Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: 100 రోజుల ప్రణాళిక లక్ష్యాలు ఇవ్వండి

Nandyala: 100 రోజుల ప్రణాళిక లక్ష్యాలు ఇవ్వండి

జిల్లా కలెక్టర్ జి రాజకుమారి గణియా

నంద్యాల జిల్లాలోని రైతాంగం 75 శాతం వ్యవసాయంపై  ఆధారపడి జీవిస్తున్నారని వ్యవసాయ రంగాన్ని మరింత విస్తరించేందుకు వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు తీవ్ర కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఆదేశించారు.

- Advertisement -

కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో 100 రోజుల ప్రణాళికలో భాగంగా వ్యవసాయం, ఉద్యానం, ఇరిగేషన్, పరిశ్రమలు, అటవీ, మైనింగ్, నీటి వనరులు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఎనర్జీ, పశు సంవర్ధకం, మత్స్య శాఖ, తదితర అంశాలపై అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల సదస్సులో 100 రోజుల ప్రణాళికలో భాగంగా చేపట్టాల్సిన అంశాలపై దిశా నిర్దేశం చేశారని ఈమేరకు జిల్లాలో ప్రాధాన్యత రంగాలకు సంబంధించిన అన్ని శాఖలకు వంద రోజుల్లో చేపట్టాల్సిన పనులపై నివేదికలు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వ్యవసాయ రంగానికి సంబంధించి 2.3 లక్షల హెక్టార్లలో మాత్రమే రైతులు సాగు చేసుకుంటున్నారని పంట విత్తు విస్తీర్ణాన్ని 3 లక్షల హెక్టార్లు పెంచేందుకు లక్ష్యాన్ని నిర్దేశించుకొని సాధించేందుకు కృషి చేయాలన్నారు. కొంతమంది రైతులు ఒక పంటకే పరిమితమవుతున్నారని రెండు, మూడు పంటలు వేసుకునేలా ప్రోత్సహించాలన్నారు.

రైతులు ప్రోటీన్లతో కూడిన వరి నాట్లను సాగు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రైతు వేసిన ప్రతి పంటను ఈ క్రాప్ బుకింగ్ చేయాలన్నారు. అధునాతన వ్యవసాయ పద్ధతులు వినియోగించి రైతులకు ఖర్చులు తగ్గిస్తూ ఉత్పాదకత పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. లక్ష ఎకరాలలో సాంప్రదాయ సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు అవసరమయ్యే ఇన్పుట్లను సకాలంలో సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నంద్యాల పట్టణంలో ఉన్న సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ లో మరమ్మత్తులకు అవసరమయ్యే ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇవ్వాలన్నారు. జిల్లాకు కేటాయించిన  27 వేల  సిసిఆర్సి కార్డులు విఆర్ఓ నుండి ప్రతి రైతు చేతికి  వెళ్లడంతో పాటు పంట రుణాలు కూడా త్వరితగతిన  మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశానికి సంబంధించి ఫైల్ సర్క్యూలేట్ చేయాలన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు కంప్యూటరైజేషన్ చేసి సామర్ధ్యాన్ని పెంచడంతో పాటు నాబార్డ్ సహకారంతో రుణాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

పెండింగ్ లో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సంఘాల గోడౌన్లను త్వరితగతిన పూర్తి చేసి సంబంధిత సహకార సంఘాలకు అప్పగించాలన్నారు.పశు వైద్య సంచార వాహనాలను రైతుల ముంగిటకు తీసుకువెళ్లి పశు వైద్య చికిత్సలు అందించే కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని పశుసంవర్ధక శాఖ జెడిని ఆదేశించారు. పశుసంపదకు క్రమం తప్పకుండా రోగ నిరోధక టీకాలు వేయాలన్నారు. అవసరమైన ప్రదేశాల్లో పశుగ్రాస విత్తనాలను వేసి పంట ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో కుక్కల బెడద తీవ్రంగా ఉన్న నేపథ్యంలో నివారణకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. 2500 హెక్టార్లలో బిందు తుంపర్ల సేద్యానికి సంబంధించి పరికరాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఏపీఎంఐపి పిడిని ఆదేశించారు.

ఎరువులు క్రిమిసంహారక మందులను కూడా డ్రిప్ పరికరాల ద్వారా వేసే ప్రక్రియను రైతులలో అవగాహన కలిగించాలన్నారు. బిందు తుంపర్ల సేద్య నిర్వహణపై రైతులకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలు వందరోజుల ప్రణాళికలో భాగంగా చేపట్టాలన్నారు.పండ్ల తోటల పెంపకంలో భాగంగా మహానంది సుగంధ అరటికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు కృషి చేయాలన్నారు. డ్రాగన్ ఫ్రూట్ పండ్ల ఉత్పత్తి, అరటి పౌడర్ తయారు చేయడంతో పాటు మార్కెటింగ్ కు అవసరమయ్యే ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఆయిల్ ఫామ్ సాగును పెంచడంతో పాటు జిల్లాలో కేంద్రంలో నర్సరీ ప్లాంటును ఏర్పాటు చేయాలన్నారు. పాణ్యంలో ఉన్న ప్రైవేటు నర్సరీ యజమానులతో ఆధునిక పద్ధతుల ద్వారా మామిడి మొక్కలను అంటుకట్టే కార్యక్రమంపై శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.జిల్లాలో ఉన్న ఐదు రిజర్వాయర్లు, 124 ట్యాంకులలో చేపల ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలన్నారు.

కాల్ రొయ్య, కొర్రమీను మైనర్ ఇరిగేషన్ చెరువులలో ఉత్పత్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. చేపల మార్కెట్ నిర్మాణానికి కూడ చర్యలు తీసుకోవాలని సూచించారు.వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కల పెంపకం పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. జిల్లా అధికారులందరినీ అటవీ ప్రాంతంలో ఆహ్లాదకరమైన ప్రదేశానికి తీసుకెళ్లి వన మహోత్సవ భోజన ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అటవీ ప్రాంతంలో ట్రెంచ్ లు త్రవ్వెందుకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలన్నారు. నంద్యాల పట్టణంలో నగర వనాన్ని ఏర్పాటు చేసేందుకు తీసుకోవాలని ఫారెస్ట్ అధికారులను ఆదేశించారు. శ్రీశైల జలాశయ వెనుక జలాలను సమర్థవంతంగా వినియోగించుకొని అన్ని రిజర్వాయర్లు, సాగునీటి చెరువులను నింపుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. 80 శాతం మేర పూర్తయ్యి ప్రారంభానికి అనువుగా ఉన్న ప్రాజెక్టులు, నీటి వనరులకు అవసరమయ్యే నిధులకు అవసరమైన ప్రతిపాదనలు సమర్పిస్తే ప్రభుత్వం మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మైనింగ్ ఏడిని ఆదేశించారు. జిల్లాలోని కొత్త సిమెంటు పరిశ్రమలకు ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించారు. 331 కోట్ల రెవెన్యూ లక్ష్యాన్ని సాధించే దిశలో వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ ఇసుక, మట్టి రవాణ నియంత్రణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. జిల్లాలో మూతపడిన 160 సూక్ష్మ, మధ్యతరహ పరిశ్రమల పునఃస్థాపనకు చర్యలు తీసుకోవాలన్నారు. నంద్యాల పట్టణంలో ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఆళ్లగడ్డ,డోన్ పట్టణాలలో కూడా ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద రాయితీపై సోలార్ రూఫ్ టాప్ నిర్మాణానికి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఎనర్జీ అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ సోలార్ కిందికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు అవసరమైన ప్రతిపాదనలు ఇవ్వాలన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News