Andhra Pradesh Crime: కట్నం కోసం సొంత భార్యపై దాడి చేయించాడు ఓ పోలీసు అధికారి. భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై దాడి చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న చల్లా ప్రవీణ్ కుమార్ కు ఖమ్మం జిల్లాకు చెందిన రాజ్యలతతో వివాహం జరిగింది. కట్నం విషయంలో గత కొన్నిరోజులుగా ఇద్దరి మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి.
అయితే పెళ్లి సమయంలో వరుడు చల్లా ప్రవీణ్ కుమార్కు కట్నం కింద రూ.10 లక్షలు, 3 ఎకరాల పొలం, ఒక డబుల్ బెడ్ రూం ఇల్లు, ఒక ప్లాట్ బహుమతిగా ఇచ్చారు. అయితే కట్నం కింద ఇచ్చిన 3 ఎకరాల భూమి, ఒక డబుల్ బెడ్ రూం ఇల్లు తన పేరున రిజిస్టర్ చేయలేదని నిత్యం గొడవలు పడుతున్నాడు. 6 నెలలుగా తనను సొంతింటికి పంపకుండా ప్రవీణ్ కుమార్ చిత్రహింసలు పెట్టాడని అతని భార్య ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ క్రమంలో సమస్య పరిష్కారం కోసం పెద్దల సమక్షంలో మాట్లాడుతుండగా ఎస్సై ప్రవీణ్ కుమార్ పట్టలేని కోపంతో రగిలిపోయాడు. అతని భార్యతో పాటు ఆమెకు సాయంగా వచ్చిన కుటుంబ సభ్యులపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఎస్సై ప్రవీణ్ కుమార్.. విజయవాడ జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి గ్రామానికి చెందినవారు. ఈ క్రమంలో పెద్దల పంచాయితీని తన స్వంత ఊరైనా చిల్లకల్లులో ఏర్పాటు చేయగా.. అక్కడే తన భార్యతో సహా వారి కుటుంబసభ్యులపై దాడి జరిగింది.


