Alert in Tirupati Due to Delhi Bomb Blast: ఢిల్లీలో పేలుడు ఘటనతో ఆంధ్రప్రదేశ్ యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించాలని హోం శాఖ మంత్రి అనిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులతో ఆమె మాట్లాడారు.
Also Read: https://teluguprabha.net/national-news/high-alert-in-hyderabad-due-to-bomb-blast-in-delhi/
ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు ఘటనతో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. తెలంగాణ పోలీసులు హైదరాబాద్లో ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించగా.. ఏపీలోనూ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ప్రధానంగా భక్తుల రద్దీ అధికంగా ఉండే తిరుపతిలో పోలీసులు అలర్ట్ అయ్యారు. తిరుపతి రైల్వే స్టేషన్, బస్టాండ్, టీటీడీ వసతి గృహాలు, అలిపిరి టోల్గేట్, కాలి నడక మార్గంలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. తిరుమలకు వెళ్లే వాహనాలను తనిఖీలు చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ సంతాపం
ఢిల్లీ పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. శక్తిమంతమైన దేశాల్లో భారత్ ఒకటిగా ఎదుగుతున్న వేళ ఇలాంటి ఘటన జరగడం బాధాకరమన్నారు. ఇలాంటి చర్యలు దేశ ఐక్యతను భగ్నం చేయలేవని స్పష్టం చేశారు.
112 కి సమాచారం ఇవ్వండి
కాగా, హోం మంత్రి అనిత ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించినట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. అసాంఘిక సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని జిల్లాల పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రద్దీ ప్రాంతాలు, మాల్స్, హోటళ్లలో తనిఖీలు చేపట్టాలని ఎస్పీ, డీఐజీ, ఐజీలను ఆదేశించారు. అనుమానాస్పద వస్తువులు, మనుషులు కనిపిస్తే 112కి సమాచారం ఇవ్వాలని డీజీపీ స్పష్టం చేశారు.


