కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit shah) మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) డిమాండ్ చేశారు. పార్లమెంట్లో అంబేద్కర్పై అమిత్ షా వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనమని ఆమె మండిపడ్డారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
‘బాబాసాహెబ్ అంబేద్కర్పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనం. భారత రాజ్యాంగానికి ఇది ఘోర అవమానం. దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ ప్రజల మనోభావాలు తీవ్రంగా దెబ్బతీసినట్లే. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతినీ అమలు చేసేందుకు సంఘ్ పరివార్ కుట్రలో భాగమే ఇదంతా. మనుస్మృతినీ బీజేపీ విశ్వసిస్తుంది కాబట్టే అనుక్షణం రాజ్యాంగంపై దాడి చేస్తోంది. రాజ్యాంగ నిర్మాతను ప్రతిసారి హేళన చేస్తోంది. మన రాజ్యాంగం మీద, మన జాతీయ జెండా మీద బీజేపీకి గౌరవం లేదని మరోసారి నిరూపితం అయ్యింది. అంబేద్కర్ను అవమానించినందుకు అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పాలి. మంత్రి పదవికి తక్షణం రాజీనామా చేయాలి. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా AICC పిలుపు మేరకు ఇవ్వాళ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం చేయాలని కోరుతున్నాను’ అంటూ ఆమె తెలిపారు. .
కాగా లోక్సభలో అమిత్ షా మాట్లాడుతూ.. విపక్షాలకు అంబేద్కర్ అనే పదం వాడటం ఫ్యాషన్గా మారిపోయిందన్నారు. అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్ ఇదే పదం జపిస్తూనే ఉంటారని.. దీనికి బదులుగా దేవుడి పేరు జరిపేస్తే ఏడు జన్మల పుణ్యం దక్కుతుందని తెలిపారు. దీంతో అమిత్ షా వ్యాఖ్యలపై ఇండియా కూటమి నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమానించిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.