Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Human relations are dying: మృగ్యమవుతున్న విలువలు, నైతికత, బంధాలు

Human relations are dying: మృగ్యమవుతున్న విలువలు, నైతికత, బంధాలు

అన్నీ ఇచ్చేవాళ్ళు దేవుళ్ళు కాదు, అమ్మానాన్నలే

మనుషుల మధ్య బంధం లేకపోతే ఈ సమాజమే లేదు. అలాగే అణువుల మధ్య బంధం లేకపోతే వస్తువుకు రూపం లేదు. మానవ సంబంధాల్లో ముఖ్యమైనవి సామాజిక, మానసిక బంధాలు. అవి పరస్పర సహకారం, మానవత్వంతో నిండుకున్నప్పుడు సర్వ జనులకు సౌభాగ్యం. అదే లోక (విశ్వ) కళ్యాణంగా మారుతుంది. వ్యక్తుల మధ్య సంబంధాలు ఎంత బలంగా ఉంటే సమాజం అంత దృఢంగా ఉంటుంది. సమాజ సంక్షేమానికి, అభివృద్ధికి, మానవీయతకు సత్సంబంధాలు పునాదులు అవుతాయి. అవి కొరవడినప్పుడే బంధాలు బలహీనపడతాయి. దానితో స్వార్థం పెచ్చరిల్లి అమానుష, అమానవీయ ఘటనలతో సమాజంలో సామాజిక స్పృహ కొరవడుతుంది. ఇది వ్యక్తుల మధ్య, కుటుంబాల మధ్య, రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య కావచ్చు.. కలిస్తేనే ప్రగతి పరిణతి, లేదంటే? అగాధాలు పెరిగిపోయి విడిపోయి పడిపోతాయి. మనిషి పేగు బంధాలతో పుట్టి, ఆ తర్వాత వివాహ బంధం, మైత్రి తదితర (వివిధ) సంబంధాలతో జీవితం కొనసాగుతుంది. ఈ బంధాలు కలుస్తుంటాయి విడిపోతుంటాయి. ఇంకొన్ని రుణానుబంధాలు రుణం తీరగానే ముగిసిపోతాయి.. మళ్లీ కొత్తవి సంతరించుకుంటాయి. ఇదే జీవిత సత్యం. ఏ బంధమైనా “మనం-మనది” అనే భావన ఉన్నంతవరకు సాఫీగా జీవితం సాగుతుంది. అలా కాకుండా “నేను-నాది” అనే అహంభావం పెరిగితే బంధాలు విచ్ఛిన్నం అవుతున్నాయి.. ఇది నేటి సమాజానికి, భావితరాలకు క్షేమం కాదు. నేటి ఉరుకులు పరుగుల జీవితంలో సంపాదనపై ఉన్న మక్కువ దానిని సంపాదించిన వృద్ధులపై లేకపోవడం కడు శోచనీయం. యుక్త వయసులో శక్తి యుక్తులను, సుఖసంతోషాల్ని త్యాగం చేసి, జీవితమంతా బంధాల కోసం ధారపోసి అలసి వయసు పెరిగిపోవడంతో అనారోగ్య సమస్యలు.. ఆస్తులు కూడగట్టినా ఆలనా పాలనా చూసుకునేవారు లేని ఒంటరి జీవితం. ఇవే నేరగాళ్లకు అవకాశంగా మారుతున్నాయి. ఒంటరిగా ఉండే వృద్ధులపై దాడులు, వేధింపులు ఓ వైపు, మరో వైపు ఆర్థిక నేరాలు పెరుగుతున్నాయి. అనారోగ్యం, ఇతర రుగ్మతలతో బాధపడడం చూసి దగ్గరవుతున్న మోసగాళ్లు.. రూ. కోట్ల విలువైన ఆస్తులు, స్థలాలు కొట్టేస్తున్నారు. సంతకాలు ఫోర్జరీ చేసి ఆస్తి మార్పిడి చేయించుకుంటున్నారు. కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఈ తరహా నేరాలు వరుసగా పెరుగుతున్నాయి. నిందితుల్లో ఎక్కువమంది సొంత కుటుంబ సభ్యులు, సమీప బంధువులు సన్నిహితులుగా మెలిగేవారే ఉండటం గమనార్హం.

- Advertisement -

ఆస్తికోసం తల్లిదండ్రులనే స్పృహ లేకుండా కన్న వాల్లే వేధింపులు, దాష్టీకాలు, హత్యలకు దిగుతున్న సందర్భాలు కొన్నైతే, ఏం చేసినా ఎదురు తిరగలేరన్న ధీమాతో ఆస్తులు కాజేయాలని కొందరు ప్రబుద్ధులు ఈ తరహా మోసాలకు తెగిస్తున్నారు. ఇంకొందరు దర్జాగా స్థలాలు, ఇళ్లు ఆక్రమిస్తున్నారని పోలీసుల పర్యవేక్షణలో తేలింది. సగానికి పైగా ఇవే నేరాలు జాతీయ నేర గణాంకాల సంస్థ 2022 ప్రకారం గత ఏడాది తెలంగాణలో 60 ఏళ్లు దాటిన వృద్ధులు బాధితులుగా 2,181 నేరాలు నమోదయ్యాయి. ఈ మొత్తంలో 1,001 కేసులు ఫోర్జరీ, నమ్మకద్రోహం, మోసం బలవంతంగా ఆస్తులు స్వాధీనం చేసుకోవడం వంటి ఘటనలే ఉన్నాయి. అంటే దాదాపు 45.8% ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన నేరాలే అని తెలుస్తుంది. బలవంతంగా ఆస్తుల స్వాధీనం, ఫోర్జరీ మోసాల్లో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో నిలుస్తుంది. 941 నేరాలతో మహారాష్ట్ర రెండవ స్థానంలో ఉంది. మరే ఇతర రాష్ట్రాల్లో ఈ స్థాయిలో నమోదు కావడం లేదు. మొత్తంగా 60 ఏళ్లు దాటిన వృద్ధులపై జరిగే నేరాల్లో దేశంలోనే తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్ 6,187, మహారాష్ట్ర 5059, తమిళనాడు 2376 వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి .గత మూడేళ్లలో (2020, 2021, 2022) గణాంకాలను పరిశీలించగా రాష్ట్రంలో ఏటా 10-20% చొప్పున నేరాలు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఫిర్యాదు చేసేందుకు వెనకంజవృద్ధులపై జరిగే నేరాల్లో మెజారిటీ కేసుల్లో బాధితులు ఫిర్యాదు చేసేందుకు వెనకాడుతున్నారని పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం నమోదయ్యే నేరాలు సగానికంటే తక్కువేనని.. బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే, ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంటున్నారు. సొంత పిల్లలు ఆస్తికోసం వేధించినప్పుడు వృద్ధులు ఫిర్యాదు చేయలేరు, ఠానా మెట్లెక్కితే కక్ష కడతారని భావిస్తారు. ఒకవేళ ఫిర్యాదు చేసిన కేసు విచారణ సమయంలో సొంత పిల్లలపై ప్రేమ, మమకారంతో పోలీసులకు సహకరించేందుకు వెనుకాడుతారు. ఇదే అవకాశంగా నిందితులు తప్పించుకుంటున్నారు. అందుకే గత ఏడాది వృద్ధులపై జరిగిన 389 నేరాలలో ఒక్క ఆధారం లభించలేదు. 253 కేసులు తప్పని తేలడం, సరైన సాక్ష్యాలు లేక వీగిపోయాయి.. అని ఒక ఉన్నత పోలీసు అధికారి తెలిపారు.

ఈ సమాజంలో మనిషిగా పుట్టడం గొప్పతనం కాదు? తన నడవడికలోనే గొప్పతనం ఆధారపడి ఉంటుంది. అన్నీ ఇచ్చేవాళ్ళు దేవుళ్ళు కాదు? అమ్మానాన్నలే అన్న యదార్థాన్ని మరువకండి. మనిషి ఏమైపోతున్నాడు!. సమాజంలో విలువలు, నైతిక ప్రవర్తన మృగ్యమవుతుంది. ఆధునిక టెక్నాలజీ మనుషుల్లో బంధాలను, మానవత్వాన్ని పెంపొందించ లేవు. మహనీయులుగా కాకపోయినా.. కనీసం మనుషులుగా బతకండి. వృద్ధులు అనుభవాల ఆస్తి. జీవిత సారంలో పరిపూర్ణంగా పండిన పళ్ళు, ఆ పండుటాకులపై నిర్లక్ష్యం వీడండి. ఏదోరోజు మనమందరం ఆ దశ దాటాల్సిందే. వృద్ధులంటే పిల్లలు కనే యంత్రాలు కాదు. ఇన్నాళ్లు మన అవసరం తీర్చే ఏటీఎం సెంటర్లు అంతకన్నా కాదని భావించండి. ఏదో ఒక రోజు మనం అనారోగ్యం పాలౌతాం. వృద్ధాప్యం వస్తుంది, దాన్ని ఎవరు తప్పించుకోలేరు. ఏదో ఒక రోజు ప్రతి వ్యక్తికి మరణం వస్తుంది. అది కాదనలేని వాస్తవం. దాని నుండి బయటపడలేం. మనిషి తన అహాన్ని, సంపదపై దురాశను వీడి మానవత్వంతో వృద్ధులను చేరదీస్తూ, వారిని కాపాడవలసిన బాధ్యత కుటుంబాలపై, బందువు(బంధా)లపై ఉంది. మానవీయ కోణంలో పాలకులు వృద్ధులపై ఎలాంటి వేధింపులు లేకుండా సమాజంలో గౌరవంగా బ్రతికేలా చూడాల్సిన బాధ్యత ఉంది. వారు గౌరవంగా బతికే హక్కులను బంధువులు, పరాయి వారు ఎవరు హరించినా.. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా శిక్షించాలి. అవసాన దశలో వృద్ధులను చేరదీసుకోవాల్సిన స్పృహతో మెదలండి. భావితరాలకు మార్గదర్శకులుగా నిలవండి..
మేకిరి దామోదర్, సామాజిక విశ్లేషకులు, వరంగల్, ఫోన్:9573666650.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News