రాష్ట్రంలో దివ్యాంగుల ఫించన్ల వెరిఫికేషన్ ఎంతో పారదర్శకంగా జరుగుతున్నదని రాష్ట్ర ఎమ్.ఎస్.ఎం.ఈ., సెర్ప్, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు ఎనిమిది లక్షల దివ్యాంగులకు సామాజిక భద్రతా ఫించన్లు పంపిణీ చేస్తామని, ఇందులో ఇప్పటి వరకూ 1.20 లక్షల ఫించన్ల వెరిఫికేషన్ పూర్తి అయినట్లు తెలిపారు. గతంలోని నియమ నిబంధనల ప్రకారమే ఈ ఫించన్ల వెరిఫికేషన్ జరుగుతున్నదని, అర్హులైన ఏ ఒక్కరికీ ఎటు వంటి అన్యాయం జరుగదన్నారు.
ఒక జోన్ లోని వైద్యులు మరో జోన్ లో ఈ వెరిఫికేషన్ను ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. ఎమ్.ఎస్.ఎం.ఈ.ల సర్వే కూడా ముమ్మరంగా సాగుతున్నదని, ఇప్పటి వరకూ 50 శాతం మేర సర్వే పూర్తయిందని, ఈ సర్వేకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తుది గడువు నిర్ణయించినట్లు మార్చి 15 కల్లా ఈ సర్వే పూర్తవుతుందని ఆయన తెలిపారు.