AP CM Chandrababu Singapore Tour: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో బిజీగా గడుపుతోన్న సంగతి తెలిసిందే. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలతో వరుసగా సమావేశం అవుతున్నారు. ఇందులో భాగంగా మూడో రోజైన నేడు (జులై 29, మంగళవారం) ఆయన పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు. దాదాపు పదికి పైగా సమావేశాల్లో పాల్గొనున్నారు.
ముఖ్యంగా నేడు ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్టెక్ రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ఎయిర్ కండిషనింగ్, కూలింగ్ టెక్నాలజీలో మేటి సంస్థ అయిన క్యారియర్, ప్రపంచంలోనే అతిపెద్ద అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలలో ఒకటైన విల్మర్, మైక్రో ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రపంచశ్రేణి కంపెనీ అయిన మురాటా సంస్థ సహా టీవీఎస్ ప్రతినిధులతో చంద్రబాబు చర్చలు జరపనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యూట్యూబ్ అకాడమీతోనూ ఒప్పందం చేసుకోనుంది.
ఇంకా సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగ రత్నం, మాజీ ప్రధాని లీ హ్సియన్ లూంగ్లతో కూడా సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. అలాగే గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతోనూ సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్లో డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ ఆధారిత, క్లౌడ్ ఆధారిత సేవలు, డిజిటల్ ఇండియా లక్ష్యాలపై గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి ఈ సమావేశంలో చర్చించనున్నారు.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/minister-narayana-said-good-news-to-tdp-cader-today/
అంతకుముందు సోమవారం (జులై 28) ‘ఏపీ-సింగపూర్ బిజినెస్ ఫోరం’ తరఫున సీఐఐ భాగస్వామ్య సమ్మిట్ రోడ్షోలో పాల్గొన్న చంద్రబాబు.. విశాఖలో నవంబరులో నిర్వహించే భాగస్వామ్య సదస్సుకు సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అమరావతిని గొప్ప నగరంగా తీర్చిదిద్దబోతున్నామని సీఎం పేర్కొన్నారు.


