Thursday, September 19, 2024
Homeఓపన్ పేజ్Saraswati Rajamani: దేశ స్వాతంత్రం కోసం పదహారేళ్ళ వయసులో గూఢచారిగా మారిన వనిత

Saraswati Rajamani: దేశ స్వాతంత్రం కోసం పదహారేళ్ళ వయసులో గూఢచారిగా మారిన వనిత

ఈమె గురించిన పూర్తి సమాచారం అందుబాటులో లేకపోవడం విచిత్రం

వర్ణ, వర్గ, లింగ విభేదాలు లేకుండా ఎంతో మంది త్యాగధనులు అచంచల దేశ భక్తి అనే పునాదులపై నిస్వార్థం అనే ఇటుకలతో నిర్మించిన ఈ సువిశాల భారత దేశంలో స్వేచ్ఛా స్వాతంత్రాలను అనుభవిస్తున్న మనం నిజంగా అదృష్టవంతులమని చెప్పవచ్చు. బ్రిటిష్ వలసవాద పాలన నుండి భరత మాత బానిస సంకెళ్ళను త్రుంచడానికి శక్తివంచన లేకుండా పురుషులతో సమానంగా ఎందరో ధీర వనితలు కూడా స్వాతంత్ర్య సమరంలో పాల్గొని తమ వంతు పాత్రను నిర్వహించినప్పటికీ వారి చరిత్ర అంతగా వెలుగులోకి రాకపోవడం దురదృష్టం. “మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను” అన్న నేతాజీ సుభాష్ చంద్ర బోస్ మాటలతో ప్రేరణ పొందిన సరస్వతి రాజమణి, కేవలం పదహారేళ్ళ లేత ప్రాయంలో తన ఆభరణాలను తృణప్రాయంగా నేతాజీకి అందించగా వాటిని తిరిగి ఇచ్చేయడానికి ఆయన స్వయంగా వారింటికి వెళ్ళినప్పటికీ ఆమె అందుకు నిర్ద్వందంగా తిరస్కరించారు. ఆమె దేశ భక్తికి మెచ్చిన నేతాజీ అప్పుడు “ఈ లక్ష్మి (ఆభరణాలు) నీతో ఎల్లకాలం ఉండకపోవచ్చు కానీ నీలోని సరస్వతి (జ్ఞాన సంపద) ఎల్లప్పటికీ శాశ్వతంగా ఉంటుంది అందుకే ఇప్పటి నుండి నీ పేరు సరస్వతి” అని అనడంతో అప్పటినుండి ఆమె పేరు “సరస్వతి రాజమణి”గా స్థిరపడిపోయింది.

- Advertisement -

వారసత్వంగా అబ్బిన జాతీయ భావాలు:

బర్మా (నేటి మయన్మార్) కు వలస వెళ్ళిన ఒక సంపన్న తమిళ కుటుంబంలో 11 జనవరి 1927 న రాజమణి రంగూన్ లో జన్మించారు. తన తండ్రి మెండుగా జాతీయ భావాలు గల వ్యక్తి కావడంతో ఆమె ఆ వారసత్వాన్ని సహజంగానే పుణికిపుచ్చుకున్నారు. స్వదేశాన్ని అమితంగా ప్రేమించే ఆమె త్రండ్రి భారత స్వాతంత్ర్యానికి సంబంధించి స్థానికంగా ఏ ఉద్యమం జరిగినా తన కుమార్తెతో సహా అందులో పాల్గొనే వారు. బ్రిటిష్ పాలనలో ఉన్న నాటి బర్మా ప్రజలలో జాతీయ భావాలు పాదుకొల్పేందుకు 1937లో మహాత్మా గాంధీ ఆ దేశాన్ని సందర్శించిన సందర్భంగా అక్కడ స్థిరనివాస మేర్పరచుకున్న కొందరు తమిళులతో పాటు రాజమణి కుటుంబాన్ని కూడా సందర్శించారు. ఆ సమయంలో అతని దృష్టి బొమ్మ తుపాకీతో ఆడుకుంటున్న 10 సంవత్సరాల రాజమణిపై పడడంతో యాదృచ్ఛికంగా “తుపాకీతో ఆడుకుంటున్నావు పెద్దయ్యాక షూటర్ కావాలనుకుంటున్నావా” అని అడగ్గా “లేదు, బ్రిటిష్ వారిని చంపేందుకు” అని ఆమె ఛటుక్కున సమాధానమిచ్చింది. అందుకు గాంధీ “స్వాతంత్ర్య సాధన కోసం మనం ఎంచుకున్న అహింసాయుత మార్గం మాత్రమే అనుసరణీయం” అనగా ఆమె విభేదిస్తూ “బ్రిటిష్ వాళ్ళు మన దేశ సంపదను దోచుకుంటున్నారు. దోపిడీ చేసే వారిని వదిలిపెట్టవద్దు, మట్టుబెట్టాలి. నేను పెద్దయ్యాక కనీసం ఒక్క బ్రిటిష్ అధికారినైనా కాల్చి చంపుతాను” అంది. అలా బాల్యంలోనే గాంధీజీ నేతృత్వంలోని జాతీయోద్యమం పట్ల ఆకర్షితురాలైనప్పటికీ సైద్ధాంతిక పరంగా విభేదించి, 1943 లో బర్మాను సందర్శించడానికి వచ్చిన నేతాజీ అప్పటికే “ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA)” స్థాపించి సాయుధ బాట పట్టడంతో సహజంగానే ఆయన అనుయాయిగా మారాలని నిశ్చయించుకుంది. “మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను” అన్న నేతాజీ మాటలతో స్ఫూర్తి పొందిన 16 ఏళ్ళ సరస్వతి రాజమణి వెంటనే తన ఒంటి మీదున్న ఖరీదైన ఆభరణాలను సంస్థకు అందించారు.

ఐ ఎన్ ఏ పిన్న వయసు మహిళా గూఢచారి:

వాణిజ్యం సాకుతో దేశంలో చొరబడి క్రమంగా రాజ్యాధికారాన్ని చేపట్టి దేశ సంపదను కొల్లగొడుతూ ప్రజల బ్రతుకులను దుర్భరం చేస్తూ హింసిస్తున్న బ్రిటిష్ వలస పాలకుల నుండి దేశానికి స్వాతంత్ర్యం సిద్ధింప చేయాలన్న ఏకైక లక్ష్యంతో తనదైన శైలిలో పోరాటం కొనసాగిస్తున్న నేతాజీ, సరస్వతి యొక్క అంకితభావానికి ముగ్ధుడై, ఆమెను ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐ ఎన్ ఏ) గూఢచర్య విభాగంలో రాణి ఝాన్సీ బ్రిగేడ్లో నియమించారు. ఐ ఎన్ ఏ లో చేరిన అతి పిన్న వయస్కురాలు మరియు మొదటి మహిళా గూఢచారి సరస్వతి రాజమణి కావడం విశేషం. ప్రభుత్వం నుండి బ్రిటిష్ మిలటరీ అధికారులకు అందే ఆదేశాలను ఎప్పటికప్పుడు విశ్లేషించి ఐ ఎన్ ఏ కు అందచేసే బాధ్యత ఆమెకు అప్పచెప్పబడింది. ఆమె ‘మణి’ అనే యువకుడి వేషధారణలో బ్రిటిష్ అధికారుల నివాసాలలో పనిమనిషి మిషతో గూఢచర్యం నిర్వహించేది. కర్తవ్య నిర్వహణలో తన సహచర గూఢచారి ఒకరు బ్రిటిష్ అధికారులకు చిక్కడంతో, ఆమెను వారి బందీ నుండి విడుదల చేయించడం కోసం రాజమణి బ్రిటిష్ శిబిరంలోకి ప్రవేశించడానికి ఒక నృత్య కళాకారిణిగా దుస్తులు ధరించి, బ్రిటిష్ అధికారిని ఏమార్చి, మత్తుమందు ఇచ్చి, తన సహచర గూఢచారిని రక్షించింది. అయితే అక్కడి నుండి తప్పించుకునే ప్రయత్నంలో బ్రిటిష్ అధికారులు జరిపిన కాల్పులలో ఆమె కాలికి తీవ్ర గాయమైంది. అయినప్పటికీ ఆమె ఆ గాయాన్ని ఏమాత్రం లక్ష్యపెట్టకుండా వేగంగా పరిగెత్తి వారి నుండి తప్పించుకుని ఒక చెట్టుపైకి ఎక్కి మూడు రోజుల పాటు అక్కడే గడిపింది. ఆమె ఆచూకీని కనిపెట్టి బంధించడానికి బ్రిటిష్ అధికారులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ గాయం ఆమెకు శాశ్వత అవిటితనం కలిగించినప్పటికీ ఆమెలోని దేశభక్తి ఇసుమంతయిన తగ్గకపోవడం విశేషం. ఆమె అసమాన ధైర్య సాహసాలకు గుర్తింపుగా జపాన్ చక్రవర్తి ఆమెకు ఇండియన్ నేషనల్ ఆర్మీ యొక్క రాణి ఝాన్సీ బ్రిగేడ్‌లో “లెఫ్టినెంట్ హోదా” తో పాటు పతకాన్ని అందించారు. ఆమె తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి సహచర గూఢచారిని చాకచక్యంగా బ్రిటిష్ అధికారుల కళ్లుగప్పి తప్పించడంలో ప్రదర్శించిన ధైర్యసాహసాలను స్వయంగా నేతాజీ కూడా ప్రశంసించారు.

స్వదేశాగమనం:
రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా జపాన్ ఓటమి చవిచూడడంతో నేతాజీ ఐ ఎన్ ఏ ను రద్దు చేశారు. అనంతరం నేతాజీ సూచనలను అనుసరించి సరస్వతి రాజమణితో సహా ఇతర ఐ ఎన్ ఏ సభ్యులు స్వదేశానికి తిరిగి వచ్చారు. అప్పటికి రెండవ ప్రపంచ యుద్ధం ముగియడం మరియు అనూహ్యమైన పరిస్థితులలో నేతాజీ అదృశ్యం కావడంతో రాజమణి కుటుంబం భారత స్వాతంత్ర్య పోరాటం కోసం తమ వద్ద ఉన్నదంతా సమర్పించి ఎటువంటి పొదుపు లేకుండా చెన్నై కు తరలి వచ్చారు. 2000 సంవత్సరం ప్రారంభం వరకు కూడా రాజమణి చెన్నైలో కేవలం కొన్ని నేతాజీ ఛాయాచిత్రాలతో అలంకరించబడిన శిథిలమైన ఒక పడక గది గల ఫ్లాట్ లో అతి నిరాడంబర జీవితం గడిపారు. కాగా ఆ తరువాత అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆమెకు చెన్నైలో ఒక సాధారణమైన ఇంటిని కేటాయించారు.

2005లో జరిపిన ఒక ఇంటర్వ్యూలో సరస్వతి రాజమణి నేతాజీ గురించి వివరిస్తూ “ఆయన అరుదైన వ్యక్తిత్వం మరియు గొప్ప దార్శనికత గల వ్యక్తి. భవిష్యత్తును అంచనా వేయడంలో ఆయనకు ఆయనే సాటి అని కితాబిచ్చారు. ఊహించని సమయాలలో వివిధ వేషాలలో వచ్చి ఆయన మమ్మల్ని ఆశ్చర్యచకితుల్ని చేసేవారు. “స్వామి వివేకానంద ప్రవచించే ఆదర్శాలను ప్రబలంగా విశ్వసించే నేతాజీ మనందరికీ దేవుడు లాంటివాడు” అని చెప్పడం ఆమెకు ఆయన పట్ల గల ఆదరాభిమానాలను సూచిస్తుంది.

వృద్ధాప్యంలో సైతం వీడని సేవాతత్పరత:
వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ, దేశంపై ఆమెకున్న విశ్వాసం వమ్ము కాలేదు. తన ఇంటి సమీపంలో ఉండే టైలర్ల వద్ద నుండి కత్తిరించగా మిగిలిన గుడ్డ ముక్కలను సేకరించి వాటిని చేతితో కుట్టి, దుస్తులుగా మార్చి వృద్ధాశ్రమాలు మరియు అనాథాశ్రమాలకు విరాళంగా అందించేది. అంతే కాకుండా, 2006లో సునామీ వల్ల నష్టపోయిన బాధితుల కోసం ఏర్పాటు చేసిన సహాయ నిధికి తనకు అందే కొద్ది పాటి పెన్షన్ కూడా విరాళంగా ఇవ్వడం ఆమె లోని దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుంది.

అయితే దేశ స్వాతంత్రం కోసం సర్వస్వం ధారపోసి జీవిత చరమాంకంలో సైతం సమాజాభ్యున్నతికి పాటుపడిన రాజమణి సరస్వతి లాంటి అరుదైన స్వాతంత్ర సమరయోధురాలి గురించి పూర్తి సమాచారం అందుబాటులో లేకపోవడం అత్యంత బాధాకరం. దేశ సేవ కోసం అనునిత్యం పరితపించి అలసి సొలసి 13 జనవరి 2018 న చెన్నై లోని రాయపెట్ట పీటర్స్ కాలనీలో దేశం గర్వించదగ్గ మరొక గొప్ప స్వాతంత్ర సమరయోధురాలు “సరస్వతి రాజమణి” తుది శ్వాస విడిచారు.

యేచన్ చంద్ర శేఖర్
మాజీ రాష్ట్ర కార్యదర్శి
ది భారత్ స్కౌట్స్ & గైడ్స్, తెలంగాణ
హైదరాబాద్
✆ 8885050822

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News