కొంతకాలంగా తగ్గుముఖం పట్టిన మహమ్మారి కోవిడ్-19 మళ్లీ మెల్లగా తన ప్రభావాన్ని చూపుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండగా, తెలుగు రాష్ట్రాల్లోనూ మళ్లీ అప్రమత్తత అవసరమవుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్న పరిణామం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో మూడు కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఓ మహిళకు వైద్యులు నిర్వహించిన పరీక్షలో కరోనా ఉందని నిర్ధారణ అయింది. అలాగే చిలకలూరిపేట ప్రాంతానికి చెందిన ఓ వృద్ధుడికి, బాపట్లకు చెందిన మరో మహిళకు కూడా వైరస్ సోకినట్లు తేలింది.
వైద్యుల సమాచారం ప్రకారం, ఈ ముగ్గురి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. తక్కువ లక్షణాలు మాత్రమే ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స చేయాల్సిన అవసరం లేకుండా ఇంటివద్దే ఐసోలేషన్లో ఉండాలని సూచించారు. ఈ వివరాలను సంబంధిత ఆరోగ్య శాఖ అధికారులకు ఆసుపత్రి సిబ్బంది తెలియజేశారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 10కు చేరుకుంది.
ఇక దేశ వ్యాప్తంగా పరిస్థితి చూస్తే, కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,000 మార్క్ను దాటినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అత్యధికంగా కేరళ రాష్ట్రంలో కొత్త కేసులు వెలుగు చూడగా, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటకల్లోనూ తీవ్రత ఎక్కువగానే ఉంది. బెంగళూరులో 84 ఏళ్ల వృద్ధుడు కొవిడ్ తో చనిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు మాస్కులు ధరించడం, చేతులు తరచుగా శుభ్రం చేసుకోవడం, రద్దీ ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉంది. కరోనా మళ్లీ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలే రక్ష.