AP Rains Weather Report: వర్షాకాలంలో.. వేసవి తరహా వాతావరణంతో అవస్థలు పడుతున్న రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించనుంది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు మళ్లీ జోరందుకునేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఈ శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు మరింత ఉధృతంగా కురిసే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే రెండు వారాల్లో ఎక్కువ రోజులు వర్షపాతం నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
వెనువెంటనే అల్పపీడనాలు..
ఇప్పుడు రుతుపవనాల కారణంగా మేఘావృతం అవుతున్న నేపథ్యంలో.. ఎండ తీవ్రత తగ్గే అవకాశముందని, ఈ సీజన్ చివరి వరకు రుతుపవనాలు చురుగ్గా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వారం రోజులుగా పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో ఈ నెల 13 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. ఇది పశ్చిమ దిశగా కదులుతుందని అంచనా. తర్వాత వెనువెంటనే అల్పపీడనాలు ఏర్పడతాయని, తుపాన్లుగా బలపడే పరిస్థితులు ఉన్నాయని కొన్ని వాతావరణ నమూనాలు అంచనా వేస్తున్నాయి.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/andhra-premier-league-season-4-opening-visakhapatnam/
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
అమరావతి వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం, ఈ శుక్రవారం, శనివారంతో పాటు, వచ్చే వారంలో మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. గురువారం నెల్లూరు, కోనసీమ, కాకినాడ, వైఎస్సార్ కడప, అనకాపల్లి, ప్రకాశం, అనంతపురం, ఏలూరు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లాలోని వింజమూరులో గరిష్టంగా 73.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.


