌లో మంచి ధరకు అమ్మటం తెలుసుకున్నాడు. తరువాత భీం తల్లిదంవూడులు ఉంటున్న కాకన్‌ఘాట్‌కు వచ్చాడు. ఆ గ్రామంలోని గిరిజనుడులచ్చుప వద్ద జీతం ఉండగా భీంకు సోంబాయితో పెళ్ళి జరిగింది. ఆ కాలంలో అరకకు ఐదు రూపాయలు, పోడుకు రెండు రూపాయల చొప్పున పన్నును ఆసిఫాబాద్‌ తహసిల్దార్‌కు కట్టేవారు. కొమురం భీం అప్పటి తహసిల్దార్‌తో మాట్లాడి లచ్చుప చెందిన పన్నెండు ఎకరాల భూమి కేసును కొట్టేయించాడు. అప్పటి నుంచి ఆ ప్రాంత గిరిజనులందరికీ భీం నాయకుడయ్యాడు. 70 ఎకరాల అడవిని నరికి 17 గ్రామాలను. వీరు 1940 అక్టోబర్‌ 27 న మరణించారు. వీరిని, వీరి గొప్పతనం ప్రతి ఒక్క రిలో స్పూర్తి నింపాలి. వీరి వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. వారిని నిత్యం స్మరించికునేలా కొమురం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా పేరు పెట్టడం వారి కృషికి నిదర్శనం. ఆదివాసిల సంక్షేమంకి ప్రభుత్వము పెద్ద పీట వేయాలి. వారికి మంచి విద్య, వైద్యం అందుబాటులో వుంచాలి. ప్రతి జిల్లాలో కొమురం భీమ్‌ కాంస్య విగ్రహంని ఏర్పాటు చేయాలి.

- Advertisement -

కామిడి సతీష్‌ రెడ్డి

9848445134
(నేడు కొమురం భీమ్‌ వర్ధంతి)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News