Sunday, October 6, 2024
Homeపాలిటిక్స్Jagan lengthy speach: ఫ్యాన్ ఇంట్లో- సైకిల్ బయట- తాగేసిన గ్లాసు సింక్‌లో

Jagan lengthy speach: ఫ్యాన్ ఇంట్లో- సైకిల్ బయట- తాగేసిన గ్లాసు సింక్‌లో

సిద్ధాంతాల మధ్య యుద్ధం-2024 ఎన్నికలు

2024 ఎన్నికల్లో జరగబోతున్న ఈ యుద్ధం రెండు సిద్ధాంతాల మధ్య జరగబోతుంది. ఇది కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఇప్పటివరకు ఈ 5 ఏళ్ల కాలంలో ఇంటింటికీ మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలనే అడుగులు వేసే మనకు, ఈ పథకాలన్నీ రద్దు చేయడమే టార్గెట్‌గా పెట్టుకుని డ్రామాలు ఆడుతున్న చంద్రబాబుకు మధ్య జరిగే ఈ యుద్ధంలో మీరు సిద్ధమేనా?

- Advertisement -

ఈ యుద్ధంలో పేదలు ఒకవైపున ఉంటే, పెత్తందారులకు మరోవైపునకు ఉంటే ఇద్దరికీ యుద్ధం జరగబోతుంది. మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు, మాట తప్పడమే అలవాటుగా ఉన్న ఆ పెత్తందార్లకు మధ్య ఈ యుద్ధం జరగబోతుంది. ఈ యుద్ధం విశ్వసనీయతకు, వంఛనకు మధ్య జరగపోతుంది. ఈ యుద్ధంలో పేదవాడి భవిష్యత్‌ కొరకు, పేదవాడి తరపున నిలబడడానికి మీరంతా సిద్ధమేనా?

నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్‌తో యుద్ధం..
ఈ యుద్ధం వేరే రాష్ట్రంలో ఉంటూ మోసం చేసేందుకు అప్పుడప్పుడూ మన రాష్ట్రానికి వచ్చిపోతున్న నాన్‌ రెసిడెంట్స్‌ ఆంధ్రాస్‌కు… ఈ గడ్డమీదే పుట్టి ఈ గడ్డమీదే మమకారంతో ఇక్కడే ఇళ్లుకట్టుని, ఇక్కడే ప్రజల మధ్యే ఉన్న మనకూ మధ్య జరగబోతుంది.
ఇదే వేదిక మీద నుంచి చంద్రబాబునాయుడు గారికి ఒక సవాల్‌ విసురుతున్నాను. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. మీ పేరు చెబితే రైతులకు గుర్తుకు వచ్చే ఒక్కటంటే ఒక్క పథకమైనా ఉందా? అని అడుగుతున్నాను.
అయ్యా చంద్రబాబు మీ పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు గుర్తుకు వచ్చే పథకం.. కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా? అని అడుగుతున్నాను.


చంద్రబాబు పేరు చెబుతే బడికి వెళ్లే పిల్లలలకైనా కాలేజీకి వెళ్లే పిల్లలకైనా గుర్తుకు వచ్చే పథకం ఉందా? రైతన్నలకు గుర్తులేదు, అక్కచెల్లెమ్మలకు గుర్తు రాదు, చంద్రబాబు పేరు చెబితే చదువుకుంటున్న పిల్లలకూ గుర్తుకురాదు. కనీసం అవ్వాతాతలకైనా మమ్మల్ని చంద్రబాబు బాగా చూసుకున్నాడు. మా పెన్షన్‌ మా ఇంటికైనా పంపాడని చెప్పుకునే పరిస్థితి అయినా ఉందా? అని అడుగుతున్నాను.
చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్కరికీ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఫలానా మంచి చేశాడని, ఫలానా మంచి పథకం తీసుకువచ్చాడని చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్క పథకం గుర్తుకురాదు. చంద్రబాబు ప్రజల ఆరోగ్యం కోసం మీరు చేసిన మంచి పని ఏదైనా ఉందా? ప్రజల ఆరోగ్యం కోసం మీరు చేసిన ఒక్క మంచి పనైనా ఉందా? వాళ్ల ఆరోగ్యం కోసం తెచ్చిన ఒక్క మంచి స్కీం అయినా ఉందా? అని అడుగుతున్నాను.

బాబు పేరు చెబితే.. రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామానికైనా వెళ్లి, ఆ గ్రామం మధ్యలో నిలబడి మీరు ఏర్పాటు చేసిన పరిపాలనావ్యవస్ధ కనీసం ఒక్కటంటే ఒక్కడైనా కనిపిస్తుందా? ఆ గ్రామంలో బాబు హయాంలో బాగుబడిన స్కూళ్లు, ఆసుపత్రులు ఉన్నాయా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. 3 సార్లు సీఎం అయినా కూడా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామంలోనైనా సరే, ఎవ్వరైనా ఆ గ్రామంలో ఆగినా.. చంద్రబాబు మార్కు ఎక్కడైనా ఉందా? అని అడుగుతున్నాను.

బాబు పేరు చెబితే సామాజిక న్యాయం అనే పదం.. కనీసం ఏ ఒక్కరికైనా గుర్తుకు వస్తుందా? ప్రతి సామాజికవర్గాన్ని కూడా ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో రంగురంగులగా రాయడం ఆ తర్వాత ఆ సామాజిక వర్గాన్ని మోసం చేయడం చంద్రబాబునాయుడు ఆనవాయితీగా పెట్టుకున్నాడు.

10 శాతం హామీలు కూడా అమలు చేయని బాబు
1995 చూసినా, 1999లో చూసినా, పోనీ 2014లో చూసినా సీఎం అయిన ఈ మూడు సందర్భాలలో కూడా తెలుగుదేశం పార్టీ తరపున మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో కనీసం 10శాతమైనా అమలు చేశారా?.
గతం ప్రజలకు నమ్మకం ఉండదన్న నమ్మకంతో ఇప్పుడు మరోసారి అలాంటి అబద్దాలు, అలాంటి మోసాలు మరోమేనిఫెస్టో పట్టుకుని బంగారు కడియం ఇస్తానని ఊబిలోకి దింపి మనుషుల్ని తినేసే ఆ పులి మాదిరిగా చంద్రబాబునాయుడు ఎర చూపిస్తున్నాడు.
ఆరు స్కీంలు అంట్నునాడు. ఇంకా ఆరు స్కీంలు రావాలంటున్నాడు. రంగురంగుల మేనిఫెస్టోతో మరలా మోసం చేసేందుకు బయలుదేరాడు. చంద్రబాబు మనస్తత్వం ఎలాంటిది అంటే చేసేది ఎలాగూ మోసమే కాబట్టి.. అబద్దాలు చెప్పేటప్పుడు బావదారిద్య్రం ఎందుకు అన్నది బాబు నైజం. నమ్మినవాడు మునుగుతాడు. నమ్మించినవాడు దోచుకోగలుగుతాడు అన్నది బాబుగారి సిద్ధాంతం.

మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన బాబు, మూడుసార్లు మేనిఫెస్టోను ప్రవేశపెట్టాడు. ఎన్నికలకు మందు ఫలాన పనులు చేస్తానని రంగు,రంగు కాగితాలతో ఆశపెట్టాడు. ఆ తర్వాత ప్రతి సందర్భంలోనూ తాను చేసిన మోసం, ఆ దగా కళ్లెదుటే కనిపిస్తుంది. కాబట్టే చంద్రబాబు వాగ్దానాలన్నీ మోసాలేనని, ఏనాడూ అమలు చేయలేదన్న నిజాన్ని ఇంటింటికీ వెళ్లి ఇక్కడున్న ప్రతి కార్యకర్తా ఇంటింటికీ వెళ్తి చెప్పాలి.

మరోసారి చొక్కాలు మడతపెట్టడానికి సిద్ధమా?
బాబు మోసాలను వంఛనలను భరించలేకే కదా.. ఐదేళ్ల క్రితం రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు, అన్ని ప్రాంతాల వారు మొత్తం ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి, బాబుకున్న కుర్చీలనూ కూడా మడిసి, చీపుర్లతో ఊడ్చి.. వారి పార్టీని శాసనసభలో 102 నుంచి 23కి తగ్గించారు.
అదే పని మరోసారి చేయడానికి చొక్కాలు మడతపెట్టడానికి సిద్ధంగా ఉన్నారా ?

ఈ పెద్దమనిషి చంద్రబాబుకు ఇక్కడ నుంచి సవాల్‌ చేస్తున్నాను. 14 ఏళ్లు సీఎంగా ఉన్న మీ పేరు చెబితే.. గుర్తుకు వచ్చేది వెన్నుపోట్లు, మోసాలు తప్ప. మీ పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్కటి మంచి స్కీం గుర్తుకువస్తుందా? మీరు చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటైనా గుర్తుకు వస్తుందా? మరి ఈయన చేయలేని పనులన్నీ దేవుడి దయతో కేవలం ఈ 57 నెలల పాలనలో ఎంతటి శుద్ధితో, ఎంతటి మమకారంతో చేశామో, నాలుగు మాటల్లో వివరిస్తాను.

మన పథకాలన్నీ ఇక మీదట కొనసాగాలంటే, ప్రతి పేదకుటుంబానికి, ప్రతి అక్కచెల్లెమ్మకూ, ప్రతి విద్యార్ధికి, ప్రతి రైతుకూ, ప్రతి అవ్వాతాతకు, ప్రతి సామాజికవర్గానికి మన పాలన ఎంత అవసరమో ప్రజలందరికీ వివరించే బాధ్యతను మనమంతా తీసుకోవాలి.

57 నెలల్లో విప్లవాత్మక మార్పులు
ఈ 57 నెలల్లో ఇంతకముందు కనీవినీ ఎరుగని విధంగా విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. ప్రతి అక్కచెల్లెమ్మ హృదయాన్ని తట్టాం. ప్రతి రైతన్న మనసులో నిలిచాం. ప్రతి అవ్వాతాత చిక్కటి చిరునవ్వుల్లో నిలిచాం. చదువుకుంటున్న ప్రతి పిల్లాడి మనసులో నిలిచాం. విప్లవాత్మక మార్పులు తీసుకునివచ్చి అడుగులు వేశాం. ఈ విప్లవాత్మక అడుగులు ఇంకా కొనసాగాల్సిన విషయం ఎంత ముఖ్యమో, అవసరమో ప్రతి ఇంట్లో ఉన్న అక్కకూ,చెల్లెమ్మకు, అన్నాతమ్ముళ్లకు, అవ్వాతాతలకు చెప్పాలి.

ఈ పథకాలను అందుకున్న ప్రతి ఒక్క కుటుంబం మనకు ఒక స్టార్‌ క్యాంపెయినర్‌గా వారందరూ ఇంటిలోనుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఆ అవసరాన్ని వైయస్సార్సీపీలో ఉన్న ప్రతి కార్యకర్త, నాయకుడు ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరికీ వివరించాలి. వారిని పోలింగ్‌ కేంద్రాలకు తీసుకువచ్చి ఫ్యాను గుర్తుమీద ఓటు వేయించాల్సిన అవసరం గురించి ప్రతి ఇంటిలో చెప్పాలి.
మనం చేసినవి చెప్పాలి. వాటి కొనసాగింపు ఎంత అవసరమో ప్రతి ఇంటిలో చెప్పాలి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి.

మన వైయస్సార్సీపీకి ప్రజలు 2019లో ఒక్కసారి అధికారమిస్తేనే… మొదటిసారి ఛాన్స్‌ ఇస్తేనే… రైతులకు అదనంగా.. ఇంతకముందు రైతన్నలు ఎప్పుడూ చూడని విధంగా, రైతు భరోసాను తీసుకువచ్చి ఇచ్చాం. గ్రామాలలో రైతులను చేయిపట్టుకుని నడిపించే రైతుభరోసా కేంద్రాలను గ్రామస్ధాయిలోకి తీసుకువచ్చి ఇచ్చాం. పగటిపూటే రైతన్నలకు తొమ్మదిగంటలపాటు ఉచిత విద్యుత్, ఆ రైతన్నకు తన గ్రామంలోనే అందుబాటులోకి తీసుకునివచ్చాం. మొట్టమొదటిసారిగా ఏ సీజన్‌లో నష్టం జరిగితే ఈ సీజన్‌ ముగిసేలోగానే రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వడం మొదలుపెట్టింది కూడా మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే.

రైతన్నకు మొట్టమొదటిసారిగా ఎప్పుడూ జరగనివిధంగా ఉచితంగా పంటల బీమా ఇస్తున్నది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇచ్చాం. రైతులకు తోడుగా ఉంటూ ఆదుకునే కార్యక్రమాలు మీ బిడ్డ పాలనలోనే జరిగాయి. ఈ పథకాలన్నీ ప్రతి రైతన్నకు కొనసాగాలన్నా, రైతులను పీడించే బాబు మార్క్‌ దళారీ వ్యవస్ధ మళ్లీ రాకూడదన్నా… అందుకోసం ప్రతి ఒక్క రైతన్న బయటకు రావాలి. స్టార్‌ క్యాంపెయినర్‌లుగా ఆ రైతన్న ముందుకువచ్చి ఇంకో వందమందికి చెప్పాల్సిన అవసరం ఉంది ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలి.

ఇవాళ బిర్యానీ పెడతానని, విందు భోజనం పెడతానని మోసపూరిత ఆశచూపించి చంద్రబాబు ఇప్పుడు మనం పెడుతున్న అన్నాన్ని, గిన్నెని రెండింటినీ కూడా రైతన్న దగ్గరనుంచి లాక్కోవడానికి అడుగులు వేస్తున్నాడు. గతంలో ఇదే పెద్దమనిషి చంద్రబాబు తాను బేషరతుగా చేస్తానన్న రూ.87,612 కోట్ల రుణమాఫీని ఓ మోసంలో ఎలా మార్చాడో ప్రతి రైతన్నకు గుర్తు చేయాల్సిన అవసరం మనలో ఉన్న ప్రతి కార్యకర్తకూ ఉంది.

2019లో సీఎం అయిన మీ జగన్‌ పేరు చెబితే… మన పార్టీ పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు గతంలో ఎప్పుడూ జరగని విధంగా అమ్మఒడి, ఆసరా, సున్నావడ్డీ, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, 31లక్షల ఇళ్లపట్టాల పంపిణీ,వేగంగా నిర్మాణం జరుపుకుంటున్న 22 లక్షల ఇళ్లు, ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్‌లోనూ దిశ యాప్, వారికి తోడుగా ఉండేందుకు అదే గ్రామంలోనే ఒక మహిళా పోలీసు ఇవన్నీ గతంలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అడుగులు పడ్డాయి. జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రతి అక్కచెల్లెమ్మకూ కొనసాగాలంటే.. మహిళా సాధికారతకు ఇంతగా పాటుపడుతున్న జగనన్న ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని, ఫ్యాను గుర్తు మీద ఓటు వేయాలని,ప్రతి అక్కచెల్లెమ్మ వెళ్లి.. స్టార్‌ క్యాంపెయినర్‌గా మరో వందమందికి చెప్పి ఓటు వేయించాల్సిన బాధ్యత ఉంది. గడపగడపకూ వెళ్లి ఆ అక్కచెల్లెమ్మకు చెప్పాల్సిన అవసరం ప్రతి కార్యకర్తకు, అభిమానికి, వాలంటీర్‌కు ఉంది.

ఫ్యాన్ ఇంట్లో- సైకిల్ బయట- తాగేసిన గ్లాసు సింక్‌లో ఉండాలి
అలా ప్రతి ఇంటికీ వెళ్లినప్పుడు వారి చిరునవ్వుల మధ్య ఆ అవ్వాతాతలకు, అక్కచెల్లెమ్మలకు చెప్పండి.. ఫ్యాను ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి. సైకిల్‌ ఎప్పుడూ బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్‌ ఎప్పుడూ సింక్‌లోనే ఉండాలి. ప్రతి ఒక్కరికీ అర్ధం అయ్యేలా చెప్పండి.

మన పిల్లల చదువుల విషయానికి వస్తే.. మన పార్టీ పేరు చెబితే ప్రభుత్వ బడులకు వెళ్లే పిల్లలకు గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఇంగ్లిషు మీడియం, విద్యాకానుక, గోరుముద్ద, నాడునేడుతో బాగుపడుతున్న స్కూళ్లు. మొట్టమొదటిసారిగా వాళ్ల పుస్తకాలకు బైజూస్‌ కంటెంట్‌తో అనుసంధానం, తొలిసారిగా ఒక పేజీ ఇంగ్లిషు, ఒక పేజీ తెలుగుతో బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్, తొలిసారిగా వాళ్ల చేతుల్లో ట్యాబులు కనిపిస్తున్నాయి. తొలిసారిగా ప్రతి స్కూల్‌లోను 6వతరగతి నుంచి ఆ పైబడిన ప్రతి క్లాస్‌రూంలోనూ ఐఎఫ్‌పి ఫ్యానెల్స్‌తో డిజిటల్‌ బోధనతో కనిపిస్తున్నాయి. తొలిసారి సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెఫ్ట్‌ను ప్రవేశపెట్టాం.

మొట్టమొదటిసారిగా క్లాస్‌రూంలలో టోఫెల్‌ సైతం బోధన చేయడం జరుగుతోంది. సీబీఎస్‌ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం సాగుతోంది. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు ఏ క్వార్టర్‌లో ఉన్న ఫీజులు ఆ క్వార్టర్‌ అయిపోయిన వెంటనే ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వేస్తూ విద్యా దీవెన, వసతి దీవెనను, జాబ్‌ ఓరియెంటెడ్‌గా కరిక్యులమ్‌లో మార్పులు, ఆన్లైన్‌ వర్టికల్స్‌ చదువులతో అనుసంధానం చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఆ పిల్లలను, ఆ తల్లిదండ్రులను వాళ్ల ఇంటికి వెళ్లిప్పుడు అడగండి. ఇంతకు ముందుకు ఇప్పటికి తేడా ఎంతలా ఉందో గమనించాలని అడగండి.

ఇవన్నీ కొనసాగాలంటే ఆ పిల్లలు అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడాలంటే, పెత్తందార్లతో పోటీ పడే పరిస్థితి జరగాలంటే అది చేయగలిగింది కేవలం మీ అన్న ముఖ్యమంత్రి అయితేనే జరుగుతుందని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ఒకటో తరగతిలో ఉన్న పేదింటి పాప, పేదింటి బాబు.. మరో 10–15 సంవత్సరాల్లో అంతర్జాతీయ చదువులతో, పెత్తందార్ల పిల్లలకన్నా మించిపోయి ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడుతూ పేద పిల్లలకు వేరే రాష్ట్రాల్లోనే కాదు, వేరే దేశాల్లో గొప్ప ఉద్యోగాలు రావాలంటే ఇటువంటి విప్లవాత్మక ఆలోచనలు, ఆచరణ కొనసాగాలంటే.. కేవలం మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుందని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.

ఫ్యాన్‌ గుర్తుకు ఓటేయడమంటే వారి పిల్లల్ని ఇంటర్నేషనల్‌ స్థాయిలో నిలబెట్టే ప్రభుత్వానికి ఓటేయడం అని, సైకిల్‌కు ఓటేయడం అంటే గవర్నమెంట్‌ బడుల్లో కూడా ఇంగ్లీషు మీడియం రద్దుకు ఓటేస్తున్నాం అని గుర్తుపెట్టుకోవాలని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.
ఇవన్నీ కొనసాగాలంటే ఆ పిల్లల తల్లుదండ్రులు స్టార్‌ క్యాంపెయినర్లుగా మారి మరో వంద మందికి చెప్పి ఫ్యాన్‌ గుర్తుకు ఓటేయాలని చెప్పండి.

ఈ రోజు వైయస్సార్సీపీ పేరు చెబితే, జగన్‌ పేరు చెబితే, అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులకు మా జగన్, మా పెన్షన్‌ అందరికీ ఇచ్చాడు, రూ.1000 నుంచి రూ.3 వేలు చేశాడు, వాలంటీర్‌ ద్వారా ఆదివారమైనా సెలవైనా ఒకటో తేదీ సూర్యోదయానికి కంటే ముందే చిక్కటి చిరునవ్వుతో మా చేతిలో పెడుతున్నాడు, ఇది కేవలం మీ జగన్‌ ఉంటేనే కొనసాగుతుందని చెప్పండి.

ఆ పెన్షన్‌ కొనసాగాలన్నా, భవిష్యత్‌లో అవ్వాతాతల పెన్షన్‌ పెరగాలన్నా, అవ్వాతాతాలు, వింతతువులు, వికలాంగుల్లో కొందరికే మళ్లీ పెన్షన్లు ఇచ్చే రోజులు రాకూడదన్నా, లంచాల జన్మభూమి కమిటీలు కాటేయకూడదన్నా, ఇంటికొచ్చిపోయే మన వాలంటీర్‌ వ్యవస్థ కొనసాగాలన్నా… వైయస్సార్‌సీపీ ప్రభుత్వం, మీ అన్న ప్రభుత్వం మాత్రమే ఆ పని చేయగలదని, ఫ్యాన్‌ గుర్తుకు ఓటేస్తేనే ఇవన్నీ జరుగుతాయని ఇంటింటికీ వెళ్లి చెప్పాల్సిన అవసరం ఉంది.

పెన్షన్‌ అందుకుంటున్న ప్రతి అవ్వా, ప్రతి తాతా, వికలాంగ సోదరుడు, అక్కచెల్లెమ్మ బయటకొచ్చి వంద మందికి చెప్పి జరుగుతున్న మంచి కొనసాగాలంటే.. కేవలం మీ అన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే జరుగుతుందని ప్రతి ఇంటికీ చెప్పాల్సిన అవసరం ఉంది.

మీ జగన్, మన వైయస్సార్‌సీపీ పేరు చెబితే ఈరోజు గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ విస్తరించిన ఆరోగ్యశ్రీ కనిపిస్తుంది. కొత్తగా 104, 108 వాహనాలుకనిపిస్తాయి. ఆరోగ్య ఆసరా, విలేజ్‌ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్షతో జల్లెడ పడుతూ ప్రతి ఇంటికీ వచ్చి.. ఇంట్లో ఎవరికి బాగోలేకపోయినా మందులు ఇంటికి ఇచ్చిపోయే గొప్ప వ్యవస్థ కనిపిస్తుంది.

కోవిడ్‌ కష్టకాలంలో కూడా అందించిన సేవలు గుర్తుకొస్తాయి
పేదలు వైద్యం కోసం అప్పులపాలు కాకూడదన్నా, గడపగడపకూ వైద్యం అందించే పరిస్థితి ప్రభుత్వం చేయాలన్నా, ఈ పథకాలన్నీ కొనసాగాలన్నా, ఇంతకు మించిన మంచి ఆ కుటుంబాలకు జరగాలన్నా మనందరి ప్రభుత్వానికి ఆ పేదలు అండగా, దండగా నిలబడాలని, వారే స్టార్‌ క్యాంపెయినర్లుగా మారాలని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. అప్పులు పాలయ్యే పరిస్థితి ఎవరికీ రాకూడదంటే అది కేవలం మీ జగన్‌తోనే సాధ్యమవుతుందని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.

మనం అధికారంలోకి వచ్చాకే గ్రామాల్లో సమూల మార్పులు
2019లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలోని ఏ గ్రామమైనా ఆ గ్రామానికి వెళ్లి అక్కడ నిల్చుంటే ఓ విలేజ్‌ సెక్రటేరియట్‌ కనిపిస్తుంది. అందులో 10 మంది శాశ్వత ఉద్యోగాలు చేస్తున్న మన పిల్లలు కనిపిస్తారు.
అదే గ్రామంలో నాలుగడుగులు ముందుకేస్తే ఆర్బీకే కనిపిస్తుంది. మరో నాలుగు అడుగులు వేస్తే విలేజ్‌ క్లినిక్, మరో నాలుగడుగులు వేస్తే కడుతున్న డిజిటల్‌ లైబ్రరీలు కనిపిస్తాయి. నాడునేడుతో రూపు మారిన బడులు, హాస్పిటల్స్‌ కనిపిస్తాయి. వీటన్నింటితో పాటు ప్రతి 50–60 ఇళ్లకు చేయి పట్టుకొని నడిపించే ఓ మంచి వాలంటీర్‌ వ్యవస్థ ఒక్క రూపాయి కూడా లంచం అడగకుండా వివక్ష చూపకుండా మంచి చేస్తున్న వ్యవస్థ కనిపిస్తుంది.

ఇవన్నీ కూడా ఎప్పుడు జరిగాయి అంటే.. ఎప్పుడు నుంచి మొదలయ్యాయి అంటే… ఈ 57 నెలల్లో మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే జరిగాయి అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాల్సిన అవసరం ఉంది. అదే గ్రామంలో అదే వార్డులో ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. ఐదేళ్లలో మీ అన్న ముఖ్యమంత్రి కాకముందు… ఎప్పుడైనా ఊహించారా? ప్రభుత్వం ఇచ్చే డబ్బు… రూపాయి లంచం లేకుండా, వివక్ష లేకుండా మీ చేతికి వస్తుందని మీరు ఊహించారా? అని అడగండి.

మరి ఈ రోజు ఒక్క రూపాయి లంచం లేకుండా, వివక్ష లేకుండా, లంచం లేకుండా నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు, మీ బిడ్డ, మీ అన్న అక్షరాలా 125 సార్లు బటన్‌ నొక్కాడు. ఏకంగా రూ. 2.55 లక్షల కోట్లు పంపిన మాట వాస్తవం కాదా అని ప్రతి అక్కను, చెల్లెమ్మను అడగండి.

కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామంలో ఆగినా, ఏ సామాజికవర్గాన్ని చూసినా 14 సంవత్సరాలు సీఎంగా చేసిన చంద్రబాబు మార్క్, అభివృద్ధి ఎక్కడా కనిపించదు. ప్రతి ఇంట్లోనూ, గ్రామంలోనూ కనిపించేది 2019లో సీఎం అయిన మీ జగన్‌ మార్క్, వైయస్సార్‌ సీపీ మార్క్‌ అభివృద్ధి ప్రతి ఇంటిలోనూ, ప్రతి గ్రామంలోనూ కనిపిస్తుంది.

తొలిసారే ఇన్ని చేశాం- మరల ఆశీర్వదిస్తే…
ప్రజలు మనకు ఫస్ట్‌ టైమ్‌ ఆశీర్వదిస్తేనే దేవుడి దయతో ఇంత మంచిచేయగలిగాం. ఇక ప్రజలు మనల్ని సెకండ్‌ టైమ్, థర్డ్‌ టైమ్, ఫోర్త్‌ టైమ్‌ ఆశీర్వదిస్తే ఇక ఎంత మంచి జరుగుతుందని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.

ప్రతి అడుగులోనూ ముఖ్యమంత్రిగా నేనుంటూ అణగారిన వర్గాల మీద నేను చూపిస్తున్న ప్రేమ.. ప్రతి మాటకూ ముందు నా.. నా.. నా.. అంటూ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా నిరుపేద వర్గాలంటూ గుండెల నిండా ఆప్యాయతతో చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా, జరగని విధంగా నామినేషన్‌ పనులు, నామినేషన్‌ మీద ఇచ్చే కాంట్రాక్టుల్లో 50 శాతం చట్టం చేసి మరీ ఇస్తున్నది ఎవరంటే మీ జగన్‌ అని చెప్పి ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.

ఏకంగా రూ. 2.55 లక్షల కోట్లు.. నేరుగా మీ జగన్‌ బటన్‌ నొక్కుతున్నాడు. నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్తున్నాయి. ఎక్కడా ఎవరూ లంచాలు అడగడం లేదు. ఎక్కడా వివక్ష చూపించడం లేదు. ఇందులో 75 శాతం నా..నా..నా అని పిలుచుకొని నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ వర్గాలకే ఇచ్చాను అని చెప్పుకొనేదానికి సంతోషపడుతున్నాను. గతానికి భిన్నంగా ఇవాళ జరుగుతున్నదాన్ని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలి.

నిరుద్యోగులకు ఈ 57 నెలల్లో.. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మన రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలుంటే… ఈ 57 నెలల మీ బిడ్డ పాలనలోనే ఏకంగా 2 లక్షల 13 వేల ఉద్యోగాలు ఇచ్చాడని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ఆ ఉద్యోగాల్లో 80 శాతం నేను నానానా అని పిలుచుకొనే నా ఎస్సీలు, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలు, నా నిరుపేద వర్గాలకు వచ్చాయంటే అది జరిగింది, ఇంతటి సామాజిక న్యాయం కనిపిస్తున్నది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని చెప్పండి.

ఒకటి, రెండు కాదు దాదాపు 35 లక్షల ఎకరాల మీద సర్వ హక్కులు అనుభవదారులకు, గిరిజనులకు, రైతన్నలకు, నిరుపేదలకు ఇచ్చినది ఎవరంటే మీ జగన్‌.
అందులో అత్యధికం పేద సామాజికవర్గాలకు చెందినవే అని తెలిసి వారికి మేలు చేసింది ఎవరంటే మీ జగన్‌. ఇచ్చింది ఎవరంటే మన వైయస్సార్‌సీపీ పార్టీ.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎన్నికైన పదవుల నుంచి మంత్రిమండలి వరకు, డిప్యూటీ సీఎంలు, రాజ్యసభ, శాసనసభాపతి వరకు, మండలి చైర్మన్, వైస్‌ చైర్మన్‌ పదవులు ఇచ్చింది ఎవరంటే మీ జగన్‌. వచ్చింది ఎప్పుడంటే మన వైయస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.
మనందరి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అండగా ఈ వర్గాలన్నీ కదిలి రావాలని, నిండు మనస్సుతో మద్ధతు తెలపాలని, స్టార్‌ క్యాంపెయినర్లుగా నిలవాలని, బాబుకు ఓటేయడం అంటే సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఓటేయడం అని, బటన్‌ నొక్కితే నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు పోయే డీబీటీకి వ్యతిరేకంగా ఓటు వేయడం అని, ఈ వర్గాలన్నీ స్టార్‌ క్యాంపెయినర్లగా ముందు రావాలని ప్రతి ఒక్కరికీ ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాల్సిన అవసరం ఉంది.

గతంలో చంద్రబాబు పాలన చూశారు. ఇంకా చాలా మంది పాలన చూశారు. చాలా రాష్ట్రాల్లో చూస్తున్నారు. ఎవరైనా మేనిఫెస్టోను మన మాదిరిగా, ఒక బైబిల్‌గా, ఒక ఖురాన్‌గా, భగవద్గీతగా భావించి 99 శాతం అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తున్నది మీ జగన్‌. ఒక్క వైయస్సార్‌ సీపీ మాత్రమే ఆ చిత్తశుద్ధి చూపిస్తోంది.

తొలిసారి ఫస్ట్‌ చాన్స్‌ ఇస్తేనే మీ జగన్‌ ఇంత గొప్పగా అన్ని వర్గాలనూ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నాడు. మరి మూడుసార్లు, 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేయలేకపోయాడని చెప్పి, ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికీ వెళ్లి అడగండి.

నీకెందుకు ఓటెయ్యాలి బాబూ
అందుకే ఈ పెద్దమనిషి చంద్రబాబును… అయ్యా బాబూ.. ప్రజలు నీకు ఎందుకు ఓటు వేయాలి? జగన్‌ మార్క్‌ ప్రతి గ్రామంలో కనిపిస్తున్నప్పుడు, ప్రతి పేద ఇంట్లో, ప్రతి సామాజికవర్గంలో, ప్రతి ప్రాంతంలో కనిపిస్తున్నప్పుడు ఎందుకు బాబుకు ఓటు వేయాలని అడుగుతున్నాను.

అయ్యా చంద్రబాబూ… జగన్‌ తన పాలనలో ప్రజలకు మంచి చేయలేదని చెప్పి నువ్వు నిజంగా నమ్మితే, జగన్‌కు ప్రజాబలం లేదని నువ్వు నమ్మితే మరి చంద్రబాబూ నీకు పొత్తులెందుకు? నిజంగా నువ్వు జగన్‌ మంచి చేయలేదని అనుకుంటే, జగన్‌ మేనిఫెస్టోలో చెప్పినవి చెయ్యలేదని అనుకుంటే, జగన్‌కు ప్రజా బలం లేదనుకుంటే ఇంత మందితో ఇన్ని పొత్తులు ఎందుకయ్యా చంద్రబాబూ అని అడుగుతున్నాను.

తన నడక కోసం అటో కర్రా, ఇటో కర్ర ఎందుకయ్యా చంద్రబాబూ? తన సైకిల్‌ తోయడానికి నీకొక ప్యాకేజీ స్టార్‌ ఎందుకయ్యా? నీకు కూడా తెలుసు.. జగన్‌ ప్రతి ఇంటికీ మంచి చేశాడు అని, వైయస్సార్‌సీపీ చేసిన మంచి ప్రతి ఇంట్లోనూ బతికి ఉందని తెలుసు. ప్రతి గ్రామానికి, ప్రతి సామాజికవర్గానికి, ప్రతి పేదవాడూ జగన్‌ను, వైయస్సార్‌సీపీని తన గుండెల్లో పెట్టుకున్నాడు కాబట్టే .. ఇవాళ చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

125సార్లు ఈ 57 నెలల్లో ఎప్పుడూ జరగని విధంగా ప్రజల కోసం నేను బటన్లు నొక్కాను. ఏకంగా రూ.2.55 లక్షల కోట్లు నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు వెళ్లింది. ఇంత మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి మద్దతుగా ఈ పాలనకు కొనసాగింపుగా 2024 ఎన్నికల్లో ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరూ మంచి భవిష్యత్‌ కోసం రెండు బటన్లు నొక్కాలని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.

శాశ్వతంగా చంద్రముఖి బెడద పోవాలంటే…
ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు. ఫ్యాన్‌ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్‌ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద శాశ్వతంగా ఉండదు.
పొరపాటు చేశారంటే చంద్రముఖి మళ్లీ సైకిలెక్కుతుంది. టీ గ్లాస్‌ పట్టుకొని మీ ఇంటికొస్తుంది. పేదల రక్తం తాగేందుకు లకలకా అంటూ మీ ఇంటి తలుపులు తడుతుందని ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ చెప్పండి.

మీకు మంచి జరిగితేనే ఓటు వేయండని చెబుతున్నాం
మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని, మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా, మీరే సైనికులుగా నిలబడండి అని ప్రతి ఇంటికీ వెళ్లి నిబద్ధతతో చెప్పి.. ఎన్నికలకు సిద్ధం అంటుంటే, మరోవంక బాబు పేదల ఇంటికిగానీ, పేదల సామాజికవర్గాలకు గానీ, గ్రామాలకుగానీ, రాష్ట్రానికి గానీ ఏం చేశాడో చెప్పుకొనేందుకు ఒక్కటంటే ఒక్కటీ కనిపించని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నాడు.
అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు తానూ పోస్టర్లు వేయిస్తాడు. సంసిద్ధం, మేమూ సిద్ధం అని వేయిస్తాడు.

చంద్రబాబూ దేనికి సంసిద్ధం?
ప్రజలకు మంచి చేయకుండా దేనికయ్యా సంసిద్ధం? ఎందుకు సంసిద్ధం? ఎవరితో యుద్ధం? పేదల భవిష్యత్‌ కొరకు, పేదవాడి తరపున, పేదవాడి కోసం మనం యుద్ధం చేస్తున్నాం. సిద్ధం అని ప్రతి పేదవాడి తరపున మనం నిలబడుతుంటే.. పెత్తందార్ల తరఫున చంద్రబాబు సంసిద్ధం అంటున్నాడంటే ఎవరితోనయ్యా నువ్వు యుద్ధం చేస్తున్నావు?

ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు – అర్జునుడు
దుష్ట చతుష్టయం బాణాలకు బలి కావడానికి, తలవంచడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు. ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు కృష్ణుడి రూపంలో ఉన్న ఇంత మంది.. ఇన్ని లక్షల గుండెలు, కోట్ల గుండెలు. ప్రతి పేదవాడి ఇంట్లో ఈ బిడ్డ మా బిడ్డ అంటూ తోడుగా ఉండే గుండెలు.

ప్రజలే అండగా– ప్రజలతో పొత్తుగా…
ప్రజలే అండగా ప్రజలతోనే పొత్తుగా పోరాటానికి మీ బిడ్డ సిద్ధం. మరి మిమ్మల్ని అడుగుతున్నా. మీరంతా సిద్ధమేనా? మన పార్టీని, మీ అన్నను అభిమానించే ప్రతి కార్యకర్తకు, నాయకుడికీ, వాలంటీర్‌కు, ఒక్క విషయం చెబుతున్నాను.

ప్రజా ప్రతినిధులైన వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలకు జెడ్పీ ఛైర్మన్లకు, కార్పొరేటర్లకు, మేయర్లకు, నామినేటెడ్‌ పదవుల్లో ఉన్న డైరెక్టర్లకు, చైర్మన్లకు, ఇతర ప్రజా ప్రతినిధులకు మీ అందరికీ ఇక్కడే ఒక్క విషయం చెబుతున్నాను. ఇది మీ అందరి పార్టీ.

కార్యకర్తల్ని, నాయకుల్ని, అభిమానించే విషయంలో, రాష్ట్ర చరిత్రలో ఏపార్టీ చేయని విధంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, కార్పొరేషన్‌ చైర్మన్లను, ౖడైరెక్టర్లను నియమించిన ప్రభుత్వం మనది. మార్కెట్‌ యార్డులు, దేవాదయ బోర్డులు, నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో, 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పదవులివ్వడం కేవలం మీ అన్నకు మాత్రమే సాధ్యం.

గత తెలుగుదేశం పార్టీ తమ కార్యకర్తలతో లంచాలు పిండుతూ పక్షపాతంతో కొద్దిమందికి మాత్రమే అనే వివక్షతో జన్మభూమి కమిటీల ద్వారా సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తే, ఆ స్థానంలో మన ప్రభుత్వం మనలో నుంచి చదువుకున్న మన పిల్లలతో తీసుకొచ్చిన మన వాలంటీర్‌ వ్యవస..్థ ఇంటికీ వెళ్లి పని చేస్తున్న మన ప్రభుత్వానికి దన్నుగా ప్రజల మన్ననలు పొందుతోంది. మనతోపాటు పని చేస్తోంది.

ఇలా మన పార్టీని అభిమానించే వారికి, మన వారికి, చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని అవకాశాలు మనమే ఇచ్చాం. నామినేషన్‌ మీద ఇచ్చే పనులు, కాంట్రాక్టుల్లో ఇదే పంథా న్యాయం చేశాం.
ఎవరూ గెలవనన్ని పదవులు వార్డు మెంబరు మొదలు ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్లు, మేయర్లు, కార్పొరేటర్లు ,ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, డిప్యూటీ సీఎంలు, మంత్రి మండలి వరకూ అన్నింటిలోనూ జగన్‌ను నమ్మిన వారికి, పార్టీ కోసం కష్టపడిన వారికి అంచెలంచెలుగా ఏ రాజకీయ పార్టీలోనూ ఇవ్వని అవకాశాలు ఇచ్చిన ఏకైక పార్టీ మన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అని గర్వంగా చెబుతున్నాను.

మంచి పాలన అందించాం. కాబట్టి భవిష్యత్‌లో మనలో నుంచి ఏ ఒక్కరైనా, ఏ పదవికోసం నిలబడినా ప్రజలు బ్రహ్మరథం పడుతూ మనల్ని ఆశీర్వదిస్తారు. మంచి పాలనతో భవిష్యత్‌లో ఇంతకంటే ఎక్కువ పదవులిచ్చే పార్టీ మన వైయస్సార్‌సీపీ.

ప్రతి కార్యకర్తకు అండగా మీ జగన్‌…
ప్రతి కార్యకర్తకూ మీ అన్న మీ జగన్‌ ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు అని తెలియజేస్తున్నాను. ప్రతి కార్యకర్తకూ, ప్రజా సేవలో ఉన్న ప్రతి ఒక్కరికీ మరో రెండు మెట్లు అవకాశం కల్పించే బాధ్యత నాదీ అని గర్వంగా చెబుతున్నాను.

ఈ 57 నెలల మన పరిపాలన చూశారు. గతంలో ఐదేళ్ల చంద్రబాబు పరిపాలన కూడా చూశారు. మిమ్నల్ని అడుగుతున్నాను? ఎలాంటి నాయకుడు మీకు కావాలి? చంద్రబాబు మాదిరి ఎన్నికలు వచ్చేసరికి రంగురంగుల మేనిఫెస్టోలు చూపించి రైతన్నలను, అక్కచెల్లెమ్మలను, అవ్వాతాతలను, చదువుకుంటున్న పిల్లల్ని ఎలా మోసం చేయాలనే దిక్కుమాలిన ఆలోచన చేసి, ఆ మేనిఫెస్టో రూపొందించి, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసి అందర్నీ మోసం చేస్తున్న అలాంటి చంద్రబాబు మాదిరిగా ఉండాలా?

నాయకుడంటే ఒక మాట నోట్లో నుంచి వచ్చిన తర్వాత.. మరీ ముఖ్యంగా ఎన్నికల ప్రణాళిక అంటూ ఎన్నికల మేనిఫెస్టో అని రిలీజ్‌ చేసిన తర్వాత కష్టమైనా నష్టమైనా మాట మీద నిలబడగలిగిన వాడే నాయకుడు.

ఈరోజు అలా చేయగలిగాం కాబట్టే, ఏకంగా 99 శాతం మేనిఫెస్టో హామీలు నెరవేర్చాం కాబట్టే ప్రతి కార్యకర్త, ప్రతి ఇంటికీ వెళ్లి అక్కా మీరే టిక్‌ పెట్టండి, ఎన్నెన్ని జరిగాయో, 99 శాతం మా అన్న నెరవేర్చాడని ప్రతి కార్యకర్త ప్రతి పేద వాడి ఇంటికి వెళ్లగలుగుతున్నాడు. ఇదీ నాయకుడు అంటే.

నాయకుడంటే ప్రతి కార్యకర్తా కాలర్‌ ఎగరేసి అదిగో మా నాయకుడు మాటిచ్చాడు అంటే చేస్తాడంతే అనే పరిస్థితి ఉండాలి.
ప్రతి కార్యకర్తకూ ఇలాంటి వ్యక్తి ఉండాలి. రాష్ట్రానికి, ప్రజలకు మాకు అండగా తోడుగా ఉండాలి అనేలా ఉండాలి.

మాట ఇచ్చి నెరవేర్చాం– మన టార్గెట్‌ 175
ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికీ ప్రతి పేద కుటుంబానికీ మంచి చేశాం. ప్రతి పేదకు, వారి భవిష్యత్‌కు అండగా నిలబడగలిగాం. మాట ఇచ్చాం. మాట నెరవేర్చాం. మళ్లీ ప్రజల దగ్గరికి వెళ్లగలిగే పరిస్థితి మనకు, మన వైయస్సార్‌సీపీకి ఉంది. అందుకే వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్‌… 175కు 175 అని అడుగుతున్నాను. మన టార్గెట్‌ 25కు 25 ఎంపీలు అని అడుగుతున్నాను. పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు. మనకు ఒక్క ఎమ్మెల్యేగానీ, ఎంపీగానీ తగ్గేందుకు వీలే లేదు.

650 వాగ్దానాలిచ్చి అమలు చేయని బాబు ప్రభుత్వం.
ఇదీ 650 వాగ్దానాలిచ్చి అందులో 10 శాతం కూడా అమలు చేయని చంద్రబాబు పార్టీ కాదు, చంద్రబాబు ప్రభుత్వం కాదు.. ఇదీ… ఏకంగా 99 శాతం వాగ్దానాలు అమలు చేసి మరీ ప్రతి ఇంటికీ వెళ్లి మేనిఫెస్టో చూపించి అక్కచెల్లెమ్మల ఆశీస్సులు కోరుతున్న మన వైయస్సార్‌సీపీ పార్టీ.
అటు టీడీపీ, ఇటు వైయస్సార్‌సీపీ. అటు పెత్తందార్లు, ఇటు పేదవాడు.

యుద్ధానికి మీరు సిద్ధమేనా?
పేదవాడి భవిష్యత్‌ కోసం యుద్ధానికి మీరంతా సిద్ధమేనా అని అడుగుతున్నాను.
మరో రెండు నెలల్లోనే ఎన్నికలు. ఈరోజు నుంచి చూస్తే మరో 55 రోజుల్లో జరగబోయే కురుక్షేత్రానికి… ఒక సైన్యంగా పని చేయడానికి, చంద్రబాబు ప్రచారాలు, ఈనాడు రాతలు, ఏబీఎన్, టీవీ5, ఎల్లో మీడియా తప్పుడు కథలు, వారి అబద్ధాలు, మోసాలు.. వీటన్నింటిని నుంచి ఇంటింటి అభివృద్ధి, పేదవాడి భవిష్యత్‌ను కాపాడేందుకు మీరంతా సిద్ధమేనా?

వారి మీడియా, వారి సోషల్‌ మీడియాలో వారు చేసే దుష్ప్రచారాలను తిప్పి కొట్టాలి. దానికి మీరంతా సిద్ధమేనా? వారి చీకటి రాతల్ని, చీకటి పనుల్ని బట్టబయలు చేసేందుకు సిద్ధమేనా? మీ అందరికీ సెల్‌ఫోన్లు ఉన్నాయా? ఆ సెల్‌ఫోన్లు ఒక్కసారి బయటకు తీయండి. అందులో లైట్‌ బటన్‌ నొక్కండి. సెల్‌ టార్చర్‌ ఆన్‌ చేసి ప్రతి ఒక్కరూ కూడా.. సిద్ధమే అని చెప్పండి.

సమరబేరి మోగిద్దాం– సమర నాదం వినిపిద్దాం
ప్రతి కార్యకర్త, బూత్‌ కమిటీ సభ్యులుగా, గృహసారథులుగా, వాలంటీర్లుగా మీ పాత్ర అత్యంత కీలకం. సమరభేరి మోగిద్దాం, సమరనాదం వినిపిద్దాం. మరో గొప్ప చారిత్రాత్మక విజయానికి మరో అడుగు వేయడానికి అందరం కూడా సిద్ధమా? అని అడుగుతున్నాను.

ఈ జరగబోయే ఎన్నికలు అత్యంత కీలకమైన ఎన్నికలు. చంద్రబాబు గారి వయసు ఇప్పటికే 75. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాతా ఆయన వయసు 80కి పోతుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక తెలుగుదేశం పార్టీ రూపురేఖలు కూడా ఎక్కడా కనిపించవు.

పెత్తందార్లు– తోడేళ్ల మాదిరిగా ఏకం అవుతున్నారు
ఈ ఎన్నికలు చాలా కీలకం. అందుకే పెత్తందార్లంతా ఏకం అవుతున్నారు. తోడేళ్లు మాదిరిగా ఏకం అవుతున్నారు.
మనం యుద్ధం చేస్తున్నది చంద్రబాబుతో మాత్రమే కాదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, వీళ్లందరికీ తోడు దత్తపుత్రుడితో యుద్ధం చేస్తున్నాం. ఇంత మంది ఏకం అవుతున్నారు. చంద్రబాబు నాయుడు ఇంత మంది సరిపోరు అని జాతీయ పార్టీలతో కూడా పరోక్షంగా ఒకరితో, ప్రత్యక్షంగా మరొకరితో పొత్తు తెచ్చుకొనేందుకు వెంపర్లాడుతున్నాడు. కేవలం ఒకే ఒక్కడి మీద యుద్ధం చేయడానికి ఇంత మంది తోడేళ్లు ఏకం అవుతున్నారు.

మీ జగన్‌కు మీరే తోడు…
అందుకే ఈ ఎన్నికలు చాలా కీలకం. ఈ తోడేళ్లను ఎదుర్కోవాలంటే మీ జగన్‌ ఒకడికే సాధ్యం కాదు. మీ జగన్‌కు ప్రతి గుండె తోడుగా నిలబడాలి. ప్రతి ఇంట్లో ఉన్న అక్కచెల్లెమ్మ, అవ్వాతాత, తల్లీతండ్రీ, ప్రతి రైతన్న కూడా మీ జగన్‌కు తోడుగా స్టార్‌ క్యాంపెయినర్లుగా బయటకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పేదవాడి భవిష్యత్తును నిర్ణయించే ఓటు…
ఈ ఎన్నికలు ఆశామాషీ ఎన్నికలు కాదు. ఈ ఎన్నికల్లో మనం వేసే ఓటు రేప్పొద్దున పేదవాడి భవిష్యత్‌ను, జీవితాన్ని నిర్ణయించే ఓటు అవుతుంది. పొరపాటు జరిగిందంటే పేదవాడి బతుకులు అతలాకుతలం అవుతాయి.
పేదవాడి భవిష్యత్‌ మారాలంటే, పేదవాడి పిల్లాడు రేప్పొద్దున 10–15 సంవత్సరాలకు అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడుతూ, పెత్తందార్లతో పోటీ పడుతూ పెద్ద కంపెనీలతో ఉద్యోగాలు సంపాదించుకోవాలంటే జరగబోయేఎన్నికలు అత్యంత కీలకం.

ప్రతి పేద గుండె ఏకం కావాలి– పెత్తందార్లు పోవాలి
పేదవాడి ప్రతి గుండె ఏకం కావాలి. పెత్తందార్ల పార్టీలను పూర్తిగా నాశనం చేసే పరిస్థితి రావాలి. అందుకే ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవి. ప్రతి కార్యకర్తకూ, నాయకుడికీ, ప్రతి అభిమానికీ, ప్రతి వాలంటీర్‌కు… ప్రతి ఇంటికి వెళ్లాల్సిన బాధ్యతను మరొక్కసారి గుర్తు చేస్తున్నాను.

దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వానికి కలకాలం ఉండాలని, మరో అవకాశం మనందరి ప్రభుత్వానికి నిండు మనసుతో దేవుడు ఆశీర్వదించి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News