AP Cabinet Key Decisions: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో 40కి పైగా అజెండా అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా చర్చిస్తున్న పొదుపు చర్యలపై కేబినెట్ తీర్మానం చేసింది. ఈ మేరకు మంత్రి కొలుసు పార్థసారథి మంత్రివర్గ నిర్ణయాలు వెల్లడించారు.
నో వెహికల్ డే..
వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’ పాటించాలని కేబినెట్ తీర్మానించింది. ఆ రోజున మంత్రులు ప్రభుత్వ వాహనాలు కాకుండా ఈవీ వెహికల్స్, సైకిళ్లు లేదా ప్రజా రవాణాను వినియోగించాలని మంత్రివర్గం భావించింది. ఇంధనం, విద్యుత్ పొదుపుపై ప్రజల్లో అవగాహన కోసం ‘నాదేశం – నా బాధ్యత’ పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహించాలని భావించింది.
Also Read: https://teluguprabha.net/national-news/cm-vijays-sensational-decision/
విదేశీ పర్యటనలు రద్దు
మంత్రుల విదేశీ పర్యటనలను కొన్నాళ్ల పాటు పూర్తిగా రద్దు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్తో పాటు మంత్రుల భద్రతా కాన్వాయ్ వాహనాల సంఖ్యను తగ్గించారు. జిల్లాల పర్యటనల్లో ఖర్చులు తగ్గించుకుంటూ, మెజారిటీ మీటింగులను వర్చువల్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించాలని తీర్మానించింది. విద్యుత్ పొదుపులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల ఉష్ణోగ్రతను 24 నుంచి 27 డిగ్రీల మధ్యే నిర్వహించాలని, ఎక్కువగా సోలార్ ఎనర్జీని వాడాలని సీఎం ఆదేశించారు.
వర్క్ ఫ్రం హోం
ఆఫీసులకు నేరుగా రావాల్సిన అవసరం లేని ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పించే అంశంపై మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనివల్ల కార్యాలయాల్లో నిర్వహణ ఖర్చులు, విద్యుత్ వినియోగం తగ్గుతుందని భావిస్తున్నారు.
Also Read: https://teluguprabha.net/national-news/sir-process-will-start-in-telugu-states-from-june/
అభివృద్ధి పనులకు ఆమోదం
రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంగా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ సిఫార్సు చేసిన రూ. 2,01,023 కోట్ల పెట్టుబడులతో కూడిన 25 ప్రాజెక్టులకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. విశాఖపట్నంలో రూ. 1 లక్ష కోట్లతో రిలయన్స్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆమోదం లభించింది. తిరుపతిలో రూ. 2,500 కోట్లతో రాయల్ ఎన్ఫీల్డ్ మోటర్ సైకిళ్ల తయారీ యూనిట్ ఏర్పాటు కానుంది. సత్యసాయి జిల్లాలో రూ. 51,000 కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్, కడపలో రూ. 12,000 కోట్లతో అదానీ హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటితో పాటు ఆటోమొబైల్, సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లోని పలు ప్రాజెక్టులకు భూ కేటాయింపులు జరిపారు.

