Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్NEP and challenges: నూతన విద్యా విధానం-సవాళ్ళు

NEP and challenges: నూతన విద్యా విధానం-సవాళ్ళు

లర్నింగ్ వితౌట్ బర్డెన్ ను ప్రోత్సహించటం మనదేశంలో చాలా ముఖ్యం

బ్రిటిష్ వారి కాలంలో ప్రవేశపెట్టబడిన “మెకాలే బేస్డ్ విద్యా విధానం” ఎంతమేరకు సఫలీకృతమైందన్నది పక్కన పెడితే బ్రిటీష్ వారి స్వార్ధము స్వలాభము ఈ విద్యా విధానం ద్వారా నెరవేరిందని చెప్పాలి. ఇక దేశానికి స్వాతంత్ర్యము వచ్చే నాటికి దేశ జనాభా సుమారు 28 కోట్లు అక్షరాస్యత శాతం 14% అంటే దీనిని బట్టి ఆంగ్ల విద్యా విధానం ఎంతమందికి అందుబాటులో ఉండేదో అర్ధం చేసుకోవచ్చును.
అధికార మార్పిడి జరిగిన తర్వాత మనకు మనం స్వతంత్ర్యంగా అడుగులు వేయడానికి పాలనాపరమైన మరియు విద్యా విధానాలు అస్త్రవ్యస్తంగా వున్న వ్యవస్థను గాడిన పెట్టడానికి నెహ్రు లాంటి మేధావికి మరియు వారి మంత్రివర్గంలో ఉన్న వారందరికీ కత్తి మీద సామే. ముఖ్యంగా దేశంలో అనేక రకాల సమస్యలు అప్పటికే తిష్ఠవేసుకుని వెక్కిరిస్తున్నాయ్. వాటి నుండి భయటపడటానికి, సంక్షోభం నుండి సమస్య పరిష్కారం వైపు చాలా సుదీర్ఘమైన ప్రయాణమే చేయాల్సి వచ్చింది అప్పటి ప్రభుత్వానికి ఇది ఎవరు కాదనలేరు కూడా. బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన ఆంగ్ల విద్యా విధానంతో పాటుగా దేశంలోకి దిగుమతి చేయబడిన మరొక మతం క్రైస్తవం, ఇది చాప క్రింది నీరులా విస్తరించింది, అంతకన్నా ముందుగానే దేశంలోకి ఇస్లాం మతం కూడా విస్తరించింది, గతంలో ఉన్న భౌద్ధం/ జైనం, ఇక హిందుమతం ఎలాగు ఉండనే వుంది. అందుకే “లౌకికపరమైన విద్యా విధానాన్ని” ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతోనే రాజ్యాంగంలోని “45వ నిబంధన” (Article – 45) 6-14 సంవత్సరాలలోపు బాలబాలికలకు “ఉచిత నిర్భంద ప్రాథమిక విద్య”ను అందించాలని సూచించింది.
అలాగే “విద్య” ఉమ్మడి జాబితాలో ఉండటం వల్ల రాష్ట్రాలకు నిధులు ఇస్తూనే కొంత స్వేచ్చను కూడా విద్యా సంస్థల విషయంలో ఇవ్వటం జరిగింది. బ్రిటీష్ వారి కాలంలోనే క్రైస్తవ మిషనరీలు, మదర్సాలు, గురుకులాలు ఉండటం వల్ల ఈ అస్తవ్యస్తంగా ఉన్న విద్యా విధానాన్ని ఒకే గొడుగు క్రిందకు తీసుకొనిరావాలన్న ఉద్దేశ్యంతోనే “సార్వత్రిక విద్యా విధానానికి” (Universal Education) అంకురార్పణ చేశారు. కానీ మత సంస్థలకు, మతానికి సంబంధించిన విద్యా సంస్థలకు కూడా రాజ్యాంగంలో అవకాశం కల్పించటంతో “కామన్ స్కూల్” విధానం కాస్తా అప్పుడే పక్కదారి పట్టిందేమో అనేది నా అభిప్రాయం. అదికాస్తా క్రమక్రమంగా శాఖోపశాఖలుగా విస్తరించి నేడు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లి విద్యా విలువలు వ్యాపారరంగు పులుముకోవటం, మతరంగు పులుముకోవటం ప్రారంభమైంది. ఫలితంగానే విద్యా విలువల పతనం నాటి నుండే ప్రారంభమైంది. విద్యకు సంబంధించి రాజ్యాంగం కల్పించిన అవకాశాలు ఏంటో ఒకసారి పరికిద్దాం 350 (A) నిబంధన దీని ప్రకారం ప్రాధమిక స్థాయిలలో మాతృ భాషలో విద్యా బోధనకు అవకాశాలు కల్పించాలి. దీనిని ఆధారం చేసుకునే కొఠారి కమీషన్ (1964-66) “త్రిభాషా సూత్రం” అమలు చేయాలని సూచించిందని గత వ్యాసంలో చెప్పటం జరిగింది. దీని ప్రకారం మాతృ భాష, జాతీయ భాష ఐన హిందీ అలాగే అంతర్జాతీయ భాష ఐన ఆంగ్లంలో బోధించాలనేది దీని యొక్క సారాంశం. ఇది క్రమంగా మాతృ బాషలు కనుమరుగయ్యేలా చేసింది. అంతెందుకు మన తెలుగు రాష్ట్రాలలోనే మన మాతృ భాష స్థానం ఏమిటో ఆత్మ విమర్శ చేసుకుంటే దేశం యొక్క ముఖ చిత్రం సృష్టంగా అవగతం అవుతుంది. రానురాను ఆంగ్ల భాషా ప్రాబల్యం పెరిగిపోవటం, ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలు, ఆంగ్ల భాషలో పట్టు సాధించిన వారికే ఉండటం వల్ల మాతృ భాషలు క్షీణించే పరిస్థితికి దాపురించాయి. కాని నూతన విద్యా విధానం మాతృ భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించటం మంచి పరిణామమే దీనిని పకడ్బందీగా అమలు చేయాలి.
ఇక 46 వ నిబంధన ప్రకారం షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలకు (SC, ST) విద్యా విషయంలో ఆర్ధిక ప్రయోజనాలు చదువుకోవడానికి కల్పించటం. దీని ద్వారా “సామాజిక న్యాయం” మరియు విద్యా విషయంలో వారిలో వెనుకబాటుతనంను దూరం చేయోచ్చన్న ఉద్దేశ్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాల వరకు సఫలీకృతం ఐనది, కానీ నేటికి కొంతమంది చదువుకు దూరంగా ఉంటున్నట్లు ఆర్ధిక గణాంకాలు చెప్తున్నాయ్, వీరి విషయంలో కూడా విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి వుంది. “ఆజాదికా అమృత్ మహోత్సవ” వేళ దేశంలోని స్త్రీలకు విద్యావకాశాలు నేటికి కొంతమందికి అందని ద్రాక్ష లాగే ఉన్నాయంటే అంటే ఎవరైన నమ్మగలరా? మన ప్రాచీన సంస్కృతి స్త్రీ విద్యను నిషేదించటం వల్ల దీనిని చేధించటానికి స్త్రీలు, మేధావులు పెద్ద ఎత్తున పోరాటమే చేయాల్సి వచ్చింది. అంతెందుకు 2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీల సగటు అక్షరాస్యత శాతం 65.46% అంటే దేశ జనాభాలో సుమారు 35% మంది మహిళలు విద్యకు దూరంగానే వున్నారనేది బహిరంగ రహస్యమే.
ఇది నూతన విద్యా విధానానికి అతిపెద్ద సవాలుగా మారనుంది తరగతి గదికి దూరంగా వున్న బాలికలను గుర్తించటం, నమోదు చేసుకోవటం వారికి విద్యా సదుపాయాలూ కల్పించటం, అతిపెద్ద సవాల్. బాలికలు ఉన్నత చదువులు చదివే వరకు అన్ని సదుపాయాలూ కల్పిస్తే కొంతమేర మంచి ఫలితాలు రాబట్టవచ్చు. అలాగే విద్యా విధానంలోని అసమానతలు తొలగించి సాధారణ విద్య అందరికి సమానంగా అందేటట్లు చర్యలు తీసుకొని స్త్రీలకు సమాన అవకాశాలు కల్పించటం, స్త్రీలను అబలలుగా, అసమర్ధులుగా పరిగణించే భావాన్ని తొలగించటం, ఉద్యోగాలలో సమాన అవకాశాలు కల్పించటం, బాలికల విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ కల్పించటం, పాఠశాలల్లో బాలికలకు మరుగుదొడ్లు, ఇతర మౌళిక సదుపాయాలు కల్పించి మహిళ టీచర్లను నియమించాలి. అదేవిధంగా సార్వత్రిక నమోదు (Universal Enrolment) బడికి దూరంగా (Dropout) వున్న వారిని గుర్తించి నమోదు చేసుకోవాలి మరియు సార్వత్రిక నిలుపుదల (Universal Retension) బడిలో చేరిన పిల్లలందరూ ప్రాథమిక విద్యనూ పూర్తిచేసే వరకు పాఠశాలలోనే విద్యనూ అభ్యసించేలా ప్రోత్సహించటం నిరంతరం పర్యవేక్షించటం, మెరుగైన సౌకర్యాలు కల్పించటం లాంటివి చేయాలి. అలాగే సార్వత్రిక సాధన (Universal Achievement) పాఠశాలలో చేరిన పిల్లలందరూ ఆశించిన కనీస “అభ్యసనా సామర్ధ్యాలు” (Minimum Level Of Learning) సాదిస్తున్నారా లేదా అనేది పరిశీలించాలి నిరంతర మరియు సమగ్ర మూల్యాంకనం (CCE) ప్రస్తుతం అమలులో వుంది. కాని ఇది పెద్దగా విజయం సాధించిన దాఖలాలు లేవు. దేశవ్యాప్తంగా ఇటీవలే యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ప్రకారం 14-18 సం.ల మధ్య వయసున్న విద్యార్ధుల్లో విద్యాకు సంబంధించిన పునాది నేటికి బలహీనంగా ఉందని తేల్చటం ఆశ్చర్యం కల్గించే అంశం. ఈ నివేదిక ప్రకారం 14-18 సం.రాల మధ్య వయస్సున్న వారిలో కేవలం 73.6% మంది పిల్లలు మాత్రమే స్టాండర్డ్ స్థాయి – 2 పుస్తకాన్ని చదువగల్గుతున్నారు. గణితంలో కేవలం 45% మందికే ప్రాథమిక నైపుణ్యం వుందనేది ఆ నివేదిక సారాంశం.
ఇక 2022లో విడుదలైన పీరియడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం నిరక్షరాస్యుల్లో సాధారణ స్థాయి వరకు చదువుకొన్నవారిలో నిరుద్యోగం రేటు వరుసగా 0.4%, 1.0% వుంది. విద్యావంతులైన వారందరికి ఉద్యోగాలు, సరైన ఉపాధి అవకాశాలు లభించటం లేదనేది, కేవలం 45% మంది చదువుకున్న యువత వారి వారి నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగాలు చేస్తున్నారని “మెర్సర్ మెటిల్” సంస్థ వెల్లడించటం మన విద్యా విధానంలోని డొల్లతనాన్ని తెలియజేస్తుంది. ఇది కూడా త్వరలో అమలు చేయబోయే నూతన విద్య విధానానికి పెను సవాల్ విసరనుంది. గత సం. ఏప్రిల్ లో విడుదలైన బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రకారం మనదేశంలో విద్యనభ్యసించిన పట్టభద్రుల్లో నైపుణ్యం పరిమితంగా ఉండటమో, లేక పూర్తిగా లేకపోవటం వల్ల నిరుద్యోగిత శాతం పెరుగుతుందని వెల్లడించింది. మరొక విచిత్రమైన అంశం ఏమిటంటే చదివిన డిగ్రీకి చేస్తున్న ఉద్యోగానికి సంబంధం లేకపోవటం ఆశ్యర్యకరమైన విషయం. దీని నివారణకు నూతన విద్యా విధానంలో చర్యలు చేపట్టాలి. ఇక ఉన్నత పాఠశాల స్థాయిలో ఆంగ్ల మాధ్యమాన్ని పటిష్ఠం చేస్తూనే “ప్రాజెక్ట్ బేస్డ్ విద్యా వ్యవస్థను” ప్రోత్సహించి పిల్లలను సెమిస్టర్ విధానం వైపు మల్లించాలి. ఎలాగు నూతన విద్యా విధానంలోకి (5+3+3+4) మన విద్యా విధానం మారబోతున్నందున కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు విద్యా గ్రాంట్లు, నిధులు ఎక్కువ కేటాయించి పాఠశాలల్లో, కళాశాలల్లో, అలాగే విశ్వ విద్యాలయాలలో మౌళిక సదుపాయాల టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఇతర సౌకర్యాల కొరతను నివారించడానికి ప్రణాళికాబద్దంగా చర్యలు చేపట్టి దేశవ్యాప్తంగా ఒకే రకమైన విద్యా విధానాన్ని (Common School System) ప్రవేశపెట్టాలి. ఇది ఆచరణాత్మకంగా అమలు జరిగేలాగా కేంద్రం మరియు రాష్ట్రాలు ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలి. ఆశ్రమ పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్సియల్ పాఠశాలలన్ని ఒక రకమైన విద్యా విధానం అన్ని తరగతుల వారికి ఉండేలా ప్రోత్సహించాలి. డెబ్బై ఆరు సంవత్సరాల స్వతంత్ర్య దేశంలో ఇంకా “కులపరమైన, మతపరమైన” విద్యా విధానాన్ని ప్రోత్సహించటం అనేది అనాలోచితమైన విధానం. “విద్య” అనేది వ్యాపార వస్తువు కాదని, విద్యా పరమావరధి మంచి సమాజాన్ని మంచిపౌరులను తీర్చిదిద్దేది విద్య ద్వారానే అనే మూల సూత్రాన్ని ప్రభుత్వాలు, వివిధ యజమాన్యులు గుర్తించాలి. విద్యా సంస్థల్లో పాఠ్య, సహాపాఠ్య, పాఠ్యేతర కార్యక్రమాలు ప్రోత్సహించి, శారీరక వికాసం పొందేవిధానంగా క్రీడలు మరియు వ్యాయామశాలలు, ఆట స్థలాలు, ప్రతి పాఠశాలలకు, ఉండేలా చర్యలు చేపట్టాలి. విద్యార్ధులు మానసిక వికాసం చెందేవిధంగా క్షేత్ర పర్యటనలు, ఎగ్జిబిషన్లు, సైన్సు ఫేర్లు మొదలైనవి నిర్వహించి పిల్లల్లో సృజనాత్మకామైన వైఖరులు పెంపొందే విధంగా తగుచర్యలు చేపట్టాలి అలాంటి విద్యార్ధులకు ప్రోత్సకాలు, విద్యాపరమైన రాయితీలు ఇచ్చే సదుపాయం ఆయా ప్రభుత్వాలు కల్పించాలి. అదేవిధంగా తరగతి గదిలో పిల్లలు “సులువైన బోధన గావించే విధంగా సులభం నుండి కఠినం వైపు మల్లించేల” విద్యా ప్రణాళికలు, పాఠ్యప్రణాళికలు రూపొందించాలి. అలాగే విద్యార్ధి ఒక తరగతి గది నుండి మరొక తరగతి మారటానికి “వృద్ధా” (Wastage) మరియు స్తబ్దతను (Stagnation) నివారించడానికి భారరహిత. అభ్యసనం (Learning Without Burden) విధానాన్ని ప్రోత్సహించాలి. వాటి కొరకు నెల వారి సమీక్షలు మరియు పర్యవేక్షణ జరగాలి. రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ (RMSA) ప్రకారం 2009-10 నుండి 2019-2020 వరకు సర్వశిక్ష అభియాన్ ప్రకారం చేసిన 82వ రాజ్యాంగ సవరణ 6-14 సం.రాల బాలబాలికలకు ఉచిత నిర్భంద ప్రాథమిక విద్యా అమలును ప్రతి ఆరు నెలలకొకసారి దేశవ్యాప్తంగా సమీక్ష చేయాలి. దేశవ్యాప్తంగా అమలు జరుతున్న మధ్యాహ్న బోజన పథకంలో పౌష్టికాహారం అందేలా చర్యలు చేపట్టాలి. ప్రాథమిక దశ నుండే కంప్యూటర్ పరిజ్ఞానం విద్యార్ధులలో పెరిగేలా దేశవ్యాప్తంగా చర్యలు చేపట్టాలి. దానికి అనుగుణమైన ఏర్పాట్లు అన్ని పాఠశాలలో మానవ వనరుల కొరత లేకుండా ఏర్పాట్లు చేయాలి. అలాగే కంప్యూటర్ విద్యకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు తక్షణమే అమలు జరిగేలా చూడాలి. ప్రతి పాఠశాలకు మరియు కళాశాలకు లేదా యూనివర్సిటీ స్థాయి వరకు తల్లిదండ్రుల భాగస్వామ్యం మరియు వారితో అనుసంధానం ఉండేలా సమన్వయం చేయాలి. విద్య ద్వారా ఆత్మ జ్ఞానాన్ని, సంపూర్ణమూర్తిమత్వాన్ని, నైతిక విలువలను సృజనాత్మక శక్తులను పెంపొందించేలా చర్యలు చేపట్టాలి. అలాగే జాతీయ సమైక్యతను, ప్రజాస్వామ్య విలువలు, లౌకిక విలువలు విద్యార్ధుల్లో పెంపొందే విధంగా విద్యా ప్రణాళికను రూపొందించాలి. పాఠ్యాంశాలు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక జీవన విలువలకు అనుగుణంగా రూపొందించాలి. స్కూల్ బ్యాగు బరువును, పిల్లలు చేస్తున్న అభ్యాసాలను తగ్గించాలని (భారరహిత అభ్యసనం) గతంలోనే యశ్పాల్ కమిటీ (1993) సూచించింది. దీనిని ప్రైవేట్ యాజమాన్యాలు ఎప్పుడో అటకకెక్కించాయి. తిరిగి కేంద్ర ప్రభుత్వం ఇటీవలె పుస్తకాల బరువును తగ్గించాలని సూచనప్రాయంగా అంగీకరించడం శుభపరిణామమే. ఇది కార్యరూపం దాల్చితే బాగుంటుంది. అలాగే ఇటీవలె CBSE చూచిరాతల పరీక్ష విధానాన్ని ఎంపిక చేసిన పాఠశాలల్లో 9 నుండి 12వ తరగతి విద్యార్ధులకు ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించటం ఆందోళన కల్గించే విషయం దీనిపై పునరాలోచించాలి. ఇది పిల్లలను తరగతి గది నుండి దూరం చేయడమే తప్ప దీనివల్ల ప్రయోజనం మనలాంటి దేశాలకు పెద్దగా ఉండదు. 150 కోట్ల మంది ఉన్న దేశానికి జపాన్, దక్షణ కొరియా లాంటి చిన్న దేశాలు తయారుచేస్తున్న ఎలక్ట్రానిక్ పరికరాలు దిగుమతి చేసుకుంటున్నామంటే లోపం ఎక్కడుందో ఓసారి విద్యా నిపుణులు ఆలోచన చేయాలి. అలాగే నూతన విద్యా విధానం అన్ని రాష్ట్రాలకు ఒకేసారి అమలు జరిగే విధంగా సాధ్యమైనంత తొందరగా చర్యలు తీసుకోవాలి.
పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు పిల్లలకు గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర మాదక ద్రవ్యాలు దొరికే స్థలాలుగా కొన్ని విద్యా సంస్థలు తయారైనాయి. అలాంటి సంఘటనలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యా ప్రమాణాలకు అనుగుణంగా విద్యా సంస్థలను తయారు చేయాలి. అర్హత వున్న అధ్యాపకులను నియమించి తరగతి గదిలోకి పిల్లల ప్రపంచాన్ని తీసుకొని రావాలి, తరగతి గది అంటే విద్యార్ధుల ప్రపంచంగా పిల్లలు భావించేలా ఏర్పాట్లు చేయాలి. తరగతి గది అంటే మానసిక ఒత్తిడితో కూడినదనే భావన విద్యార్దులలోంచి తొలగించాలి. భవిష్యత్తుకు తగిన అవసరాలను గుర్తించి కనీస అవసరాలు మరియు కనీస అభ్యాసన సామర్ధ్యాల స్థాయిని పెంచటమే కాకుండా “విద్య” అనేది మనిషి ప్రవర్తనలో మానసికపరమైన మరియు విశాలమైన ఆలోచనా దృక్పథం పెంపొందేలా వుండాలి అలాంటి విద్యా విధానమే భవిష్యత్తులో ఉత్తమ పౌరులను తయారు చేస్తుంది. అది దేశానికి కూడా ఉపయోగపడుతుంది.

- Advertisement -

డాక్టర్ మహ్మద్ హసన్
విద్యా విషయ నిపుణులు
సెల్ నెం.9908059234

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News