Sunday, October 6, 2024
HomeదైవంRathasaptami: రథసప్తమి-జిల్లేడుకున్న సంబంధం ఇదే

Rathasaptami: రథసప్తమి-జిల్లేడుకున్న సంబంధం ఇదే

జిల్లేడు ఆకును ముట్టుకొంటే మేక చర్మంలా మెత్తగా ..

రథసప్తమి నాడు స్నాన సమయంలో నెత్తిపై జిల్లేడాకు పెట్టుకోవాలి. ఆ ఆకునే ఎందుకు పెట్టుకోవాలి? ఏ తమలపాకో చిక్కుడాకో ఎందుకు పెట్టుకోకూడదు అన్న సందేహమూ వస్తుంది. దీని వెనుక ఒకకథ ఉంది.

- Advertisement -

పూర్వం అగ్నిష్వాత్తులు అనే పండితులు మహానిష్ఠతో చాలా యజ్ఞాలు చేశారు. ఆ యజ్ఞాలతో పరమాత్మ తృప్తి చెంది, వాళ్ళని స్వర్గానికి తీసుకురండని దేవ విమానం పంపించాడు. ఆ సమయానికి యజ్ఞాంతంలో పూర్ణాహుతి చేస్తున్నారు అగ్నిష్వాత్తులు. ఆ దేవ విమానం చూసిన సంభ్రమంలో వారు ఆవునేతితో కూడిన హోమ ద్రవ్యాన్ని కంగారుగా వేశారు.

అయితే ఆ సమయంలో పెద్ద గాలి రావడంతో కొంత వేడివేడి నెయ్యి ప్రక్కనే ఉన్న ఒక మేకపై పడింది. ఆ వేడికి మేక చర్మం ఊడిపోయి మరణించి, దాని ఆత్మ వీరికంటే ముందుగా వెళ్ళి దేవ విమానంలో కూర్చుంది. ఆ చర్మం ప్రక్కనే ఉన్న ఒక చెట్టుపై పడింది. అప్పటి నుండి ఆ చెట్టు మూలతత్త్వం మారిపోయి, మెత్తని ఆకుల్ని ధరించిన జిల్లేడు చెట్టుగా మారిపోయింది.

అలా జిల్లేడాకు యజ్ఞంత సమయంలో ఆజ్యధారలు ధరించడంతో పరమ పవిత్రం అయ్యింది. జిల్లేడు ఆకును ముట్టుకొంటే మేక చర్మంలా మెత్తగా ఉంటుందందుకే! జరిగిన దానికి అగ్నిష్వాత్తులు బాధపడ్డారు. అప్పుడు ఆకాశవాణి, “మీరు దుఃఖించాల్సిన పనిలేదు. మీరు చేసిన యజ్ఞఫలం ఆ మేకకు కూడా దక్కి, దుర్లభమైన స్వర్గప్రాప్తి కలిగింది.

ఈ జిల్లేడు మేక చర్మ స్పర్శతో పవిత్రమై అర్కవృక్షంగా అనగా పూజింపదగినదిగా మారింది” అని పలికింది. ఆ మాట అగ్నిష్వాత్తుల్ని సంతోషపరిచింది. అది మాఘశుద్ధ సప్తమీ తిథి. అప్పటి నుండి రథసప్తమినాడు నెత్తిపై జిల్లేడాకు పెట్టుకుని, సూర్య ప్రీతి కోసం స్నానం చేసేవారికి లేశమాత్రం యజ్ఞఫలం లభిస్తోంది. ఏడుజన్మల పాపాలు పోతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News