AP Cabinet Decisions: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 42 నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అమరావతిలో రెండో విడత భూ సమీకరణపై కీలక నిర్ణయం తీసుకుంది. 44 వేల ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి విడత భూ సమీకరణకు వర్తించిన నిబంధనలే దీనికి వర్తిస్తాయని తెలిపింది.
‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాలు ఇంచార్జ్ మంత్రి నేతృత్వంలో జిల్లా స్థాయిలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఏడాది పాలన విజయాలను జూలై 1 నుంచి ఇంటింటికీ తీసుకెళ్లే కార్యాచరణ రూపొందించామన్నారు. స్వర్ణాంధ్ర పీ4పై త్వరలో కమిటీలు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జిల్లా పరిధిలో జిల్లా ఇంచార్జి మంత్రులు చైర్మన్ గా, నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే చైర్మన్ గా ఈ కమిటీ ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.
ప్రతీ నియోజవర్గ కేంద్రంతో పాటు మండలంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలని చెప్పారు. కాంటీన్ల నిర్వహణ, పర్యవేక్షణ, విరాళాలకు ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ నేతలు ఏకమై మాట్లాడుతున్నారని చర్చించారు. తెలంగాణలో అనుమతి లేని ప్రాజెక్టులు ఎన్నో కడుతున్నారని.. వాళ్లు వాడుకోగా మిగిలిన నీళ్లే మనం వాడుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు. ఈ విషయాన్ని రెండు రాష్ట్రాల ప్రజలకు స్పష్టంగా అర్థమ్యేలా చెప్పాలని సూచించారు.
టెన్నిస్ క్రీడాకారుడు మైనేని సాకేత్ సాయికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపింది. గండికోటలో ఓబెరాయ్ రిసార్ట్స్ నిర్మాణం కోసం 50 ఎకరాలు భూమి ఇచ్చేందుకు కూడా ఆమోదం తెలిపింది. పురపాలక శాఖలో 40 బిల్డింగ్ ఇన్ స్ట్రక్టర్లల పోస్టుల అప్ గ్రేడ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భవన నిర్మాణ చట్టంలో నిబంధనలను సవరించింది.
రాష్ట్రంలోని తాజా రాజకీయాలపై సైతం మంత్రివర్గంలో చర్చ జరిగింది. ఇటీవల జగన్ పర్యటనలో రప్పా.. రప్పా ప్లకార్డులపై ప్రస్తావన వచ్చింది. రప్పా.. రప్పా వ్యాఖ్యల విషయంలో వైసీపీపై ప్రజల్లో నెగటివ్ వచ్చిందని మంత్రులు అభిప్రాయపడ్డారని సమాచారం. పైగా ఆ వ్యాఖ్యలను జగన్ సమర్థించడం ఆ పార్టీకి మరింత డ్యామేజ్ అయిందని మంత్రులు తెలిపారు.
AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అమరావతిలో భూసేకరణకు గ్రీన్ సిగ్నల్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES